
జైల్ భరో ఉద్రిక్తం
పోలీసుల కన్నుగప్పి చౌరస్తాలో ప్రత్యక్షమైన జేఏసీ నాయకులు
ఒక్కసారిగా ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు
32 మందిపై కేసు నమోదు, అరెస్ట్ మద్దూరు పీఎస్కు తరలింపు
జనగామ : జిల్లా కోసం జేఏసీ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమంతో జనగామలో ఉత్కంఠ నెలకొంది. జేఏసీ చైర్మన్ కోసం పోలీసుల వెతుకులాట.. జైల్ భరోను భగ్నం చేసేందుకు పకడ్బందీ వ్యూహాల నడుమ సోమవారం జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం వరకు ని ర్మాణుష్యంగా ఉన్న ఆర్టీసీ చౌరస్తాలో ఒక్క సారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జాతీయ రహదారిపై నలుదిక్కులా కాపలా ఉన్న పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పోలీసులు రహదారికి రెండు వైపులా గట్టి బందోబస్తు చేపట్టారు. ఉదయం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కాన్వాయ్ ఆర్టీసీ చౌరస్తా మీదుగా వెళ్లిపోవడం తో వారు ఊపిరి పీల్చుకున్నారు. హైవేపై దృష్టి సారిస్తున్న పోలీసుల కన్నుగప్పి జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ప్రతినిధి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, జేఏసీ నాయకుడు ఆకుల వేణు గోపాల్రావులు ఉదయం 11.00 గంటలకు ఒక్కొక్కరుగా ఆర్టీసీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రత్యక్షమయ్యారు. అంతలోనే తేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని ప్రత్యేక వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో పెనుగులాడిన దశమంతరెడ్డిని బలవంతంగా వ్యాన్లో ఎక్కించి, పీఎస్కు తరలించారు.
మరో నాయకుడు ఆకుల వేణుగోపాల్రావు తప్పించుకుని స్టేషన్కు వెళ్లే క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అక్కడకు చేరుకుని అంబేద్కర్ విగ్రహం ఎదు ట బైఠాయించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించుకుంటున్న జక్కుల వేణుమాధవ్తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేఏసీ చైర్మన్తో పాటు మరో 31 మందిని పటిష్ట బందో బస్తు మధ్య మద్దూరు పీ ఎస్కు తరలించారు. కాగా, రైల్వేస్టేషన్, కోర్టు, ఏరియా ఆస్పత్రిలో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు.