
సాక్షి, హైదరాబాద్: మార్చి నెల ముగిసేందుకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ నిర్దేశిత టార్గెట్ పూర్తి కోసం శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 31 అర్థరాత్రి వరకు అధికారులు విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆ రోజు పలు బ్యాంకులు తెరిచే ఉండనున్నాయి. బ్యాంకుల్లో జమ చేసిన, ఆన్లైన్లో చెల్లించిన పన్నుల లెక్కలు పూర్తి చేయడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పని చేయనున్నారు. ఇంకా 48 గంటలే మిగిలి ఉండటంతో అధికారులు టార్గెట్పై దృష్టి కేంద్రీకరించారు. ఏ డీలర్ రిటర్న్స్ దాఖలు చేయలేదు.. ఎంత బకాయి ఉందనే అంశాలను పరిశీలిస్తున్నారు. నగరంలోని ఏ వాణిజ్య పన్నుల కార్యాలయానికి వెళ్లినా శుక్రవారం ఇదే సీన్ కనిపించింది. ఉన్నతాధికారులు సిబ్బందికి ఎప్పటికప్పుడు యాప్ల్లో టార్గెట్లను నిర్దేశిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
భారీగా పెరగనున్న పన్ను రాబడి...
గత ఏడాది కంటే ఈసారి వాణిజ్య పన్నుల రాబడి పెంచడానికి ఉన్నతాధికారులు శ్రమిస్తున్నారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్, కమిషనర్ అనిల్కుమార్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే ఎంట్రీ టాక్స్ ద్వారా రూ.800 కోట్లు వసూలు అయింది. గత ఏడాది మార్చి నెలలో రూ.923 కోట్లు వసూలు కాగా, ఈ సారి మార్చి నెల 25వ తేదీ నాటికి రూ.1,070 కోట్లు వసూలు అయ్యాయి. మిగిలిన ఆరు రోజుల్లో ఇంకో రూ.300 కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై 3 రోజుల క్రితం సోమేశ్కుమార్ 1,300 మంది సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment