
సాక్షి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులను వాడుకొన్న ప్రభుత్వం, ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని, అందుకే ఆర్టీసీని ప్రైవేటు పరం చెయ్యాలని చూస్తోందని విమర్శించారు. జిల్లాలో బుధవారం జరిగిన ఆర్టీసీ కార్మికుల సభలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆర్టీసీ గుండె కాయ వంటిదని కోదండరాం అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లను పెట్టి బస్సులను నడపడం బాధాకరమని, ప్రగతి భవన్లో కూర్చున్న సీఎం కేసీఆర్కు కార్మికుల బాధలు పట్టవని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజల మద్దతు ఉందని, న్యాయం జరిగే వరకు కార్మికులకు అండగా ఉంటామని ఆయన హామి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment