
'సీఎం.. సోమరిపోతు'
బి.కొత్తకోట : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమరిపోతుగా మారారని, టీడీపీ ఎమ్మెల్యేలు దద్దమ్మలుగా తయారయ్యారని సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి రామానాయుడు విమర్శించారు. జిల్లాలో కుప్పం తప్ప మిగతా ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి జరగడంలేదని మండిపడ్డారు. గురువారం బి. కొత్తకోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అత్యంత వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గం కరువు కాటకాలతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తంబళ్లపల్లి అభివృద్ధిపై కలెక్టర్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరు, గాజులమాండ్యం చక్కెర కర్మాకారాలకు సంబంధించి 250 ఎకరాల భూమిని కారుచౌకకు టీడీపీ నేతలకు అప్పగించేందుకు సర్కార్ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని తాము ప్రతిఘటిస్తామని చెప్పారు.