ఒలింపిక్ కుస్తీయోధుడికి రాందేవ్ చాలెంజ్
ప్రస్తుతం పతంజలి ప్రోవీటా ప్రో రెజ్లింగ్ లీగ్ జరుగుతోంది. ఇందులో హర్యానా హేమర్స్, జైపూర్ నింజాస్ తమ తొలి సెమీ ఫైనల్లో బుధవారం తలపడతారు. అయితే.. దీనికంటే ఆసక్తికరమైన విషయం మరోటి ఉంది. 2008 ఒలింపిక్స్లో రెజ్లింగ్లో రజత పతకం సాధించిన ఆండ్రీ స్టాడ్నిక్ను తనతో తలపడి గెలవాల్సిందిగా బాబా రాందేవ్ సవాలు చేశారు. ఇది అందరికీ పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. బక్క పలచగా ఉండే బాబా రాందేవ్ ఏంటి.. అసలు రెజ్లింగ్ చేయడం ఏంటని అంతా అనుకుంటున్నారు. యోగాలో అంటే ఆయనకు తిరుగులేదు గానీ, రెజ్లింగ్ గురించి తెలుసా అని చర్చించుకుంటున్నారు.
బుధవారమే జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్కి ముందు ఆండ్రీ స్టాడ్నిక్, రాందేవ్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి జరగనుంది. తాను ప్రతిరోజూ వ్యాయామం చేస్తానని, తన శక్తిని పెంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, అలాగే సమయం చిక్కినప్పుడల్లా అఖాడాకు వెళ్లి రెజ్లింగ్ కూడా చూస్తానని రాందేవ్ చెబుతున్నారు. తాను ఇంతకుముందు జాతీయస్థాయి రెజ్లర్లతో తలపడ్డానని, కానీ ఒక అంతర్జాతీయ క్రీడాకారుడితో తలపడితే మరింత ఎగ్జయిటింగ్గా ఉంటుందని అన్నారు. ఈ మ్యాచ్లో యోగా రియల్ పవర్ ఏంటో చూస్తారని కూడా ఊరిస్తున్నారు.
ఈ చాలెంజ్ విషయం తెలియగానే ఆండ్రీ ముందు ఆశ్చర్యపోయాడు. కానీ, బాబా రాందేవ్ సిద్ధమవుతున్న విషయం తెలిసి, ఎలాగైనా ఆయనతో తలపడాల్సిందేనని సిద్ధమయ్యాడు. అయితే.. రాందేవ్ ఇలా రెజ్లర్లతో పోరాడటం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం హరిద్వార్లో తమ ఆశ్రమం 20వ వార్షికోత్సవం సందర్భంగా రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్ను చాలెంజ్ చేశారు. ఆ మ్యాచ్ తర్వాత.. బాబా నిజంగానే రెజ్లింగ్ను సీరియస్గా తీసుకుంటే ఆయన దేశంలోనే అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరు అయ్యేవారని సుశీల్ చెప్పాడు! మరిప్పుడు ఆండ్రీ ఏమంటాడో చూడాలి.