సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది.
న్యూఢిల్లీ:సమైక్య నినాదాలతో పార్లమెంట్ సోమవారం మార్మోగింది. దాంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వాయిదాల పర్వం కొనసాగింది. సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగటంతో ఇరు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. కాగా ఈరోజు ఉదయం సీమాంధ్ర సభ్యుల నిరసనల హోరు మధ్యే సమావేశాన్ని నిర్వహించేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ప్రయత్నించారు. స్పీకర్ విజ్ఞప్తిని సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను తొలుత గంటపాటు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే హైడ్రామా నడిచింది. సీమాంధ్ర ఎంపీలు వెల్లోకి దూసుకువచ్చి నిరసనలు తెలపడంతో తొలుత రాజ్యసభను పది నిమిషాలు వేయిదా వేశారు. అనంతరం ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ మధ్యాహ్నం 12గంటల వరకూ వాయిదా వేశారు. ఆతర్వాత సమావేశాలు ప్రారంభమైనా సభ్యులు నిరసనలు కొనసాగటంతో సభ రేపటికి వాయిదా వేశారు.