
బుధవారం తమిళనాడులోని పళ్లిపట్టులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల వాహనాలను అడ్డుకుంటున్న ఏపీ పోలీసులు
ఎమ్మెల్యేలను వెంటాడి.. వేటాడిన పోలీసులు
⇒ తమిళనాడులోనూ చిత్తూరు ఖాకీల దౌర్జన్యకాండ
⇒ శాంతియుత ర్యాలీని చెదరగొట్టేందుకు 144 సెక్షన్..
⇒ ముందుగానే అనుమతి తీసుకున్నా అడుగడుగునా ఆటంకాలు
⇒ చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీసు వాహనంతో తొక్కించిన వైనం..
⇒ జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్టు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ముందస్తు అనుమతితో ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీ చేసేందుకు బయలుదేరిన ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా అడ్డం కులు సృష్టించింది.
పచ్చనేతల కనుసన్నల్లో ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. బుధవారం నగరిలో శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలపై దురుసుగా ప్రవర్తించారు. తమిళనాడు రాష్ట్రానికి వెళ్లినా వదిలిపెట్టకుండా వెంటాడారు. వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు.
వేధింపులకు నిరసనగా..: నగరి ఎమ్మెల్యే రోజాతోపాటు, మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతకుమారిలపై పోలీసుల వేధింపులకు నిరసనగా బుధవారం నగరిలో ర్యాలీ చేసేందుకు వైఎస్సార్సీపీ నాయకులు అనుమతి తీసుకున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి 144 సెక్షన్ విధించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల కన్వీనర్లు పార్టీ అనుబంధ సంఘాల నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.
నగరికి వెళ్లే అన్ని దారుల్లో పోలీసులు మోహరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని బుధవారం గృహ నిర్బంధంలో ఉంచారు. తిరుపతికి వస్తున్న పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని చిత్తూరు సమీపంలో అరెస్ట్ చేశారు. నగరి, పుత్తూరుల్లో ముఖ్యనేతలను అరెస్ట్ చేసి ఉదయాన్నే జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. నగరి పట్టణాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ఎవరినీ పట్టణంలోకి ప్రవేశించకుండా చక్రబంధం చేశారు.
పోలీసుల అత్యుత్సాహాన్ని చూసి..
వైఎస్సార్సీపీ నగరిలో ర్యాలీ చేయకుండా టీడీపీ నేతలు పోలీసులను ఉసిగొల్పడాన్ని పసిగట్టిన ఎమ్మెల్యేలు అత్యవసరంగా తిరుపతిలో సీనియర్ నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పీఎల్ఆర్ గ్రాండ్ హోటల్లో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న నేతలు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్ కుమార్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బి.మధుసూదన్రెడ్డిలతోపాటు ముఖ్యనేతలు హాజరై కార్యాచరణ రూపొందించారు.
టీడీపీ నేతలు, పోలీసుల దాడులను తీవ్రంగా ఖండించారు. ఎలాగైనా నగరికి చేరుకుని కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలనే కృతనిశ్చయంతో బయలుదేరారు. పోలీసులు వెంటాడాన్ని గమనించిన ఎమ్మెల్యేలు, నేతలు ప్రధాన రహదారిపై వెళ్లకుండా అప్పలాయిగుంట, రామచంద్రాపురం, పచ్చికాపలం, తమిళనాడులోని పళ్లిపట్టు మీదుగా నగరి చేరుకునే యత్నం చేశారు. రాష్ట్ర సరిహద్దు దాటి పళ్లిపట్టుకు వెళ్లినా వెంటాడం మానలేదు. నేతల వాహనాలకు పోలీస్ వాహనాన్ని అడ్డంగా పెట్టి నానా హంగామా చేశారు.
వైఎస్సార్సీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.పోలీసులను అడ్డుకోబోయిన చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని పోలీస్ వాహనంతో తొక్కించారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. నేతలు వెంటనే చెవిరెడ్డిని పళ్లిపట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్స చేయించారు. అనంతరం ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి చెవిరెడ్డి బి5 పళ్లిపట్టు పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులపై ఫిర్యాదు చేశారు.
పుత్తూరులో అరెస్ట్: పళ్లిపట్టు నుంచి నగిరికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేల బృందాన్ని మధ్యాహ్నం నగరి సమీపంలోనే అడ్డుకుని అరెస్టు చేసి పుత్తూరు స్టేషన్కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వదిలేశారు.