CM Nitish Kumar
-
బీజేపీకి షాక్.. కూటమికి సీఎం నితీష్ కుమార్ గుడ్బై.. ఎక్కడంటే?
ఇంఫాల్ : బీహార్ సీఎం నితిష్ కుమార్ (cm nitish kumar) బీజేపీకి ఝలక్ ఇచ్చారు. మణిపూర్ (manipur) బీజేపీ (bjp) నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో జనతా దళ్ (యునైటెడ్) తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేడీయూ యూనిట్ అధినేత కాష్ బీరెన్ సింగ్ రాష్ట్ర అధికార బీజేపీకి మద్దతు ఉప సంహరించుకుంటున్నట్లు మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ బహ్లాకు లేఖ రాశారు. ప్రతిపక్ష బాధ్యత వహిస్తారని సూచించారు.మణిపూర్లో తమపార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎండీ అబ్దుల్ నసీర్కు అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో సీటును కేటాయించాలని కోరారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీకి జేడీయూ మద్దతు ఉండబోదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారని లేఖలో పేర్కొన్నారు. గతంలో బీజేపీకి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. తాజాగా, జేడీయూ సైతం కమలానికి గుడ్ బై చెప్పడం మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు చర్చాంశనీయంగా మారాయి. 2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఆరు స్థానాలను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసిన కొన్ని నెలల తర్వాత ఐదురుగు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి నాగా పీపుల్స్ ఫ్రంట్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు మద్దతిస్తున్నారు. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే బీహార్లో అభివృద్ది ఆగిపోతుందనే అనుమానాల్ని జేడీయూ నేతలు కొట్టి పారేస్తున్నారు. కేంద్ర ఎన్డీఏ కూటమిలో జేడీయూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాదు కూడదు అంటే .. అది బీజేపీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. -
డీజీపీని చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం.. ఎందుకంటే?
పాట్నా: బీహార్ పోలీస్ కార్యక్రమంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బంది నియామకాన్ని వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్ను చేతులు జోడించి అభ్యర్థించారు.సోమవారం బీహార్లో కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం నితీష్ కుమార్ తన ప్రసంగం మధ్యలో చేతులు జోడించి బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి త్వరలో మరిన్ని రిక్రూట్మెంట్లు జరిగేలా చూస్తారా? అని అడిగారు. సీఎం నితిష్ కుమార్ విజ్ఞప్తితో డీజీపీ అలోక్ రాజ్ మెరుపు వేగంతో స్పందించారు. వేదికపై కూర్చొన్న డీజీపీ ఒక్కసారి లేచి సెల్యూట్ చేశారు. వెంటనే నితీష్ కుమార్ లేదు ముందు మీరు పోలీస్ రిక్రూట్మెంట్ త్వరగా చేస్తారా? అని మరోసారి అడిగారు. అందుకు డీజీపీ స్పందిస్తూ.. సీఎం నితీష్ ఆదేశాలను అమలు చేసేందుకు బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. త్వరలో పోలీసు రిక్రూట్ మెంట్ నిర్వహిస్తాం’ అని అన్నారు. వచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలువచ్చే ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని బీజేపీ-జేడీయూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతవారం బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా జరగనన్ని దారుణాలు మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. కానీ చర్యలు లేవు. ఫిర్యాదు చేస్తే విచారణ శూన్యం. ప్రజలకు న్యాయం జరగదు. ఇకపై సీఎం నితీష్ కుమార్ బీహార్ను నడపలేరు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా సీఎం నితీష్ కుమార్ డీజీపీ అలోక్ రాజ్ పోలీస్ రిక్రూట్ మెంట్ జరిగేలా చూడాలని కోరుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్ను తప్పించబోయి చిత్తయిన లలన్
న్యూఢిల్లీ/పట్నా: బిహార్లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి పార్టీ అధ్యక్ష పగ్గాలను సీఎం నితీశ్కుమార్ లాంఛనంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్ భేటీ ఇందుకు వేదికైంది. పార్టీ అధ్యక్షునిగా నితీశ్ పేరును సభ్యులంతా ముక్త కంఠంతో సమర్థించారు. ఆ వెంటనే లలన్ రాజీనామా, అధ్యక్షునిగా నితీశ్ బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ పరిణామం వెనక నిజానికి చాలా పెద్ద కథే నడిచినట్టు తెలుస్తోంది. లలన్ తిరుగుబాటు యత్నమే దీనంతటికీ కారణమని సమాచారం. నితీశ్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసేందుకు లలన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి ఆయన ఉద్వాసనకు దారితీసినట్ చెబుతున్నారు! కొద్ది నెలల క్రితం నుంచే... ఆర్జేడీతో, ఆ పార్టీ చీఫ్ లాలుప్రసాద్ యాదవ్తో లలన్సింగ్ సాన్నిహిత్యం ఇప్పటిది కాదు. నితీశ్ కూడా దీన్ని చూసీ చూడనట్టే పోయేవారు. అయితే విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... లాలు కుమారుడు తేజస్వికి సీఎం పదవి అప్పగించి నితీశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగాలంటూ కొద్దికాలం క్రితం లలన్ ప్రతిపాదించారు. 18 ఏళ్లపాటు సుదీర్ఘంగా సీఎం పదవిలో కొనసాగినందున అధికార మహాఘట్బంధన్ సంకీర్ణంలో పెద్ద భాగస్వామి అయిన ఆర్జేడీకి సీఎం అవకాశమిస్తే బాగుంటుందని సూచించారు. దీన్ని నితీశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. లాలు–లలన్ ప్లాన్ నితీశ్ నిరాకరించినా తేజస్విని ఎలాగైనా సీఎం చేసేందుకు లాలు, లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా జేడీ(యూ)ను చీల్చి కనీసం ఒక డజను మంది ఎమ్మెల్యేలను ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని ఆయనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీలో జేడీ(యూ)తో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు తేజస్వికి కేవలం మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు చాలు. కానీ 45 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో డజను మందే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఈ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తే వేశారు. అందులో భాగంగా వారిని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడిక వారికి అనర్హత నిబంధన వర్తించదు. ఆనక 12 మంది ఎమ్మెల్యేలూ ఆర్జేడీకి మద్దతు పలికేలా, నితీశ్ సర్కారు కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన జరిగింది. ఈ మేరకు 12 మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వారందరికీ మంత్రి పదవులు ఆశ చూపారు. ఆర్జేడీకి చెందిన స్పీకర్ అవధ్ బిహారీ చౌధరి ఇందుకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేల్లో తన వీర విధేయుడైన సభ్యుడొకరు దీనిపై ఉప్పందించడంతో నితీశ్ అప్రమత్తమయ్యారు. సైలెంట్గా వారం క్రితం ‘ఆపరేషన్ లాలన్’కు తెర తీశారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వారంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలా పావులు కదుపుతూ శుక్రవారం కథను క్లైమాక్స్కు తెచ్చారు. విషయం అర్థమైన లాలన్సింగ్ అస్త్రసన్యాసం చేశారు. అధ్యక్ష పదవికి తానే నితీశ్ పేరును సూచించి తప్పుకున్నారు! -
ఇక జాతీయ రాజకీయాలు!
సాక్షి, చైన్నె: లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయస్థాయి రాజకీయాలపై డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. బిహార్లోని పాట్నా లో జాతీయ రాజకీయచట్రంలో తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే గురువారం రాత్రి, శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాట్నాలో బిజీబిజీ అయ్యారు. బీహార్ సీఎం నితీష్కుమార్, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో పలకరింపులతో బీజేపీకి వ్యతిరేకంగా తన తీవ్రగళాన్ని స్టాలిన్ వినిపించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి నుంచి డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ద్వారా తన ప్రభుత్వాన్ని కేంద్రం ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేయడాన్ని, తమను బెదిరించి దారిలోకి తెచ్చుకునే విధంగా కేంద్రం సాగిస్తున్న పరిణామాలను స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. కేంద్రం చర్యలను వ్యతిరేకించడమే కాకుండా, సమయం దొరికినప్పుడల్లా తీవ్ర స్వరంతో హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఈ పరిస్థితులో బిహార్ సీఎం నితీష్కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే విధంగా పాట్నా వేదికగా శుక్రవారం జరిగిన సమావేశం ద్వారా దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గతంలో అనుసరించిన ఫార్ములాతో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చాటే ప్రయత్నం చేశారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలను తాము కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేయడం విశేషం ఒక రోజు ముందుగానే.. ఈ సమావేశం నిమిత్తం గురువారమే పాట్నాకు సీఎం స్టాలిన్ వెళ్లారు. అదే రోజు రాత్రి ఆయన సీఎం నితీష్కుమార్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని గంటల పాటు రాజకీయ అంశాలపై ఈ భేటీ జరిగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్తో కూడా భేటీ అయ్యారు. ఈసందర్భంగా దివంగత నేత కరుణానిధితో తనకు ఉన్న అనుబంధం గురించి లాలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్తో పాటు పలువురు ముఖ్యప్రముఖులను శుక్రవారం స్టాలిన్ కలిశారు. బిహార్లోని పలువురు తమిళ అధికారులు స్టాలిన్ను కలవడం విశేషం. అనంతరం జరిగిన లౌకిక వాద పార్టీల నేతల సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ తన ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అందరూ ఐక్యతతో ముందుకు వెళ్తే, బీజేపీని ఓడించడం ఖాయం అన్న ధీమాను స్టాలిన్ వ్యక్తం చేయడం విశేషం. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో స్టాలిన్ ప్రత్యేకంగా కలవడమే కాకుండా జాతీయ రాజకీయాలలో డీఎంకే మరింత చురుగ్గా పాల్గొనబోతోందన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. నమ్మకం ఉంది.. పాట్నా పర్యటన ముగించుకుని రాత్రి చైన్నెకు చేరుకున్న సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం ఓ నమ్మకాన్ని కలిగించిందన్నారు. బీజేపీని ఓడించి తీరాలన్న సంకల్పంతో అన్ని పార్టీలు ఉన్నట్టు వివరించారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించాలంటే ఐక్యతతో, ఒకే గళంతో అందరూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇదేనని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి కన్నా, ముందుగానే కూటమిని తేల్చడం మంచిదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరం ఏకం కావడం నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యలు చేశారు. -
‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Parents Must Teach Good Values To Children, Know Why బీహార్: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇళ్లు వదిలి వెళ్లి వివాహాలు చేసుకుంటున్న యువతుల్లో చాలా మంది హత్యకు గురౌతున్నారు. మరి కొందరు బలవంతంగా అక్రమ రవాణాకు బలి అవుతున్నారని బీహార్ డీజీపీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మాటల్లో.. ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. ఐతే వారిలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. మరికొందరు బలవంతంగా అమ్మకానికి గురవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలకు మూల్యం చెల్లించేది తల్లిదండ్రులేనని’ బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ సమస్తిపూర్లో నిర్వహించిన సమాజ్ సుందర్ అభియాన్ కార్యక్రమంలో అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ సంభాషిస్తూ ఉండాలి, మంచి విలువలు నేర్పించాలని, వారి భావాలను గుర్తించి అర్థమయ్యేలా వివరించి, కుటుంబ బంధాల్లో వారిని బంధించాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో డీజీపీ సింఘాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ #WATCH We've seen cases where girls left their homes for marriage without parents' consent. Many of them get killed while others are forced into the flesh trade. It is parents who pay price for such decisions: Bihar DGP SK Singhal at 'Samaj Sudhar Abhiyan' event in Samastipur pic.twitter.com/wai9jNrnG1 — ANI (@ANI) December 30, 2021 -
పెళ్లి వాయిదా వేస్కోండి ప్లీజ్.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి
పాట్నా: కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలను కోరారు. బీహార్ రాష్ట్రంలో 10 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ మేరకు ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. "కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు నుంచి మే 15 వరకు దయచేసి కోవిడ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా" కోరారు. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని పాట్నా హైకోర్టు హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం,వివాహాలకు 50 మందికి మించి పాల్గొనకూడదు, అంత్యక్రియల్లో 20 మంది లోపు మాత్రమే పాల్గొనాలి. ఈ కాలంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయబడతాయి. పౌర రక్షణ, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పశువైద్య పనులు, పోస్టల్, టెలికమ్యూనికేషన్ వంటి అవసరమైన సేవలకు అనుమతించారు. ఉదయం 7 నుండి 11 గంటల మధ్య మాత్రమే కిరాణా దుకాణాలు కొనసాగించేందుకు అనుమతి ఉంది. బిహార్లో ప్రతీరోజు 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. చదవండి: మీ ఆధార్ కార్డు ఎవరైనా వాడుతున్నారని అనుమానం ఉందా? -
Covid 19: లాక్డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం
పాట్నా: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మొదటి దశతో పోల్చుకుంటే సెకండ్ వేవ్ కోవిడ్ వైరస్ భయంకరంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కొత్త కేసుల నమోదవటంతో పాటు వందల మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు. మరోవైపు పలు ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు కావల్సిన బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్డౌన్ను విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బిహార్లో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) నుంచి మే15 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. కాగా, బిహార్లో ఇప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింది. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. దీంతో సోమవారం కేబినేట్ సమావేశంలో సీఎం నితిష్ మంత్రులు, అధికారులతో చర్చించి లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బీహర్లో ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ టీకా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. బిహార్లో గడిచిన 24 గంటలలో కొత్తగా 11,407 కరోనా కేసులు నమోదయ్యాయి. బిహార్ వ్యాప్తంగా 1,07,667 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. చదవండి: ‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’ -
హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు: తీవ్ర విషాదం
సాక్షి, పట్నా: బిహార్లోని నలందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జెహానాబాద్ జిల్లా నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో సిబ్బందితో సహా 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రాజేసింది. నలందా జిల్లాలోని తెలహాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అతివేగంతో దూసుకువచ్చిన ట్రక్కు అదుపుతప్పి టెల్హడా ప్రాంతంలోని హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో హోటల్ సిబ్బందితోపాటు కస్టమర్లు కూడా ఉన్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ ట్రక్కును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలకు తరలిస్తున్న క్రమంలో కోపోద్రిక్తులైన స్థానికులు ట్రక్కుకు నిప్పంటించారు. పోలీసులు, అధికారులు, వాహనాలపై కూడా రాళ్లు విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. మరోవైపు ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు వెంటనే కోలుకోవాలన్నారు. -
పార్టీల్ని చీల్చడంలో నితీశ్ ఘనుడు: కుష్వాహా
పట్నా: బిహార్లో ఎన్డీయే మిత్ర పక్షాలు జేడీ(యూ), ఆర్ఎల్ఎస్పీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జేడీయూలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్ఎల్ఎస్పీ అధినేత, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా సీఎం నితీశ్కుమార్పై మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి ఫిర్యాదుచేస్తానని కుష్వాహా తెలిపారు. పార్టీలను చీల్చడంలో నితీశ్ ఆరితేరారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిహార్లో సీట్ల పంపకంపై త్వరగా స్పష్టత ఇవ్వాలని షాపై ఒత్తిడితెస్తానని చెప్పారు. జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ను కలుసుకున్న తరువాత ఆర్ఎల్ఎస్పీ ఎమ్మెల్యే సుధాంశు శేఖర్ పార్టీ మారబోతున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కుష్వాహా పైవిధంగా స్పందించారు. మరో ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ కూడా జేడీయూలో చేరే అవకాశాలున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. -
సీట్ల పంపకంపై అమిత్ షా, నితీశ్ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరువురు నేతల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతుండగానే.. షా, నితీశ్లు సీట్ల సర్దుబాటు కోసం భేటీ అవడం చర్చనీయాంశమైంది. 40 ఎంపీ స్థానాలున్న బిహార్లో ఎట్టిపరిస్థితుల్లోనూ 15 సీట్లను వదులుకోకూడదని జేడీయూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే బిహార్లో ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటే.. జేడీయూకు 15 సీట్లు ఇవ్వడం కష్టమని బీజేపీ అంటోంది. -
కాంగ్రెస్కు బిహార్ నేత ఝలక్
సాక్షి, పట్నా: బీహార్ కాంగ్రెస్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నమొన్నటివరకూ బిహార్ పీసీసీగా వ్యహరించిన అశోక్ చౌదరిను ఆ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ బిహార్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అశోక్ చౌదరి అనూహ్యంగా ప్రధానిని కలిసి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు. పట్నా యూనివర్సిటీ శత వసంతాల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో బిహార్ మాజీ పీసీసీ చీఫ్ అశోక్ చౌదరి పాల్గొనడంతో పాటు.. మోదీ, నితీష్ కుమార్తో ప్రత్యేకంగా సంభాషించారు. అనంతరం సీఎం నితీష్ మాట్లాడుతూ.. ఈ ఘటనతో ఆశోక్ను కాంగ్రెస్ పార్టీ వెంటనే సస్పెండ్ చేస్తుందేమో అని చమత్కరించారు. పార్టీని చీల్చేందుకు అశోక్ చౌదరి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్ అతన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి గత నెల్లో తప్పించింది. అప్పటినుంచి అవకాశం చిక్కిన ప్రతిసారీ.. అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీ అధినాయత్వం మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో తత్సబంధాలున్న అశోక్ చౌదరి.. జేడీయూలో చేరుతారనే ఊహాగానాలు కొంతకాలంగా ఉన్నాయి. -
ఫిరాయింపు కాదు ఆశ్రయం
