
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమయ్యారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు ఆధ్వర్యంలో మెనిఫెస్టో కమిటీ త్వరలోనే పార్టీకి సంబంధించిన మెనిఫెస్టోను అందజేస్తుందని తెలిపారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని అభ్యర్థులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయండని, టికెట్ వచ్చిందని గర్వపడొద్దని సూచించారు. నియోజక వర్గంలోని అన్నిస్థాయిల్లో నేతలను కలుపుకోవాలన్నారు. ప్రతీ నియోజక వర్గానికి వస్తానని, ఒక్కో రోజు రెండు మూడు నియోజక వర్గాల్లో పర్యటిస్తానని తెలిపారు. అసంతృప్తి నేతలుంటే ఎమ్మెల్యే అభ్యర్థులే బుజ్జగించాలని సూచించారు. మరో సమావేశంలో కలుద్దామని అభ్యర్థులకు కేసీఆర్ చెప్పారు.
తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ ఉందని దాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని కేసీఆర్ పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment