
ఈజిప్టులో ఆగని హింస
కైరో: పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి మద్దతుగా ముస్లిం బ్రదర్హుడ్ సాగిస్తున్న నిరసనలను ఒకవైపు ప్రభుత్వ బలగాలు అణచివేసేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు మిలిటెంట్లు సైతం ప్రభుత్వ బలగాలపై తిరగబడుతుండటంతో ఈజిప్టులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈజిప్టులోని సరిహద్దు నగరమైన రఫాలో మిలిటెంట్లు జరిపిన దాడిలో 25 మంది పోలీసులు మరణించారు.
పోలీసులపై దాడిని ఈజిప్టు తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరోవైపు కైరో జైలులో ఉన్న 612 మంది తమ సభ్యులను విడిపించేందుకు ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు విఫలయత్నం చేశారని, వారి దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. వారిని అబు జాబాల్ జైలుకు తరలిస్తుండగా, సాయుధలైన ముస్లిం బ్రదర్హుడ్ సభ్యులు దాడికి దిగారని, ఖైదీల్లో కొందరు ఒక మిలటరీ అధికారిని బందీగా పట్టుకున్నారని తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలకు, ‘బ్రదర్హుడ్’ సభ్యులకు నడుమ జరిగిన పరస్పర కాల్పుల్లో, తొక్కిసలాటలో 36 మంది ఖైదీలు (బ్రదర్హుడ్ సభ్యులు) మరణించారని ఈజిప్టు అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఖైదీలు ట్రక్కులో ఉండగానే ప్రభుత్వ బలగాలు వారిని కుట్రపూరితంగా హత్య చేశాయని, ‘బ్రదర్హుడ్’ ఆరోపించింది. అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.
ముబారక్ విడుదలకు కోర్టు ఆదేశాలు: పదవీచ్యుత ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ విడుదలకు కైరోలోని ఒక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక అవినీతి కేసులో ముబారక్పై విచారణ పెండింగులో ఉండగా, ఆయన విడుదలకు కోర్టు ఆదేశించడం గమనార్హం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ముబారక్ ఈ వారంలోనే విడుదల కానున్నారు. ముబారక్ విడుదలతో ఈజిప్టులో పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.