జాతిహితం అది మంచైనా, చెడైనా నితీశ్ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. పలాయనం చిత్త గించి బీజేపీని రాజకీయ ఆశ్రయం కోరడం అనాలి. తుది కంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోతుందని గుర్తించగల వాస్తవిక దృష్టి ఆయనకుంది. కాబట్టి వలస పాలన కాలపు రాజాలా మారి, సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ప్రతిపక్ష నేతలలో చాలా మంది ఆయనలాగే పలాయనమా, రాజకీయంగా కడతేరిపోవడమా? అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు. నితీశ్ కుమార్, ఆయన పార్టీ మూకుమ్మడిగా ఒక రాజకీయ కూటమి నుంచి, భావజాలపరంగా దానికి పూర్తి విరుద్ధమైన మరో రాజకీయ కూటమికి ఫిరాయించడం తెలిసిందే. నరేంద్ర మోదీ, అమిత్షాలు 2019 ఎన్నికల విజ యాన్ని ఇప్పుడే ఖరారు చేసేసుకున్నారనే దీని అర్థమని విస్తృత జనాభిప్రాయం. మన బహిరంగ చర్చలోని స్వల్పకాలీనతకు ఇంతకంటే మెరుగైన ఉదాహరణ మరొకటి లేదు. దీనికి విరుద్ధంగా వాదించాలంటే మీకు నిర్లక్ష్యపూరితమైన దుస్సాహసమైనా ఉండాలి లేదా మీరు బిహార్లో అమ్మే దొంగ సారా తాగైనా ఉండాలి. ఈ మార్పు అంతరార్థాలు 2019 తర్వాత కూడా మిగులుతాయి. భారత రాజకీయాల్లో, సమాజంలో, క్లుప్తంగా చెప్పాలంటే ప్రజాభిప్రాయంలోని మార్పునకు సంకేతం ఇలాగే ప్రస్ఫుటమౌతుంది. ఇందిరా గాంధీకంటే మరింత శక్తివంతమైన, విజయవంతమైన గొప్ప రాజకీయ నేత ఆవిర్భవించడమని కూడా దీని అర్థం. ఇందిర మరిన్ని ఎక్కువ రాష్ట్రాలను పాలిం చారు, మూడు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గారు అంటూ అసమ్మతి తెలపడానికి దిగకండి. అప్పటికే అధికారంలో స్థిరపడి ఉన్న పార్టీ ఆమెకు వారసత్వంగా లభించింది. పైగా అప్పట్లో చెప్పుకోదగ్గ ప్రతిపక్షమూ లేదు. మోదీ ముఠాలుగా చీలి ఉన్న తన పార్టీలోని వ్యతిరేకులతోనేగాక, పెద్ద ఓటు బ్యాంకులున్న పలువురు భావజాల ప్రత్యర్థులతో కూడా పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆయన, ఆయన పార్టీ అధ్యక్షుడు కలసి ఇందిర కంటే ఎక్కువ బలంగా పార్టీని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. మీడియాలో చాలా భాగం నేడు సంతోషంగానే మోదీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, ప్రశంసలు కురిపిస్తోంది. పెద్ద నోట్లు రద్దు చేసి తొమ్మిది నెలలు గడిచినా రద్దయిన కరెన్సీ ఎంతో ఆర్బీఐ ఎందుకు లెక్కకట్టలేకపోయిందనైనా కనీసం అడగలేని స్థితిలో అది ఉంది. మన రాజకీయాల్లో కొత్త మలుపు భారత క్రికెట్ను నడిపించడం కాక న్యాయవ్యవస్థ చేస్తున్నదేమైనా ఉందంటే అది.. యమునా నది ఒడ్డున మల విసర్జన చేసినందుకు రూ. 5,000 జరి మానా విధించడం, దేశభక్తి కొరవడిన మనలాంటి మూఢులకు జాతీయగీతం పట్ల గౌరవం చూపాలని బోధించడమే. క్రమశిక్షణ లోపించిన విశ్వవిద్యాలయం క్యాంపస్ను దారికి తేవడానికి తమకు ఒక యుద్ధ ట్యాంకును జ్ఞాపికగా ఇవ్వమని ఒక వైస్–ఛాన్స్లర్ కోరడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. మనం అదృష్టవంతులం, ఆయన మందుగుండు నింపిన నిజమైన యుద్ధ ట్యాంకునో లేదా పోలీసు సాయుధ శకటాన్నో అడిగారు కాదు. చర్చిల్ ఆలోచనా ధోరణితో రాజకీయాల్లో చాలా సుదీర్ఘకాలం చివర్లో మనం చూస్తున్న వాస్తవాలను ఏకరువు పెట్టడమే ఇదంతా. రచయిత, ఓటు వేయడంలోని తన ఇష్టాయిష్టాలకు అతీతంగా రాజకీయ విశ్లేషణ సాగించాలి. అప్పుడే మనం ఈ మలుపును మంచిది లేదా చెడ్డది అని అభివర్ణించకుండా నిగ్రహం చూపుతాం. అయితే ఈ మలుపు, మన రాజకీయాలలో ప్రస్తుతం ఉన్న ప్రమేయాలు, సమీకరణాలన్నింటిని తీసి చెత్తబుట్టలో వేసేస్తోంది. కాబట్టి, మోదీ–షాల రాజకీయ కార్యక్రమం మూడేళ్లుగా అమలయ్యాక... నితీశ్ అనంతర కాలపు మన రాజకీయాలను చిత్రీకరిద్దాం. మన దేశంలో ఇప్పుడు ఒక కొత్త రకం రాజకీయ సన్నివేశమూ, దానికి తగ్గ మానసిక స్థితి ఉన్నాయి. మన విలువలు, భావాలలో చాలా వరకు... ఏమంత మంచివి కానివి లేదా కాలంచెల్లినవి, వివేకం, నైతికత అనే భావనలు, అన్నిట్లోకీ ముఖ్యంగా భావజాలం.. నేడు మరణించాయి, దహన సంస్కా రాలూ జరిగిపోయాయి. మన ఓటర్లలో అత్యధికులు 21వ శతాబ్దపు తరంవారు. లౌకికవాద భావనకు ప్రామాణిక పరిరక్షకులుగా గుర్తింపుపొందిన వారిలో ప్రతి ఒక్కరూ అవినీతిగ్రస్తులు, వివాదాస్పదమైన వంశపారంపర్యవాదులు అయినప్పుడు, లౌకికవాదం సుగుణాల గురించి ఒప్పించడం కష్టం. లేక వామపక్షాలు చెప్పే మతమేలేని కపటపు లౌకికవాదాన్ని చూద్దామంటే, ప్రపంచవ్యాప్తంగా వారి ఆర్థిక సిద్ధాంతాలు విఫలమయ్యాయి. విపత్కరమైన 26/11 ముంబై ఉగ్రదాడి గురించి మీ నేతలు ప్రశ్నలను లేవనెత్తుతున్నప్పుడు, ఉగ్రవాదులకు విధించిన మరణశిక్షలను సుప్రీం కోర్టు ధృవపరచినా గానీ, వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పడు, లేదా మీ సొంత ప్రభుత్వం కళ్ల ముందే జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో దేశంలోని అత్యున్నత సాహస పురస్కారాన్ని అందుకున్న పోలీసు ఇన్స్పెక్టర్ మరణించినా దాన్ని బూటకపు ఎన్కౌంటర్ అంటున్నప్పుడు..సరళమైన జాతీయవాదాన్ని చెల్లుబాటయ్యేలా ప్రాచుర్యంలోకి తేవడం అసాధ్యం. మీకు భావవ్యక్తీకరణ స్వాతంత్య్రం ఉంది అని మీరు అనవచ్చు. అలా అయితే దాన్ని మీ పార్టీ నేత గురించి నిజం మాట్లాడటానికి కూడా ఉపయోగించండి. రాజకీయ విజ్ఞతకు పునర్నిర్వచనం జేఎన్యూకు వెళ్లే రహదారికి ఇప్పుడు సావర్కర్ లేదా గోల్వాల్కర్ పేరు పెడితే దానికి తెలిపే నిరసన ఎంత నమ్మించగలిగేదిగా ఉంటుంది? జామియా మిలియాలోని ఒక ఆడిటోరియంకు ఎడ్వర్డ్ సెడ్ పేరును, దానికి చేరే రహదారికి సెరా ఏ అర్జున్సింగ్ అని మీరు పేర్లు పెట్టారని గుర్తు తెచ్చుకోండి. లేదా మధ్యలోనే కాజేయగా మిగిలినవే ప్రజలకు చేరే, జనాకర్షకమైన, ఓట్లు రాబట్టే యోజనలలో చాలా వాటికి మీ పూర్వీకుల పేర్లు పెట్టి పేదలకు అనుకూలమైన పాలన అంటూ మీరు ప్రచారం చేసిన భావననే తీసుకోండి. మహాఘట్బంధన్ అనే ప్రహసనంగా జమకూడిన పార్టీలన్నీ చేసిన గొప్ప వాగ్దానమైన సామాజిక సమానత్వాన్నే తీసుకుని చూడండి. తమ సొంత చిన్న చిన్న వంశాలకు నాయకత్వం వహిస్తున్నవారిని మినహాయిస్తే. ఒక్క ముస్లిం, దళిత లేదా ఆదివాసీ నేతను కూడా ఎదగడాన్ని అవి అనుమతించలేదు. ఉదారవాదానికి కట్టుబడి ఉండే విషయానికి వస్తే... మీ సొంత భావనే అయిన ఆధార్పట్ల హాస్యాస్పదమైన వ్యతిరేకతగా అది కుదించుకుపోయింది. భారత మానసిక స్థితిలో వచ్చిన మౌలిక మార్పునకు అంతరార్థం రాజ కీయ విజ్ఞతను, ఒకటి కాదు రెండు తరాల ఓటర్లు పునర్నిర్విచించారు. గతం, స్వాతంత్య్రోద్యమ రాజకీయాల్లో వేళ్లూనుకున్నది. అందువలన స్వీయనిరాకరణ, త్యాగం, అంతరాత్మ పిలుపునకు విధేయమై ఉండటం, అతిగా రాజకీయంగా సరైన వైఖరిని కలిగి ఉండటం వంటి వాటికన్నిటికీ నేడు కాలం చెల్లిపోయింది. నేడు చెల్లుబాటయ్యేది అధికారమూ, తప్పు అనే ఒప్పుకోలే లేకుండా ఆ అధికారాన్ని చెలాయించడమే. మోదీ రాజకీయ అర్హతల పత్రాన్ని చూస్తే, నేడున్న మరే రాజకీయ పోటీదారు కంటే ఆయనే ఆ పరీక్షలో నెగ్గారని చెబుతుంది. 2002 అల్లర్ల తర్వాత అటల్ బిహారీ వాజపేయి నుంచి ఒత్తిడి వచ్చినా ఆయన రాజీనామా చేయలేదు, మరెవరినీ రాజీనామా చేయమని కోరలేదు. లలిత్ మోదీ, వ్యాపం కుంభకోణాలను ఉదాసీనంగా విస్మరిం చారు. స్మృతి ఇరానీని తక్కువ ముఖ్యమైన శాఖకు పంపి ఉండొచ్చుగానీ, ఆమెకు పునరావాసం కల్పించే పని జరుగుతోంది. ఆయన వైఖరి గురించి మరిన్ని ఆధారాలు కావాలా? ఆయన తన ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చిన దాదాపు డజను మందిలో ఎవరినీ పదవి నుంచి తొలగించలేదు. అందరి కంటే ఎక్కువ అప్రతిష్ట తెచ్చిన సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని సైతం పదవిలో కొనసాగించారు. నితీశ్ బాటన సాగాల్సిందేనా? 2014 ఎన్నికలపై నేను మొదట చేసిన వ్యాఖ్యలో నూతన భారత ఓటరు నేడు భావజాలానంతర, నేను నీకేమీ రుణపడి లేను అనే మనస్తత్వంతో ఉన్నాడని అన్నాను. బీజేపీ విజయపరంపర కొనసాగుతున్నదీ అంటే భారత లౌకికవాదం, ఉదారవాదం అంతరించిపోయాయని కాదు. కాకపోతే బీజేపీ విజ యాలు మనం ఇంతకు ముందు ఆ భావనలలో మనకు ఉన్నదనుకున్న విశ్వాసం ఎంత లోతైనదనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అతి ఎంతో లోతేనది కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల ఓటర్లలోని పెద్ద మెజారిటీ తాము ఎప్పుడూ విశ్వసిస్తూనే ఉన్న వాటి గురించి, పాత తరానికి చెందిన నైతికత, రాజీయంగా సరైన వైఖరి లేదా కపటత్వాల కారణంగా బయటకు మాట్లాడలేకపోయారు. వారిప్పుడు తాము విశ్వసిస్తున్నదానికి సమంజసత్వాన్ని చూస్తున్నారు. నూతన భారతం మోస్తున్న ఆ పాత తల బరువును మోదీ–షాల బీజేపీ వదిలించేసింది. భారతీయులు దాన్ని మెచ్చుతున్నారు. ఇప్పటికైతే, ఏ ప్రతిపక్ష నేతా లేదా కూటమి దీన్ని ఎదిరించలేదు. కాంగ్రెస్ లెక్కలోకి రానిదిగా కుదించుకుపోయింది. కర్ణాటకలో అధికారం కోల్పోతే అది దాదాపుగా చనిపోయినట్టే అవుతుంది. పంజాబ్లోని అమరిందర్ సింగ్ అప్పుడిక నితీశ్లా సందిగ్ధంలో పడతారు. లేదంటే కేంద్రం ఆయనను ఆకట్టుకుంటుంది లేదా ఒత్తిడి చేస్తుంది. మరోవంక కాంగ్రెస్ అధిష్టానం జోక్యం, అనుమానాలతో ఆయన వ్యవహరించాల్సి వస్తుంది. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్లు కొంత కాలం పాటు గట్టిగా నిలవగలుగుతారే తప్ప, బలీయమైన బీజేపీని దూరంగా ఉండేలా నిలవరించ లేరు. కేరళకు ఇంకా కొంత సమయం పడుతుంది గానీ, కాంగ్రెస్ అక్కడ బీజేపీకి తన స్థానాన్ని కొంతవరకు వదులుకోవాల్సి వస్తుంది. అది మంచైనా లేదా చెడైనాగానీ, నితీశ్ను ఫిరాయింపుదారు అనడం సరికాదు. దాన్ని బీజేపీ చెంతకు పలాయనం చిత్తగించడం అనాలి. తట్టాబుట్టా సర్దుకుని విమానంలో తప్పించుకు పారిపోయి బీజేపీని ఆశ్రయం కోరడంగా అభివర్ణించాలి. తుదికంటా పోరుకు దిగితే అది ఏకపక్షంగానే ముగిసిపోగలదని, అది నిరర్థకమని గుర్తించేపాటి వాస్తవికవాద దృష్టి ఆయనకుంది. తన ముందున్నది, ‘నేనే మొదట, నేనూ, నా సెల్ఫీ’ అనే వ్యామోహంతో ఉన్న మారిన ఓటర్ అని గుర్తించడానికి తగినంత కాలం నితీశ్ రాజకీయాల్లో మనగలిగారు. ఆయన ఇంతవరకు ఉపయోగించిన నినాదాలు, ప్రత్యేకించి సామ్యవాదం, లౌకికవాదాలకు జనసమ్మోహక శక్తి లేదు. ఆయన వద్ద సరి కొత్త భావాలూ లేవు. అందువల్ల వలసకాలపు భారత రాజాలాగా మారి, తన సొంత ప్రజలపై ఆధికారం నెరపడానికి బదులుగా సార్వభౌమత్వాన్ని వదులుకోవడమే మెరుగు. ఎంతోకాలం కాక ముందే, మిగతా ప్రతిపక్ష నేతలలో చాలా మంది... పార్టీ వీడటమా లేక అంతరించిపోవడమా అనే సందిగ్ధాన్ని ఎదుర్కొంటారు. లేదంటే మీకు గనుక ఊహాత్మకత ఉంటే చలామణీ చేయగలగిన ప్రభావశీలమైన కొత్త నినాదాన్ని కనిపెట్టాలి. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
బిహార్ సీఎం కాన్వాయ్లో ప్రమాదం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగులు పోలీసులు గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పట్నా నుంచి కిషన్ గంజ్కు వస్తుండగా సుపౌల్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎన్హెచ్-57 పై ఒక ట్రక్ ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పిన వీరి వాహనం హఠాత్తుగా బోల్తా పడింది. గాయపడిన వారిని హుటాహుటిన దర్భంగా లోని పరాస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. -
'వరకట్న పెళ్లిళ్లను బాయ్ కాట్ చేయండి'
మద్యం తయారీని, విక్రయాన్ని, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మరొక ఆదర్శవంతమైన క్యాంపెయిన్ ప్రారంభించారు. వరకట్నం, బాల్య వివాహాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని ప్రసంగించిన నితీష్ కుమార్, వరకట్నం తీసుకునే వారిపై మండిపడ్డారు. వరకట్నం తీసుకుని పెళ్లిళ్లు చేసుకునే మ్యారేజ్ వేడుకలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ''వరకట్నం తీసుకున్నట్టు తెలిస్తే. ఆ పెళ్లి వేడుకలకు అసలు హాజరుకావొద్దు'' అని నితీష్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. సమాజంలో ఉన్న వరకట్నాన్ని నిర్మూలించాల్సినవసరం ఎంతో ఉందని చెప్పారు. బాల్య వివాహాలను అరికట్టడానికి కూడా తమదైన శైలిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి వ్యతిరేకంగా నెలకొన్న ఈ వికృత అంశాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఆయన హైలెట్ చేశారు. మద్య నిషేధాన్ని తమ ప్రభుత్వం ఎంత పకడ్భందీగా అమలుచేసిందో, అంతే పట్టువిడవని ధోరణిలో బాల్యవివాహాలు, వరకట్నాలకు వ్యతిరేకంగా పోరాడతామని సీఎం చెప్పారు. ఎస్కే మెమోరియల్ హాల్ లో జేడీయూ నిర్వహించిన ఈ ఈవెంట్లో రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ లీడర్ శ్యామ్ రజక్, మాజీ అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ చౌదరి, పలువురు పాల్గొన్నారు. -
‘మాకు సగం సీట్లు రిజర్వు చేయండి’
పట్నా(బిహార్): చట్టసభల్లో తమకు యాబై శాతం సీట్లు కేటాయించాలంటూ బిహార్ మహిళా శాసనసభ్యులు పట్టుబట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం శాసనసభ సమావేశమైంది. పాల్గొన్న మహిళా ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సభలో లేచి నిలబడి ఈ మేరకు నినాదాలు చేశారు. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారని, అందుకే పార్లమెంట్, రాష్ట్ర చట్టసభల్లో సగం సీట్లు రిజర్వు చేయాలని డిమాండ్ చేశారు. బిహార్ సీఎం నితీశ్కుమార్ రాష్ట్ర స్థానిక సంస్థలు, పంచాయతీల్లోని సగం సీట్లను మహిళలకే రిజర్వు చేస్తూ ఇటీవల చట్టం కూడా చేశారు. ఈ విషయాన్ని పలువురు మహిళా సభ్యులు ప్రస్తావిస్తూ రాష్ట్ర, కేంద్ర చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ విషయమై స్పీకర్ విజయ్కుమార్ చౌధురి మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల డిమాండ్కు మద్దతు పలికారు. దీనిపై ముందుగా పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉందని తెలిపారు. తమ నియోజకవర్గాల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. -
ముఖ్యమంత్రి అయినా సరే.. 'మాట' వినం
పట్నా: ముఖ్యమంత్రి సహా ఎవరి మౌఖిక ఆదేశాలనూ అమలు చేయరాదని బిహార్ బ్యూరోక్రాట్లు నిర్ణయించారు. లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేస్తేనే అమలు చేస్తామని చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో బిహార్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చైర్మన్ సుధీర్ కుమార్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు పలు విషయాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆదేశాలైనా లిఖిత పూర్వకంగా జారీ చేస్తేనే అమలు చేయాలని నిర్ణయించారు. ఇకమీదట ఉద్యోగ నియామకాల బోర్డులకు చైర్మన్గా ఐఏఎస్ అధికారులు ఉండరాదని తీర్మానం చేశారు. ఎవరో చేసిన కుట్రలో సుధీర్ కుమార్ ఇరుకున్నారని, ఆయన న్యాయపోరాటానికి అయ్యే ఖర్చులను భరించాలని నిర్ణయించారు. సుధీర్ను అరెస్ట్ చేయడం అన్యాయమని, బిహార్ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, స్టాప్ సెలెక్షన్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశానంతరం ఐఏఎస్ అధికారులు ర్యాలీగా వెళ్లి గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ను కలిశారు. రాజ్భవన్ ఎదుట మానవహారం నిర్వహించారు. కాగా పోలీసుల వాదన మరోలా ఉంది. తన బంధువుల కోసం సుధీర్ కుమార్ ప్రశ్నా పత్రాలను లీక్ చేశారని చెప్పారు. ఆయన్ను అరెస్ట్ చేసిన 48 గంటల తర్వాత కూడా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చైర్మన్గా కొనసాగారు. ఆయన్ను పదవి నుంచి తొలగించడం లేదా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదు. సుధీర్ కుమార్ ప్రస్తుతం పట్నా పుల్వారిషరీఫ్ జైలులో ఉన్నారు. పేపర్ లీక్ కావడంతో దాదాపు 10 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియను సీఎం నితీష్ కుమార్ రద్దు చేశారు. ఈ కేసులో దాదాపు 36 మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్నా పత్రం కోసం ఒక్కో అభ్యర్థి రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు చెల్లించారు. -
బిహార్లో ప్రపంచ రికార్డు
పట్నా: దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం బిహార్లో 11,000 కిలోమీటర్ల పొడవైన మానవహారాన్ని నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. మద్యపానాన్ని నిషేధిస్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అమలుచేస్తోన్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రజలంతా శుక్రవారం రోడ్లపైకి వచ్చారు. చిన్నా, పెద్దా చేతులు కలిపారు. అలా నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలుపుతూ దాదాపు 45 నిమిషాలపాటు(మధ్యాహ్నం 12:15 నుంచి 1:00 వరకు) మానవహారంలా రోడ్లపై నిలబడ్డారు. చూడటానికి రెండు కళ్లు చాలని ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏకంగా మూడు శాటిలైట్లు, నాలుగు విమానాలు, రెండు హెలికాప్టర్లు, 40 డ్రోన్లను వినియోగించారు. ఇస్రోకు చెందిన రెండు శాటిలైట్లతోపాటు ఒక విదేశీ శాటిలైట్ కూడా ఈ భారీ మానవహారాన్ని ఫొటోలు తీశాయని ప్రభుత్వాధికారులు తెలిపారు. పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ కుమార్, మిత్రపక్షం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్యాదవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు మానవహారం కట్టారు. కొద్ది రోజుల కిందట బిహార్లో పర్యటించిన ప్రధాని మోదీ.. నితీశ్ సర్కారు అమలు చేస్తోన్న మద్యనిషేధాన్ని మెచ్చుకోవడమేకాక దేశానికి ఆదర్శంగా నిలిచారని కితాబు ఇవ్వడం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు సీఎం నితీశ కుమార్.. 2016, ఏప్రిల్ 5 నుంచి మద్యనిషేధాన్ని అమలులోకి తెచ్చారు. నిర్ణయం అమలుపై మొదట్లో కొన్ని అవాంతరాలు, అనుమానాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ గడిచిన 10 నెలలుగా బిహార్లో మద్యనిషేధం పకడ్బందీగా అమలవుతుండటం విశేషం. -
వర్గీకరణకు మద్దతివ్వండి
బిహార్ సీఎంను కోరిన మంద కృష్ణ సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతివ్వాలని బిహార్ సీఎం నితీశ్కుమార్ను మంద కృష్ణమాదిగ కోరారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రిని ఆయన ఆదివారం పట్నాలో కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుమారు గంటపాటు వర్గీకరణ అంశాలపై చర్చించారు. గత 22 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతుండటం అభినందనీయమని నితీశ్కుమార్ ప్రశంసించినట్లు మంద కృష్ణ తెలిపారు. వెనుకబడిన దళితులకు న్యాయం చేయడానికి బిహార్లో మహాదళిత్ పాలసీని అమలు చేస్తున్నట్టు నితీశ్ చెప్పారన్నారు. షెడ్యూల్ కులాలను వర్గీకరించాలని కోరుతూ త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంటులో బిల్లు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పినట్టు మంద కృష్ణ తెలిపారు. -
కేంద్రానికి నితీశ్ ఘాటు లేఖ
పట్నా: కేంద్ర ప్రభుత్వానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటు పదాలతో లేఖ రాశారు. నలంద విశ్వవిద్యాలయం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని, దాని నిబంధనల్లో మార్పులు చేయవద్దని అన్నారు. అలా చేయడమంటే వర్సిటీకి ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని తగ్గించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. వర్సిటీలోని పాలక కమిటీ విషయంలో తనను సంప్రదించకుండానే మార్పులు చేశారని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుందని పేర్కొంటూ వైస్ ఛాన్సలర్ జార్జ్ యో తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్కు నితీశ్ లేఖ రాశారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో వర్సిటీ వీసీని కచ్చితంగా సంప్రదించాలని, కానీ అలా జరగలేదని, ఈ చర్య వర్సిటీ స్వతంత్ర ప్రతిపత్తి హోదాను సంకటంలో పడేసే పరిస్థితి అని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం కేంద్రం జోక్యం చేసుకోకూడదని, దీని వెనుక ప్రధాని నరేంద్రమోదీ హస్తం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. వర్సిటీ గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటివి జరగకుండా చూడాలంటూ నితీశ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రతిపక్షాలకు లాలు మార్క్ ఝలక్
పట్నా: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు, వామపక్షాలకు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తన మార్కు ఝలక్ ఇచ్చారు. మొన్నటి వరకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఖండించిన లాలు అనూహ్యంగా మద్దతిచ్చారు. తాను కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడంలేదని, దానిని అమలుచేసే విధానాన్ని మాత్రమే తప్పంటున్నానని చెప్పి ఇతర పార్టీలను, మీడియాను అవాక్కయ్యేలా చేశారు. ఇప్పటికే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కేంద్రం నిర్ణయానికి బహిరంగంగా మద్దతివ్వగా లాలు మాత్రం ఆ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలకు మరింత ఊపునిచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో బిహార్లో ఈ కూటమి బద్ధలయినట్లేనని, నితీశ్ బీజేపీకి మరోసారి దగ్గరవుతున్నారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈలోగా లాలు ప్రసాద్ కూడా నితీశ్ బాటలోకి వచ్చి ఔరా అనిపించారు. మంగళవారం లాలు ఇంటికి నితీశ్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు కొద్ది సేపు మాట్లాడుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో (నితీశ్ కూడా ఇందులో ఉన్నారు) లాలు మాట్లాడుతూ తాను నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం లేదని, అమలు తీరునే తప్పుబడుతున్నానని అన్నారు. పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. దాదాపు గంట సమావేశం తర్వాత లాలు ఈ ప్రకటన చేయడం గమనార్హం. -
‘అంత బాధేస్తే నితీశ్కు నీ సోదరినివ్వు’
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీని అనకూడని మాటలు అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవిష్యత్తు గురించి అంత ఆందోళన పడుతున్న సుశీల్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని అన్నారు. అది కాకుంటే నితీశ్కు సుశీల్ సోదరి చేయినందించి పెళ్లి చేసుకోని ఆయన ఖ్యాతిని పెంచుకోవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు. బీజేపీలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ జీవితం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు అది ఒక స్వర్ణ యుగం అని, కానీ, ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతకుముందు రోజు సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఆ పార్టీలతో స్నేహం గురించి మరోసారి ఆలోచిస్తే మంచిదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తూ నితీశ్ బహిరంగ ప్రకటన చేసిన అనంతరం సుశీల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే లాలూ భార్యను కొందరు మీడియా ప్రతినిధులు కలిసి స్పందన కోరగా సుశీల్కు నితీశ్ ను చూసి అంత బాధనిపిస్తే ఆయన సోదరినిచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని ఘాటుగా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో పలు విమర్శలకు దారి తీయడంతో తన ఉద్దేశం అది కానే కాదని, మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని, అతడికి తాను వదినలాంటిదాన్నని, ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా అంటూ వివరణ ఇచ్చారు. -
నితీశ్కు మళ్లీ కలిసొచ్చింది
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరట కలిగింది. ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యపాన నిషేద చట్టాన్ని రద్దు చేస్తూ పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 'మద్యపాన నిషేధానికి, ప్రాథమిక హక్కులతో సంబంధం ఉంటుందని, అవి రెండు కలిసిసాగుతాయని తాము భావించడం లేదు' అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల(అక్టోబర్) 3న బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లగా దానికి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. -
ఇక్కడ డాన్లకు స్థానం లేదు
పట్నా: బిహార్లో గ్యాంగ్స్టర్లకు స్థానం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. బయట ఏ డాన్ ఉన్నా సరే, జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు. జంట హత్యల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదల కావడాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. షాబుద్దీన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు.. షాబుద్దీన్, ఆయనకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. చట్టం విషయంలో రాజీపడబోమని, ఫిర్యాదు చేసే అవకాశాన్ని మిత్రపక్షాలకు ఇవ్వబోనని నితీష్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టి నితీశ్ అధికారంలోకి వచ్చారు. -
'లైట్లు ఆపేస్తే అదే ఫీల్ వస్తుంది'
న్యూఢిల్లీ: మద్యపానం నిషేధం విధించిన తర్వాత తనకు కలిగినంత ఆత్మసంతృప్తి మరెప్పుడూ కలగలేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మద్యం పాన అలవాటు మానుకోలేకపోతున్న మందుబాబులకు ఆయన కొన్ని ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. జ్యూస్ అలవాటు చేసుకోవడం ద్వారా మద్యాన్ని మానేయొచ్చని చెప్పారు. ఇంట్లో లైట్లు ఆపేసి చీకట్లో పళ్ల రసం తాగడం ద్వారా మద్యంతాగినంత అనుభూతి పొందవచ్చని, దాని ద్వారా ఆ మహమ్మారికి దూరం జరగవచ్చిన చెప్పారు. తొలుత పాక్షికంగా మద్యంపై నిషేదం విధించిన సీఎం నితీశ్ కుమార్ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో అమలుకు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపించేలా ప్రొహిబిషన్ చట్టం తెచ్చారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలకు దిగినా వారిపై బిహార్లో దాడులు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి మద్యంపై నిషేదం విధించడం ద్వారా జేడీయూకు మంచి పేరు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రతిచోట ఈ విషయంపై స్పందిస్తున్నారు. మద్యం విషయంలో నిబంధనలు అతిక్రమించినవారికి బెయిల్ కూడా లభించకుండా చట్టంలో చేర్చారు. -
షహబుద్దీన్ ను మళ్లీ జైలుకు పంపాలని యోచన!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నేత షహబుద్దీన్ తిరిగి జైలుకు పంపేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. సాక్ష్యులను ప్రభావితం చేసే అంశం మీద షహబుద్దీన్ పై క్రైమ్ కంట్రోల్ యాక్ట్(సీసీఏ)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 2004 ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో షహబుద్దీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం గత వారమే బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే. షహబుద్దీన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆర్జేడీ నేతలు తనపై చేసిన విమర్శలను నితీశ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ నేతలు చేసిన కామెంట్లు కూటమిలో అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని జేడీ(యూ) మంత్రి బిజేంద్ర యాదవ్ అన్నారు. ఈ విషయంలో లాలూ జోక్యం అవసరమని, ఆర్జేడీ నేతలపై జేడీ(యూ) నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. -
ఎవరేమనుకున్నా పర్లేదు: సీఎం
పాట్నా: ఆర్జేడీ నాయకులు విమర్శలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం స్పందించారు. ఎవరేమనుకున్నా తాను పట్టించుకోనని అన్నారు. బీహార్ ప్రజలకు తనపై నమ్మకం ఉంచారని.. వారికి అనుగుణంగా తాను పనిచేస్తున్నానని తెలిపారు. మిత్రపక్షం నేతల విమర్శలను తాను పట్టించుకోనని ఆయన అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్, మహమ్మద్ షహబుద్దీన్ లు... నితీశ్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నితీశ్ ను ముఖ్యమంత్రిగా చేయాలని కూటమి తీసుకున్న నిర్ణయాన్ని తాను అంగీకరించలేదని సింగ్ పేర్కొనడం విశేషం. హత్య కేసులో 11ఏళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి విడుదలైన షహబుద్దీన్ తన లీడర్ లాలూ ప్రసాద్ అని చెప్పడం బీహార్ లో రాజకీయ దుమారాన్ని లేపింది. పరిస్థితుల కారణంగానే నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారని, ఆయనెప్పుడు తన లీడర్ కాలేరని షహబుద్దీన్ పేర్కొన్నారు. కాగా ఆర్డేడీ-జేడీయూల మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
'ఆయన సీఎం అవడం నాకిష్టం లేదు'
న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలకు నిలువనీడ లేకుండా పోయినట్లే రాజకీయాల్లో కూడా ఉమ్మడిగా కొన్ని పార్టీలు కలిసి పొత్తుపెట్టుకొని ముందుకు ఎక్కువకాలం మసిలే అవకాశం లేదు. బిహార్లో పరిస్థితి చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పై మరో ఆర్జేడీ నేత అసంతృప్తి వెళ్లగక్కారు. ఆయన సీఎం కావడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆర్జేడీ సీనియర్ నేత రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు. అంతకుముందు ఆర్జేడీకి చెందిన మాజీ ఎంపీ మహ్మద్ షహబుద్దీన్ కూడా దాదాపు ఇలాంటి విమర్శ చేశారు. ఆర్జేడీతో పొత్తుపెట్టుకోవడం వల్లే నితీశ్ జేడీయూ గెలిచిందని అందువల్లే ఆయన సీఎం అయ్యారని తేలికచేసి మాట్లాడారు. తాజాగా అదే వరుసలో రఘువంశ ప్రసాద్ నిలిచారు. 'మహాగట్భందన్ నాయకులు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించాను. కానీ వారి మాట వినాల్సి వచ్చింది. నిజమైన నేత జనాల్లో నుంచి వస్తాడు. కానీ, వివిధ పార్టీల కలయికతో అధికారం చేపట్టాల్సి వస్తే అదృష్టం ఉన్న వ్యక్తి సీఎం అవుతారు. మా నేత ఎప్పటికీ లాలూ ప్రసాదే. నితీశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి మాత్రమే' అంటూ ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా వరుసగా ఆర్జేడీ నేతలు నితీశ్ పై విమర్శల పర్వం కొనసాగిస్తే జేడీయూ నేతలు కూడా స్పందించి బిహార్లో వారి కూటమికి బీటలు వారే అవకాశం లేకపోలేదు. జేడీయూ, ఆర్జేడీ ఉమ్మడిగా బిహార్లో అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. -
పెగ్గులమీద పెగ్గులేసి నితీశ్ పరువు తీశాడు
పాట్నా: ఆయనొక బిహార్ రూలింగ్ పార్టీ నాయకుడు. సొంతపార్టీ అధికారంలో ఉంది కదా.. ఆ మత్తుకు మద్యం మత్తు చేర్చాడు. ఓ పక్క రాష్ట్రమంతా మద్యాన్ని నిషేధించి ఎవరు ఆ మత్తు బారిన పడకుండా ఉండాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్యలు తీసుకుంటుండగా.. ఈ నాయకుడు మాత్రం అందుకు భిన్నంగా పనిమొదలుపెట్టాడు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన లలన్ రామ్ అనే ఈ పెద్ద మనిషి ఏం చక్కా బనియన్, షార్ట్ వేసుకొని ఓ రబ్బురు కుర్చీలో కూర్చుని ఎదురుగా బీరు బాటిళ్లు ఇతర ఓడ్కా పెట్టుకొని పెగ్గులమీద పెగ్గులు లాగించాడు. అలా పెగ్గులేస్తూ తానొక బాహుబలినని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పక్కన ఉన్నంత సేపు ఏం కాదని డంబాలు పలికాడు. అతడి దురదృష్టం కొద్ది ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని పలకరించింది. దీంతో మద్యం నిషేధం ఆదేశాలను ఉల్లంఘించిన ఆరోపణల కిందట పోలీసులు అరెస్టు చేశారు. పైగా ముఖ్యమంత్రి పరువు తీయడమే కాకుండా.. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. -
బిహార్లో కల్లుపైనా నిషేధం!
