
సీఎం అభ్యర్థిగా నేనుంటే..
పట్నా: బీజేపీ తరఫున బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని సోమవారం బాలీవుడ్ నటుడు, ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. బిహార్ ముద్దుబిడ్డనైన తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే తన అభిమానులు, మద్దతుదారులపై అది చాలా ప్రభావం చూపించి ఉండేదని అన్నారు. ఇండియా టీవీ చానల్లో ప్రసారమయ్యే ఆప్కీ అదాలత్ అనే కార్యక్రమంలో శత్రు ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు చానల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పట్నాలో ఆయన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను కలసి, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడానికి కారకులైన నాయకులు గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఓటమికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్జేడీనేత లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా శత్రుఘ్నసిన్హా కలిసి కింగ్మేకర్గా అవతరించారంటూ అభినందించారు. సిన్హాను లాలూ ప్రశంసించారు. ఇదిలా ఉంటే శత్రు వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తీవ్రంగా స్పందించారు. శత్రును ఆయన కుక్కతో పోల్చారు.