నల్గొండ : నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మెడ వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా... మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందగా... మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ... నాగార్జునాసాగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో పంజాగుట్ట రిటైర్డ్ ఏసీపీ రాంరెడ్డి, కానిస్టేబుల్ సంజీవ్ మృతి చెందారు. స్థానికుల వెంటనే గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా కానిస్టేబుల్ తల్లి సంజీవ మృతి చెందింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మృతులు చింతపల్లి మండలం వాజ్మేడు గ్రామానికి చెందిన వారని పోలీసులు భావిస్తున్నారు.