పట్నా: వచ్చే ఏడాది నుంచి బిహార్లో కల్లుపై కూడా నిషేధం విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చెప్పారు. మద్య నిషేధం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య బాగా తగ్గిందన్నారు. కల్లును ఆహార పదార్థాల్లో వినియోగించేలా ప్రోత్సహిస్తామని, అందుకోసం ఒక కమిటీ ఏర్పాటు చేశామని శనివారం ముజఫర్పూర్లో చెప్పారు. తమిళనాడులో గత 25 ఏళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. -
'బీజేపీ అంతగా పొంగిపోనవసరం లేదు'
పాట్నా: అసోం విక్టరీపై అంత పొంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీకి చెప్పారు. అంతగా సంతోషపడేంత విజయం ఏం ఆ పార్టీ స్పందించలేదని పరోక్షంగా చురకలంటించారు. గురువారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో అంతకుముందు అసోంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోగా బీజేపీ ఇతర మిత్రపక్షాలను కలుపుకొని విషయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున సంబురాల్లో మునిగి తేలాయి. ఈ సందర్భంగా నితీష్ స్పందిస్తూ 'బీజేపీ అసోంలో విజయంపట్ల సంబురాల్లో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీలను స్థానిక పార్టీలను కలుపుకొని బీజేపీ విజయంసాధిస్తే.. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది' అని అన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్ఛేరి, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. -
ఆ హత్య కేసు సీబీఐకి ఇస్తున్నారు
పాట్నా: ఎట్టకేలకు బిహార్లో దారుణ హత్యకు గురైన జర్నలిస్టు కేసు విచారణ వేగాన్ని అందుకోనుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. 'మేం ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. దర్యాప్తు సంస్థకు కావాల్సిన అన్ని రకాల సమాచారాన్ని మేం అందిస్తాం' అని జనతా దర్బార్ కార్యక్రమం అనంతరం నితీష్ చెప్పారు. ఈ కేసును సీబీఐతోనే విచారించాలని బాధిత కుటుంబం కోరిందని, ఆమేరకే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సివాన్ లోని ఓ హిందీ డైలీకి బ్యూరో ఇంచార్జీగా పనిచేస్తున్న రాజ్ దేవ్ రంజన్ ను ఈ నెల 13న గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
తల్లిదండ్రుల వద్దకు కన్హయ్య
పాట్నా: దేశ ద్రోహం ఆరోపణల కేసులో అరెస్టయి అనంతరం విడుదలయిన జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తన సొంత గ్రామానికి వెళ్లనున్నాడు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో అడుగుపెట్టిన అతడు బెగుసరాయ్లోని తన స్వగ్రామం బిహాత్కు వెళ్లి తన తల్లిదండ్రులను కలవనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం పాట్నా విమానాశ్రయంలో కన్హయ్య కుమార్ కు భారీ స్వాగతం లభించింది. ఈ పర్యటనలో భాగంగా అతడు బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత శద్రఘ్న సిన్హాతో భేటీ అవనున్నాడు. మే 1న పలుచోట్ల బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు. -
జేడీయూ చీఫ్గా నితీశ్
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనతాదళ్ (యునెటైడ్) పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న శరద్ యాదవ్ పదవీకాలం ముగియడంతో కొత్తగా నితీశ్ను ఎన్నుకున్నారు. 2006 నుంచి మూడుసార్లు జేడీ (యూ) అధ్యక్షుడిగా శరద్ యాదవ్ ఎన్నికయ్యారు. నాలుగోసారి కొనసాగేందుకు ఆయన విముఖత చూపారు. దీంతో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నితీశ్ను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్తో కలసి జేడీ (యూ) అధికారం చేపట్టడంలో నితీశ్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో 2019 సాధారణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆదరణ తెచ్చేందుకు, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడానికి వీలుగా నితీశ్కు ఈ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎన్నిక అనంతరం నితీశ్ స్పందిస్తూ ‘శరద్ యాదవ్ నాయకత్వ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని ట్వీట్ చేశారు. -
బిహార్లో సంపూర్ణ మద్యనిషేధం
సీఎం నితీశ్కుమార్ ప్రకటన పట్నా: బిహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలులోకి వచ్చింది. దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) సహా రాష్ట్రంలో మద్యం(ఆల్కహాల్) విక్రయాలు, వినియోగంపై నితీశ్ కుమార్ ప్రభుత్వం మంగళవారం పూర్తి నిషేధాన్ని విధించింది. మంత్రివర్గ సమావేశానంతరం ముఖ్యమంత్రి నితీశ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఇది తక్షణం అమలులోకి వస్తున్నట్టు పేర్కొన్నారు. బార్లు, రెస్టారెంట్లతోసహా రాష్ట్రంలో ఎక్కడా ఆల్కహాల్ను విక్రయించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయ మద్యం విక్రయాలు, వినియోగంపై ఏప్రిల్ ఒకటి నుంచి బిహార్ ప్రభుత్వం నిషేధం విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్నా, ఇతర పట్టణాల్లోనూ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రత్యేకించి మహిళలు, చిన్నారుల్లో బ్రహ్మాండమైన స్పందన రావడంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలన్న నిర్ణయానికి మంత్రివర్గం వచ్చినట్టు సీఎం వివరించారు. పట్టణాలు, నగరాల్లోని హోటళ్లు, క్లబ్బులు, బార్ల వంటి ప్రదేశాల్లో మద్యం విక్రయాలకు లెసైన్సులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కానీ ఆర్మీకి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
ఇక మొత్తానికే మద్యం బంద్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రెండు మూడు రోజుల కిందట మద్యంపై స్వల్పంగా నిషేధం విధించిన ఆయన ఇక సంపూర్ణ నిషేధ ప్రకటన చేశారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ విధమైన మద్యం విక్రయించినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. గతంలో ప్రొహిబిషన్ డే సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని, మద్యం కారణంగా చిన్నచిన్న కుటుంబాలే కాకుండా ఎంతోమంది జీవితాలు చిద్రమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రకారమే ఏప్రిల్ 1న తొలుత గ్రామీణ ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం ప్రకటించారు. 'ఏ బార్లలోనూ, పబ్బుల్లోనూ ఇకనుంచి మద్యం విక్రయాలు జరపరాదు. రాష్ట్రమంతటా మద్యంపై నిషేధం విధించాము. ఇది ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుంది. మహిళలు, పిల్లలు, యువకులు మేం తీసుకున్న ఈ నిర్ణయానికి అనుకూలంగా పనిచేయాలి' అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెప్పారు. ఆర్మీకి మాత్రం ఆయన మినహాయింపును ఇస్తున్నట్లు చెప్పారు. లిక్కర్ బ్యాన్ కారణంగా ఎవరైతే ఉపాధి కోల్పోతున్నారో వారందరి త్వరలోనే మంచి ఉద్యోగ బాట చూపిస్తామని నితీష్ చెప్పారు. తాజాగా, బిహార్ తీసుకున్న నిర్ణయంతో మద్యంపై పూర్తి నిషేధం విధించిన నాలుగో రాష్ట్రంగా నిలిచింది. ఇప్పటికే నాగాలాండ్, మణిపూర్, గుజరాత్ రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. -
ఉత్తరాదిన మరో కొత్త పార్టీ!
జేడీయూ, ఆర్ఎల్డీ, జేవీఎంపీ, ఎస్జేపీఆర్ విలీనంపై కసరత్తు న్యూఢిల్లీ: ఉత్తరాదిన జనతా పరివార్ పేరిట జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీన ప్రయోగ వైఫల్యం తర్వాత తాజాగా మరో విలీన ప్రక్రియ తెరపైకి వచ్చింది. ఈసారి బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లలో జేడీయూ, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ), జార్ఖండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్ (జేవీఎంపీ), సమాజ్వాది జనతా పార్టీ- రాష్ట్రీయ(ఎస్జేపీఆర్)లు విలీనంవైపు అడుగులు వేస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటుకోసం బిహార్ సీఎం నితీశ్ కుమార్, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్, ఆర్ఎల్డీ చీఫ్అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్, ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తదితరులు ఈనెల 15న ఢిల్లీలో జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి ఇంట్లో సమావేశమై మార్గదర్శకాలపై చర్చించినట్లు తెలిసింది. జార్ఖండ్ మాజీ సీఎం, జేవీఎంపీ చీఫ్ బాబూలాల్ మరాండితో నితీశ్ నేరుగా చర్చలు జరుపుతున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరో పక్క అజిత్సింగ్,త్యాగీలు ఎస్జేపీ(ఆర్) అధినేత కమల్ మొరార్కతో విలీనంపై చర్చించారు. త్వరలోనే ఈ 4 పార్టీలు విలీనం కానున్నాయని, చర్చలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని విలీన ప్రక్రియను చూస్తున్న నాయకులు తెలిపారు. విలీన తేదీని ఖరారు చేయనప్పటికీ ఈ నెలాఖరుకల్లా కొత్త పార్టీ ఆవిర్భావం ఖాయమంటున్నారు. -
రాజకీయాలదే రాజద్రోహం!
జాతీయతపై చర్చ జరగాలన్న జేఎన్యూ ‘రోహిత్ కా జేఎన్యూ’ అంటూ వెలిసిన పోస్టర్లు న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి.. తీహార్ జైల్లో ఉన్న జేఎన్యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్ కోసం ఎదురుచూస్తున్నామని ‘రోహిత్ కా జేఎన్యూ’, ‘జస్టిస్ ఫర్ రోహిత్’ పేరుతో వర్సిటీలో పోస్టర్లు వెలిశాయి. తీహార్ జైలునుంచి కన్హయ్య విడుదలై వర్సిటీకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యార్థులు, ప్రొఫెసర్లు కోరుతున్నట్లు వాటిలో ఉంది. ‘దేశంలో, వర్సిటీల్లో రాజద్రోహం గురించి కాదు.. రాజకీయాలే రాజద్రోహంగా తయారయ్యాయనే అంశంపై చర్చించాలి. భావప్రకటనను వ్యక్తీకరించినందుకు విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇప్పుడు జాతీయతపై చర్చ జరగాలి’ అని జేఎన్యూఎస్యూ వైస్ ప్రెసిడెంట్ షెహ్లా రషీద్ షోరా తెలిపారు. రాజద్రోహం కేసులో జైలుపాలైన తోటి విద్యార్థులకు మద్దతుగా సందేశాలిచ్చేందుకు.. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద పెద్ద గోడను నిర్మించే పనిలో ఉన్నారు. కాగా కన్హయ్య బెయిల్ పిటిషన్పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఫిబ్రవరి 24న జరిగిన విచారణలో కన్హయ్య లాయర్లు ఇచ్చిన వివరణపై జడ్జి విభేదించటంతో.. కేసు 29కి వాయిదా పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది. జేఎన్యూ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ విపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అఫ్జల్గురు ఉరితీతపై జరుగుతున్న వివాదంతో జేఎన్యూకు ఎలాంటి నష్టమూ జరగదని.. వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మేధావుల మద్దతుందని.. చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. అప్రజాస్వామిక నియంత పాలన తప్ప.. మేధావుల ఆలోచనను ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో విభజన సృష్టించేందుకు కేంద్రం మద్దతు తెలుపుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. అయితే.. దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కఠినచర్యలు తప్పవని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమది బలహీన ప్రభుత్వం కాదని.. జాతివ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కాగా, రాజద్రోహం కేసులో జేఎన్యూ విద్యార్థి, జేఎన్యూఎస్యూ మాజీ అధ్యక్షుడు అశుతోష్ను ఢిల్లీలోని ఆర్కేపురం స్టేషన్ పోలీసులు ఆదివారం రెండుసార్లు ప్రశ్నించారు. ఖాలిద్, అనిర్బన్లతో కలిసి అశుతోష్ను కార్యక్రమ నిర్వహణపైనే ప్రశ్నించారు. -
‘నేతాజీ’ వంద ఫైళ్లు బహిర్గతం
