రైలు ప్రమాదంలో 30 మంది మృతి
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
పలువురు కొట్టుకుపోతుండగా చూశామన్న సాక్షులు
హర్దా: మధ్యప్రదేశ్ లోని హర్దా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు రైళ్లు పట్టాలు తప్పి నదిలో పడిపోయిన విషయం తెలిసిందే.
మచక్ నది పొంగి పొర్లుతుండగా ఆ నీటిలో మునిగిపోయిన బ్రిడ్జిని దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లు పట్టాలు తప్పడంతో పలువురు నీళ్లలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలామంది నీళ్లలో కొట్టుకుపోతుండటం తాము చూశామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు.