
సీఎం యోగి నిందితుడిగా ఉన్న..
గోరఖ్పూర్ అల్లర్ల రికార్డులు తీసుకురండి: హైకోర్టు
అలహాబాద్: 2007లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అన్ని రికార్డులతో వ్యక్తిగతంగా హాజరు కావాలని యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అలహాబాద్ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ కేసులో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితుడిగా ఉన్నారు. ఈనెల 11న ప్రధాన కార్యదర్శి తమ ముందు హాజరై, అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ ఉమేశ్ చంద్ర శ్రీవాత్సవల డివిజన్ బెంచ్ ఆదేశించింది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీ–సీఐడీ సీఎం చేతుల్లో ఉండడంతో పాటు సాక్షాత్తు ముఖ్యమంత్రే నిందితుడు కావడంపై పర్వేజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ఏదైనా స్వతంత్ర ఏజెన్సీకి కేసును అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో యోగితో పాటు అప్పటి గోరఖ్పూర్ మేయర్ అంజూ చౌదరీ, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్దాస్ అగర్వాల్ నిందితులుగా ఉన్నారు.