చరిత్రలో మరిచిపోలేని రోజు: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించిన 100 ఫైళ్లను ఆయన 119వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీల్లో బహిర్గతం చేశారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ)లో జరిగిన కార్యక్రమంలో ప్రధానితోపాటు నేతాజీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోస్పై ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించిన ఎన్ఏఐ.. ప్రతి నెల 25 కొత్త ఫైళ్లను ఈ వెబ్సైట్లో ఉంచాలని భావిస్తోంది. గతేడాది అక్టోబర్లో బోస్ కుటుంబ సభ్యులతో సమావేశమైన మోదీ.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మోదీ 100 ఫైళ్లను (మొత్తం 16,600 పేజీలు) ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నేతాజీ అదృశ్యంపై గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన రెండు కమిషన్లు.. 1945 ఆగస్టు 18 తైపీలో జరిగిన విమాన ప్రమాదంలోనే మృతిచెందినట్లు వెల్లడించాయి. కాగా, ఎంకే ముఖర్జీ నేతృత్వంలోని మూడో కమిటీ మాత్రం విమాన ప్రమాదం తర్వాత కూడా బోసు బతికే ఉన్నారని తెలిపింది. శనివారం బహిర్గతమైన 100 ఫైళ్లలో ప్రధాని కార్యాలయం నుంచి 36, హోంశాఖ నుంచి 18, విదేశాంగ వ్యవహారాలనుంచి 46 ఫైళ్లున్నాయి. ఏడు దశాబ్దాల తర్వాత: నేతాజీ బంధువులు మోదీ చొరవపై బోస్ బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘చాలా సంతోషం. ఈ దిశగా మోదీ తీసుకున్న చొరవను స్వాగతిస్తున్నాం. చరిత్రలో ఇది పారదర్శకమైన రోజు. రష్యా, జర్మనీ, యూకే, యూఎస్లలో ఉన్న ఆధారాలను తీసుకురావటంపై మోదీ సర్కారు చొరవతీసుకోవాలి’ అని బోస్ మనవడు సుభాష్ కుమార్ తెలిపారు. ఈ అద్భుతమైన సమయం కోసం బోసు కుటుంబం ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోందని నేతాజీ అల్లుడు అర్ధేందు బోస్ తెలిపారు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన ఫైళ్లను మరింత ముందుగానే బహిర్గతం చేసుంటే బాగుండేదని మరికొందరు కుటుంబ సభ్యులు కొందరు అభిప్రాయపడ్డారు. ఇందులో మోదీ చేసిందేమీ లేదని.. జపాన్ పర్యటనలో నేతాజీ అస్థికలున్న రెంకోజీ మందిరాన్ని కూడా ప్రధాని సందర్శించలేదని చారిత్రకవేత్త సుగతా బోస్ (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ) విమర్శించారు. ప్రధాని తీరుపై అనుమానం: కాంగ్రెస్ ప్రధాని నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేస్తున్న విధానం అనుమానాలకు తావిస్తోందని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కేంద్ర మాజీమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. అటు, బిహార్ సీఎం నితీశ్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫైళ్ల బహిర్గతం వెనక నిగూఢ ఎజెండా ఉందని విమర్శించారు. 7 దశాబ్దాలుగా దేశం ఎదురుచూస్తున్న నేతాజీ అదృశ్య రహస్యాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రకటించింది. కోల్కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతాజీకి ఘనంగా నివాళులర్పించారు. ఫైళ్ల విడుదలపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ అన్నారు. నేతాజీని యుద్ధ నేరస్తుడిగా పేర్కొంటూ.. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి రాసిన లేఖ కూడా బహిర్గతమైన వివరాల్లో ఉందన్నారు. నేతాజీకి ఘన నివాళి సుభాష్ చంద్రబోస్ 119వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘స్వాతంత్రం వచ్చి ఎన్ని తరాలైనా భారతీయులు నేతాజీ శౌరత్వం, దేశభక్తి, ధైర్యాన్ని మరిచిపోలేదు. అందుకే ఆయన జయంతి సందర్భంగా దేశమంతా బోసుబాబును గుర్తుచేసుకుంటోది. నేతాజీ సూత్రాలను భారతీయులు ఓ బాధ్యతగా తీసుకోవాలి’ అని మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించారు. అటు పార్లమెంటు సెంట్రల్ హాల్లోనూ నేతాజీకి పలువురు ప్రముఖులు పుష్పాంజలి అర్పించారు. నేతాజీ భారత్కు రాకుండా నెహ్రూ అడ్డుపడ్డారు: సుబ్రహ్మణ్య స్వామి మైసూరు: చంద్రబోస్ భారత్కు రాకుండా జవహార్లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. శనివారం మైసూరులో ఆయన మాట్లాడారు. సెంట్రల్ వర్సిటీలో విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యపై స్పందిస్తూ.. శిక్షణ సంస్థలు, వర్సిటీల్లో ఆందోళనలు,ధర్నాలు శృతి మించితే విద్యార్థులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫైళ్లలో ఏముంది? తైపీలోని తైహుకులో 1945లో జరిగిన విమాన ప్రమాదంలోనే నేతాజీ మరణించారని భారత ప్రభుత్వం నిర్ధారించింది. 1995 ఫిబ్రవరి 6న జరిగిన కేబినెట్ నోట్పై అప్పటి కేంద్ర హోం సెక్రటరీ పద్మనాభయ్య సంతకం ఉంది. ‘కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు నేతాజీ ఇంకా బతికే ఉన్నారని భావిస్తున్నారు. కానీ వాస్తవాలేవీ దీన్ని ధృవీకరించటం లేదు. 1945 ఆగస్టు 18నే నేతాజీ మరణించారని భావిస్తున్నాం’ అని నోట్ పేర్కొంది. వివిధ దర్యాప్తు సంస్థలతో భారత ప్రభుత్వం జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఫైళ్లలో ఉన్నాయి. భారత్-పాక్ మధ్య తాష్కెంట్ ఒప్పందం తర్వాత రష్యన్ రేడియోలో నేతాజీ మాట్లాడారంటూ.. మాజీ ఎంపీ సమర్ గుహ వెల్లడించిన అభిప్రాయాలు ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. బోస్ తైపీ ప్రమాదంలో చనిపోయారనే వార్తలపై బ్రిటీష్ ప్రభుత్వంలో తీవ్రంగా చర్చ జరిగింది. ‘ప్రమాదంలో బోస్ మృతిచెందారని నిర్ధారిస్తున్నాం. దాదాపు 30వేల మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏర్పాటు చేసి.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ’ అని ప్రకటన విడుదల చేసినట్లు ఫైళ్లలో ఉంది. -
'నితీశ్ను బాంబుపెట్టి లేపేస్తా'
పట్నా: బిహార్ ఎన్నికల్లో తన సత్తా చాటి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న జేడీయూ నేత నితీశ్ కుమార్ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల వివరాల ప్రకారం పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ చానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు చానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
20న నితీశ్ ప్రమాణం!
దీపావళి, ఛత్ పండుగలు ముగిశాకే కొత్త సర్కారు: జేడీయూ ♦ బిహార్లో ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి పక్షాల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయి ♦ లాలూ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడి పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో.. నితీశ్కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 20వ తేదీన మళ్లీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బుధవారం (11వ తేదీ) దీపావళి పండుగ ఉండగా.. దాని తర్వాత వచ్చే ఛత్ పండుగ ఈ నెల 18వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రజలు ఈ పండుగల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి.. ఛత్ ముగిసిన తర్వాత నితీశ్ ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు బశిష్ట నారాయణ్సింగ్ మంగళవారం పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. అధికారికంగా తేదీని ప్రకటించనప్పటికీ.. ఈ నెల 20వ తేదీన కొత్త సర్కారు కొలువుతీరే అవకాశముందని ప్రస్తుతం ముగియనున్న నితీశ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులు సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుపై మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ల అధినాయకత్వాలు చర్చిస్తున్నాయని.. ఏ పార్టీ నుంచి స్పీకర్ను ఎన్నుకోవాలి అనే అంశంతో పాటు.. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ కుమారుడు తేజస్విని ఉప ముఖ్యమంత్రిని చేయాలా అన్న అంశంపైనా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత శాసనసభ పదవీ కాలం ఈ నెల 29వ తేదీ వరకూ ఉందని.. కాబట్టి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయటానికి తొందరేమీ లేదని సీఎం నితీశ్ ఆదివారం నాడు పేర్కొన్నారు. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న నితీశ్.. ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం విశేషం. ఆయన తొలిసారి 2000 సంవత్సరంలో సీఎంగా ప్రమాణం చేశారు. అయితే కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. అనంతరం 2005లో అధికారంలోకి వచ్చిన నితీశ్, మళ్లీ 2010లోనూ సీఎం అయ్యారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో పార్టీ దారుణంగా దెబ్బతినటంతో సీఎం పదవి నుంచి తప్పుకున్న నితీశ్.. మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జితన్రాంమాంఝీని తప్పించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
సీఎం అభ్యర్థిగా నేనుంటే..
పట్నా: బీజేపీ తరఫున బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని సోమవారం బాలీవుడ్ నటుడు, ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. బిహార్ ముద్దుబిడ్డనైన తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే తన అభిమానులు, మద్దతుదారులపై అది చాలా ప్రభావం చూపించి ఉండేదని అన్నారు. ఇండియా టీవీ చానల్లో ప్రసారమయ్యే ఆప్కీ అదాలత్ అనే కార్యక్రమంలో శత్రు ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు చానల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పట్నాలో ఆయన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను కలసి, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడానికి కారకులైన నాయకులు గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఓటమికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్జేడీనేత లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా శత్రుఘ్నసిన్హా కలిసి కింగ్మేకర్గా అవతరించారంటూ అభినందించారు. సిన్హాను లాలూ ప్రశంసించారు. ఇదిలా ఉంటే శత్రు వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తీవ్రంగా స్పందించారు. శత్రును ఆయన కుక్కతో పోల్చారు. -
ఎన్నికల వేళ ’బీఫ్’ దుమారం
బిహార్ తుది దశ పోలింగ్ జరిగే చోట్ల బీజేపీ ప్రకటన ♦ బీజేపీ ప్రకటనపై మండిపడ్డ మహాకూటమి.. ఈసీకి ఫిర్యాదు ♦ నేడు 57 స్థానాలకు పోలింగ్.. 8న కౌంటింగ్ పట్నా: బిహార్లో చివరిదైన ఐదో దశ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ దశలో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తుది దశ ఎన్నికల పోలింగ్కు కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన ఓ పత్రికా ప్రకటన దుమారం రేపింది. ఓ మహిళ గోవును కౌగిలించుకుని ఉన్నట్టుగా ఉన్న ఈ ప్రకటనలో.. గోమాతను కించపరుస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్యాదవ్ సహా పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలపై సీఎం నితీశ్ కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. గురువారం పోలింగ్ జరగనున్న కిషన్గంజ్, సహర్సా తదితర ప్రాంతాల్లోని పత్రికల్లో ఈ ప్రకటన ప్రచురితమైంది. హిందువులు కూడా బీఫ్ తినాలన్న లాలూ వ్యాఖ్యలను.. ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీఫ్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను ప్రకటనలో పేర్కొంది. నితీశ్ ఓటు బ్యాంకు రాజకీయాలు కట్టిపెట్టాలని, తన సన్నిహితులు చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించింది. జవాబు చెప్పకపోతే ఓటు ఉండదంది. ప్రకటనపై మహాకూటమి మండిపడింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్, జేడీయూ ఆరోపించాయి. బీజేపీ ప్రకటనపై కాంగ్రెస్, జేడీయూ నేతల బృందం ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసింది. మత ప్రాతిపదికన ఓట్లు దక్కించుకునేందుకే బీజేపీ ఈ ప్రకటన ఇచ్చిందని ఆరోపించింది. బీజేపీ మాత్రం తమ ప్రకటనలో తప్పు లేదని సమర్థించుకుంది. తుది దశ ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలోని 24 స్థానాలతో పాటు మధుబని, దర్భంగ, సుపాల్, మాధేపుర, సహర్స, అరారియా, కిసాన్గంజ్ , పూర్నియా, కతిహార్ జిల్లాల్లోని సీట్లలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 8న కౌంటింగ్ జరుగుతుంది. -
బహుళ ప్రయోజనకారి వాటర్గ్రిడ్
అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా (వాటర్గ్రిడ్) ప్రాజెక్ట్ను బహుళ ప్రయోజనకారిగా మార్చాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వాటర్గ్రిడ్ పైప్లైన్ తో పాటు ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ను కూడా వేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని నిర ్ణయించినట్లు చెప్పారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఫైబర్ కేబులింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. పైప్లైన్ల కోసం త్వరలోనే తవ్వకాలు ప్రారంభిస్తున్నందున, ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి సంబంధించిన విధి విధానాలను ఈనెల 9లోగా తయారు చేయాలని నిర్దేశించారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పైప్లైన్తో పాటు కేబుల్స్ వేయడం ద్వారా 80 శాతం ఖర్చు తగ్గుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐటీశాఖకు సూచించారు. సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్రంజన్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాటర్గ్రిడ్పై పశ్చిమబెంగాల్ ఆసక్తి: వాటర్గ్రిడ్పె పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమితాసక్తిని కనబరుస్తోందని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ డిజైన్తో పాటు ఫైనాన్షియల్ మోడల్ గురించి వివరించాలని ఆ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సౌరభ్దాస్ తనకు లేఖ రాశారని పేర్కొన్నారు. ఈనెల 4న బెంగాల్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బృందం రాష్ట్రానికి వస్తున్నట్లు చెప్పారన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ వాటర్గ్రిడ్ గురించి తెలుసుకోగా, బిహార్ ఎన్నికల ప్రచారంలోనూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్కుమార్ వాటర్గ్రిడ్ ఏర్పాటుపై హామీ ఇచ్చినట్లు తెలిసిందని ఈఎన్సీ చెప్పారు. -
‘మత’ కోటా కోరింది నితీశ్, లాలూనే: మోదీ
కతిహార్/మధుబని: ఇప్పటికే తీవ్రస్థాయిలో రగులుకున్న రిజర్వేషన్ల తేనెతుట్టెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కదిపారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ 2005లో డిమాండ్ చేశారన్నారు. అసలు ఆ సమయంలో ఒకరి ముఖం మరొకరు చూసుకోనంతగా బద్ధశత్రువులుగా ఉన్న వారిద్దరూ... మత ప్రాతిపాదికన రిజర్వేషన్లపై మాత్రం ఏకమయ్యారని విమర్శించారు. ఆదివారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్, మధుబనిల్లో నిర్వహించిన ర్యాలీల్లో మోదీ ప్రసంగించారు. అంబేడ్కర్, నెహ్రూ, వల్లభాయ్పటేల్ వంటి గొప్పవారు వ్యతిరేకించిన ‘మత రిజర్వేషన్లను’.. అమలు చేయాలని నితీశ్, లాలూ వంటివారు కోరారని.. ఇప్పుడేమో తమకు మతం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రస్తుత రిజర్వేషన్ల విధానాన్ని మార్చేందుకు అధికారం లేదని అన్నారు. -
సోనియా కూడా ‘బాహరీ’నా?
బయటివాడని నితీశ్ చేసిన వ్యాఖ్యలకు మోదీ కౌంటర్ ♦ 25 ఏళ్ల పాలనలో బిహార్ను లూటీ చేశారని నితీశ్, లాలూలపై ధ్వజం ♦ ముగిసిన 4వ దశ ఎన్నికల ప్రచారం; 55 స్థానాలకు రేపు పోలింగ్ ముజఫర్పూర్/గోపాల్గంజ్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. 4వ దశ ఎన్నికల ప్రచారం చివరిరోజైన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ముజఫర్పూర్, గోపాల్గంజ్ సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల్లో జేడీయూ నేత, సీఎం నితీశ్ కుమార్ చేస్తున్న ‘బిహారీ వర్సెస్ బాహరీ(బిహార్ వ్యక్తి వర్సెస్ బయటి వ్యక్తి)’ ప్రచారంపై మోదీ మరోసారి మండిపడ్డారు. తాను పాకిస్తాన్కో, శ్రీలంకకో, బంగ్లాదేశ్కో ప్రధానిని కానని.. బిహార్తో కూడిన భారత్కు ప్రధానినని స్పష్టం చేశారు. ‘ఢిల్లీలో నివసిస్తున్న సోనియాగాంధీని కూడా నితీశ్ బయటి వ్యక్తి అనే అంటారా? ఆమె బిహారీనా? లేక బాహరీనా?.. చెప్పండి నితీశ్ బాబూ.. పనితీరు పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేని వారే ఇలా అంటుంటారు’ అని అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ సొంతగడ్డ గోపాల్గంజ్ సభలో మాట్లాడుతూ.. దోపిడీలతో ఈ ప్రాంతాన్ని మరో చంబల్గా మార్చాడంటూ లాలూపై ధ్వజమెత్తారు. ‘లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన అచ్చే దిన్ హామీని నెరవేర్చలేకపోతే పాత రోజులను మోదీ తిరిగితెస్తారా?’ అన్న నితీశ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘నాటి ఆటవిక పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారా?’ అని నితీశ్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో రాష్టంలో వెల్లువెత్తిన 30 కుంభకోణాల జాబితాను మోదీ వరుసబెట్టి చెప్పారు. ‘ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ల కూటమిని గెలిపిస్తే మరిన్ని స్కామ్లు తెరపైకి వస్తాయి. బిహార్ను లూటీ చేసిన వారంతా కలసి ఏర్పాటు చేసుకున్న కూటమిని శాశ్వతంగా తిరస్కరించండి. వారిని కఠినంగా శిక్షించండి’ అని పిలుపునిచ్చారు. అన్ని విషయాల్లో తనపై విమర్శలు గుప్పించే తన శత్రువులు సైతం.. ప్రధానిగా తన 16 నెలల పాలనపై అవినీతి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. లోక్సభ ఎన్నికల్లో తనపై విశ్వాసం ఉంచినట్లే.. ఈ ఎన్నికల్లోనూ తనను నమ్మాలని బిహారీలను కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం మంచిదని చెబుతూ.. ‘వెనకబాటుతనం అనే ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని పైకి లాగడానికి కేంద్రం, రాష్ట్రం అనే రెండు ఇంజిన్లు అవసరమవుతాయ’ని వ్యాఖ్యానించారు. 4వ దశ ఎన్నికల్లో 55 స్థానాలకు నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. రిజర్వేషన్ల కుట్ర... ముస్లిం రిజర్వేషన్లను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా నుంచి కొంత శాతాన్ని ఓ ప్రత్యేక వర్గాన్ని కేటాయించేందుకు మహా కూటమి కుట్ర చేస్తోందని మోదీ మళ్లీ ఆరోపించారు. దీన్ని రాజ్యాంగ నిర్మాతలు కూడా వ్యతిరేకించారన్నారు. దీనికి సంబంధించి నితీశ్ కుమార్ 2005, ఆగస్ట్ 24న పార్లమెంట్లో చేసిన ప్రసంగాన్ని మోదీ ప్రస్తావించారు. బడే భాయి.. చోటే భాయి.. ‘గత 25 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన బడే భాయి(లాలూ), చోటే భాయి(నితీశ్) రాష్ట్రాన్ని నాశనం చేశారు. వారు మళ్లీ అధికారంలోకి వస్తే మీకు ఉద్యోగాలు రావు. ఉపాధి దొరకదు. బడా భాయికి తన కుటుంబం బావుంటే చాలు. గతంలో దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లినప్పుడు భార్యను సీఎం చేశాడు. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కొడుకును సిద్ధం చేస్తున్నాడు’ అని లాలు, నితీశ్లను ఎద్దేవా చేశారు. అభివృద్ధి మంత్రం నుంచి పక్కకు.. బిహార్లో ఎన్డీయే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ ప్రచార దిశ అభివృద్ధి మంత్రం నుంచి ఓబీసీలను ఆకర్షించే వైపునకు మారింది. ఓ ఓబీసీ కుమారుడికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదా? అంటూ మోదీ ఈ ప్రచారంలో ఓబీసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. దేశాన్నీ కోల్పోతారు: నితీశ్ బిహార్ను సాధించుకోవాలనే ఆరాటంతో ఉన్న ప్రధాని మోదీ తన విభజనవాద వ్యాఖ్యలతో దేశాన్నీ కోల్పోతారని నితీశ్ అన్నారు. కోటాపై మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందించారు. -
బిహార్ మూడో దశలో 53 శాతం పోలింగ్
పట్నా: 50 నియోజకవర్గాల్లో బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల పోలింగ్ బుధవారం ముగిసింది. 53.32% పోలింగ్ నమోదైంది. ఇది మొదటి, రెండో దశల పోలింగ్ శాతం కన్నా తక్కువ. ఈ దశలోనూ పురుషుల(52.5%) కన్నా మహిళలే(54%) ఉత్సాహంగా ఓటేశారు. బక్సర్లో అత్యధికంగా 56.58%, పట్నాలో అత్యల్పంగా 51.82% ఓటింగ్ జరిగినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అజయ్ వీ నాయక్ తెలిపారు. సరన్ జిల్లాలో 123 ఏళ్ల వృద్ధురాలు ఓటుహక్కును వినియోగించుకుందన్నారు. భక్తియార్పూర్లోని ఓ పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓటేశారు. ఈ ప్రాంతంలో సరైన వైద్యం అందని కారణంగా ఒక బాలిక మృతి చెందిన విషయమై ఆయన కొంత నిరసనను ఎదుర్కొన్నారు. గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ దంపతులు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవీ తదితరులు ఓటేశారు. -
ఆ సీఎం ఇంట్లో ఇప్పటికీ కరెంట్ లేదు
పాట్నా: అది బీహార్లోని నలంద జిల్లాలో గల కళ్యాణ్ బిగా అనే గ్రామం. అక్కడ 24గంటలు విద్యుత్ సౌకర్యం ఉండగా.. ఒక్క ఇంటికి మాత్రం అసలు విద్యుత్ కనెక్షన్ లేదు. అదేదో పేదవాడి ఇళ్లనుకుంటే పొరపాటే. ఎందుకంటే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇళ్లు. ఆ ఇల్లు నిర్మించి చాలా ఏళ్లు అయినా ఇప్పటి వరకు ఆ ఇంట్లో విద్యుత్ వెలుగులు మాత్రం లేవు. ఈ విషయంపై ఆరా తీయగా.. ఆ ఇంటిని కాపలాగా ఉండి సంరక్షించుకునే సీతారం అనే పెద్ద మనిషి వివరణ ఇచ్చాడు. 'ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కట్టుకున్న ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. బీహార్లోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ వచ్చే వరకు తన ఇంటికి కనెక్షన్ తీసుకోనని నితీశ్ కుమార్ చెప్పారు' అని అతను చెప్పాడు. దీంతోపాటు ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ నితీశ్పై అభిమానం కలిగి ఉన్నారని, మూడోసారి కూడా నితీశ్ ముఖ్యమంత్రి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్జేడీతో కలిసి ఈసారి జేడీయూ ఎన్నికల బరిలోకి దిగడం ప్రశ్నించగా.. నితీశ్ ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ మంచి అభివృద్ధి చేస్తాడని చెప్పాడు. ప్రారంభంలో బీహార్లో నేర ప్రవృత్తి ఎక్కువగా ఉండేదని, కానీ తుపాకీ సాయం లేకుండానే ఆయన దానిని నిర్మూలించాడని చెప్పారు. మున్ముందు కూడా ఇలాగే బీహార్ ఆయన ఆధ్వర్యంలోనే ఆర్థిక పురోగతి సాధిస్తుందని తెలిపాడు. -
ఫేస్బుక్లో ప్రశ్నలకు సీఎం సమాధానం
పట్నా: అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఓటర్లను ఆకర్షించడానికి వీలున్న ఆ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరికొద్ది గంటల్లో తొలిదఫా పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫేస్బుక్లో తనను ఉద్దేశించి వివిధ వర్గాలు ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన స్వయంగా సమాధానం చెప్పారు. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సీఎం నితీశ్ జవాబు ఇస్తూ.. "రాజ్యాంగం ఆధారంగా దేశంలో పాలన సాగుతున్నది. కులం ప్రతిపాదికగా కొన్ని చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగం వీలు కల్పిస్తున్నది. ఎంతో చర్చించి, ఎంతో శ్రద్ధతో ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ వ్యవస్థ ఉందని నా అభిప్రాయం. అదేసమయంలో ఆర్థికంగా వెనుకబడిన వారందరి అభ్యున్నతి, సమ్మిళిత అభివృద్ధి కోసమే నేను పాటుపడుతున్నాను' అని ఆయన తెలిపారు. జేడీయూ అధినేత అయిన నితీశ్ ఆర్జేడీ, కాంగ్రెస్తో జతకలిసి మహాకూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి ఎన్డీయేపై పైచేయి కోసం ప్రయత్నిస్తున్న ఆయన బీహార్ అభివృద్ధి కోసం తమ కూటమి ప్రవచిస్తున్న ఏడు సూత్రాలను మరోసారి ఫేస్బుక్ యూజర్లకు వివరించారు.