మార్కెట్లకు ఊతమిచ్చిన ఆర్బీఐ పాలసీ
Published Tue, Oct 4 2016 9:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేడు వెల్లడికానున్న నేపథ్యంలో రేట్ల కోత ఆశలతో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది.115.06 పాయింట్ల లాభంతో 28,358 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 32.85 పాయింట్ల లాభంలో 8,770గా నమోదవుతోంది. అదానీ పోర్ట్స్, హీరో మోటార్ కార్పొ, టాటా మోటార్స్, సిప్లా, బీహెచ్ఈఎల్లు టాప్ గెయినర్స్గా లాభాలు పండిస్తుండగా.. భారతీ ఎయిర్టెల్ నష్టాల గడిస్తోంది.
డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ స్వల్పంగా లాభపడింది. సోమవారం 66.59గా ముగిసిన రూపాయి నేటి ట్రేడింగ్లో 66.55గా ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) రెండు రోజుల సమావేశం నేడు ముగియనుంది. ఓ వైపు ఆర్బీఐ రేట్లను యథాతథంగా ఉంచుతుందనే సంకేతాలతో పాటు, మార్కెట్లకు ఆశ్చర్యకరంగా రేట్లలో కోత కూడా విధించవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు కొంత నష్టాల బాట పట్టాయి. ఉర్జిత్ పటేల్ వెలువడించే పాలసీపై మార్కెట్లు ఎక్కువగా దృష్టిసారించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
అటు ఆసియన్ షేర్లు కూడా లాభాలకు నష్టాలకు మధ్య ఊగిసలాటలో నడుస్తున్నాయి. ఓ వైపు జర్మనీ బ్యాంకు దిగ్గజం డాయిష్ బ్యాంకు భవితవ్యంపై ఆందోళన తగ్గుముఖం పట్టడంతో పాటు, మరోవైపు అమెరికా వడ్డీరేట్లను పెంచుతాదనే సంకేతాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియన్ మార్కెట్లు ఊగిసలాటలో నడుస్తున్నాయి.
Advertisement
Advertisement