
'అవసరమైతే దండ.. లేకుంటే బండ వేస్తారు'
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవసరముంటే వాడుకుంటాదని, లేదంటే పక్కన పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రొద్దం సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే రోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. అవసరమైనపుడు దండ వేయడం, లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లిందని అన్నారు. వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే..
- దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి బొట్టుదాకా ఇందిరా గాంధీ కుటుంబం కోసం కష్టపడ్డారు
- వైఎస్ఆర్ బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లు గొప్పవాడన్నారు
- కాంగ్రెస్లో కొనసాగినంత వరకు వైఎస్ జగన్ను మంచి వాడన్నారు
- వైఎస్ఆర్ కోసం ప్రాణాలు వదిలిన వారి కోసం ఓదార్పు యాత్ర చేస్తే నన్ను చెడ్డవాడన్నారు
- కాంగ్రెస్ చంద్రబాబుతో కలసి నాపై కేసులు పెట్టింది
- అవసరమైనపుడు దండ వేయడం, అవసరం లేకుంటే బండ వేయడం రాహుల్కే చెల్లింది
- రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి ఇప్పుడు అన్యాయం జరిగిందని రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు
- ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సాధనకు అనేక పోరాటాలు చేశాం
- వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో వైజాగ్లో ధర్నా, తణుకు, మంగళగిరిలో దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం రాహుల్కు గుర్తు రాలేదా?
- రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యల గురించి దేశానికి తెలియజేసేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టాను
- 4 నెలల రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నా
- అనంతపురం జిల్లా రైతుల దుస్థితిని దేశం తెలుసుకునేలా చేశాం
- దీన్ని తెలుసుకునే రాహుల్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు
- ఏపీలో రైతులు, డ్వాక్రా మహిళలు అనేక బాధలు పడుతున్నారు
- ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు
- అనంతపురం జిల్లాలో 70 మంది రైతులు, 20 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు
- ఈ జిల్లాలో ఉపాధి కరువై రైతులు, వ్యవసాయ కూలీలు వలస వెళ్లారు
- రైతులు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు చెప్పటం సిగ్గుచేటు
- రైతులకు వేరుశనగ విత్తనాలు సరఫరా చేయలేని దుస్థితిలో ప్రభుత్వముంది
- అనంతపురం జిల్లా రైతులకు 5 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు కావాల్సి ఉంటే కేవలం లక్షన్నర క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు
- ఆ విత్తనాలను కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు
-
టీడీపీ నేతలు ఇసుకను దోచుకుంటున్న వైనాన్ని జనం గమనిస్తున్నారు