
ప్రాణ నష్ట నివారణకు చర్యలు
వడగాడ్పులపై ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పులు, అకాల వర్షాలు, దుర్భిక్షం వంటి అసాధారణ వాతావరణ పరిస్థి తుల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపా ధ్యక్షుడు ఎస్.నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఆయా అంశా లపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని బుధవారం ఇక్కడ జరిగిన సదస్సులో తెలిపారు. కరవు, వాతావరణ మార్పులు తదితరాలపై దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేసిన కారణంగా అసాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపిం చారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోం దని, నదీజలాలను సమర్థంగా వాడుకుంటూ పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా వడగాడ్పుల తీవ్రతను తగ్గించగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. హరిత హారం ఉద్దేశం కూడా ఇదేనన్నారు. నగరీకరణ ప్రణాళికాబద్ధంగా జరగకపో వడం వల్ల చిన్నపాటి వర్షానికే నగరం జలమయమవుతోందని, భవిష్యత్తులో మాత్రం అలా జరగబోదన్నారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) డైరెక్టర్ డాక్టర్ వై.వీ.ఎన్.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉందని చెప్పారు. మిషన్ కాకతీయలోనూ ఎన్ఆర్ఎస్సీ కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.వి.ఆర్.శేషసాయి, ఇండియన్ మెట్రలాజికల్ సొసైటీ చైర్మన్ (హైదరాబాద్) కె.హనుమంతరావు, తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు.