ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం బాంబుల పేలుళ్లు సంభవించి దాదాపు 25 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.
ఇరాక్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం బాంబుల పేలుళ్లు సంభవించి దాదాపు 25 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. ఈ ఘటనలో మరో 47మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. భద్రత దళాలు లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు పేలుళ్లు జరిగాయని చెప్పారు. గాయపడిన వారంతా దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
రమదాలోని ఆర్మీ చెక్పోస్ట్పై ఆత్మహుతి జరిపిన దాడిలో 10 మంది సైనికులు మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. అలాగే డుజైల్లో నగరంలో రోడ్డు పక్కన ఉన్న బాంబు పేలుడు సంభవించడంతో ఆ సమీపంలో పెళ్లి వేడుకలకు హాజరైన అతిథుల్లో ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో 21 మంది గాయాలపాలు అయ్యారు. అస్లాహ్ లోని ఇరాకీ ఆర్మీ చెక్ పోస్ట్పై ఆగంతకుడు జరిపిన తుపాకి కాల్పుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు.
బాత్ నగరంలో రోడ్డు పక్కన బాంబు పేలి శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న ఇద్దరు సైనికులు దుర్మరణం చెందారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడడారు. ముసలా నగర తూర్పు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. వీటితోపాటు తాల్ అఫర్లో కారు బాంబు పేలి ఎనిమిది మంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. కిర్క్లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద పార్కింగ్లో ఉంచిన కార్ విస్పోటనంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.