శాంతిని కోరుకోవాలి
Published Wed, Mar 1 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
► సినీ దర్శకుడు కె.విశ్వనాథ్
►హన్మకొండలో శాంతిదూత అవార్డుల ప్రదానం
హన్మకొండ కల్చరల్ : మనమంతా శాంతిని కోరుకోవాలని, శాంతియుతంగా ప్రవర్తిస్తేనే శాంతి అన్వయిస్తుందని ప్రముఖ సినీదర్శకుడు కళాతపస్వీ డాక్టర్ కె. విశ్వనా«థ్ అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హన్మకొండలో ప్రపంచ శాంతి పండుగ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కె.విశ్వనా«థ్కు, ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి, సహృదయ అనాథ వృద్ధుల శరణాలయం వ్యవస్థాపకురాలు యాకూబీలకు శాంతిదూత అవార్డులు ప్రదానం చేశారు.వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వనా«థ్ మాట్లాడుతూ తాను సినీదర్శకుడినే గానీ శాంతి కోసం చేసిందేమీ లేదని, తనకు అవార్డు ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి మాట్లాడుతూ తాను పుట్టిపెరిగిన వరంగల్ జిల్లాలో తనకు సన్మానం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో మేధావులు తమ పరిశోధనల ద్వారా నిజాలను వెలికితీయాలని కోరుకుంటున్నానని అన్నారు. జైహింద్ నినాదం మొదట ఉచ్ఛరించింది, త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది. అండమాన్ జైలు నిర్మించిన తరువాత మొదటి ఖైదీగా వెళ్లిందీ హైదరాబాద్కు చెందిన ముస్లిమ్లేనని, మొదటి ఇండోపాక్ యుద్ధంలో, 1965లో జరిగిన యుద్ధంలో నూ పరమవీర్చక్ర అవార్డులు అందుకున్నది ముస్లిం సైనికులేనని అన్నారు. అలాగే తెలంగాణలో ముల్కిరూల్స్ వచ్చింది నార్త్ ఇండియన్స్ కోసమని, ఇలాంటి ఎన్నో నిజాలను చరిత్రకారులు వెలుగులోకి తీయాలని అన్నారు.
తాను శాంతికోసం పాటుపడతానని అన్నారు. యాకుబ్బీ మాట్లాడుతూ తాను వృద్ధులకు చేస్తున్న సేవ చిన్నది అనుకున్నానని, ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా తాను చేస్తున్న పని విలువ తెలిసిందని, ఇకపై 200 మంది వృద్ధులకైనా సేవచేయాలన్న అలోచన కలిగిందని అన్నారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మానవత్వానికి గుర్తుగా శాంతి పండుగను జరుపుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాంతబయోటెక్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు, పీస్ సొసైటీ కార్యదర్శి, సామాజిక వేత్త అనీస్ సిద్ధిఖీ, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, పీస్ సొసైటి వ్యవస్థాపకుడు మహ్మద్ సిరాజుద్దీన్, సహృదయ అనాథాశ్రమం నిర్వహకులు మహ్మద్ మహబూబ్ఆలి (చోటు), కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, లయన్ జిల్లా పురుషోత్తం, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాస్రావు, ఆచార్య భద్రునాయక్, ఆచార్య విజయ్బాబు, డా. సురేష్లాల్, నిమ్మ శ్రీనివాస్, శనిగారపు రాజమోహన్, డా. శ్రీదేవి, డా. కృష్ణారావు, సయ్యద్ సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ప్రముఖుడు గట్టు మహేష్బాబు అవార్డుగ్రహితలచే శాంతిప్రతిజ్ఞ చేయించారు.
Advertisement
Advertisement