
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ సోమవారం వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు.

జులై 12న జరగబోయే తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి ముందుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అనంతరం దేవాలయం ముందున్న దుకాణంలో చాట్ తింటూ స్థానికులతో కాసేపు ముచ్చటించారు.

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రివెడ్డింగ్ వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహించారు.

మొదటిసారి వేడుకలను జామ్నగర్లో జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ వేడుకలో అలరించారు.

ఇటీవల రెండోసారి ఏకంగా సముద్రంలో దాదాపు 4000 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు.

జులై 12న వివాహ ముహుర్తం నిర్ణయించడంతో ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుంది.

దానికంటే ముందు నీతా అంబానీ తన ఇష్టదైవమైన కాశీ విశ్వనాథున్ని దర్శించుకుని కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను స్వామివారి చెంత ఉంచేందుకు సోమవారం వారణాసి చేరుకున్నారు.

స్వామివారికి మొక్కులు చెల్లించిన అనంతరం దేవాలయం ముందు ఉన్న చాట్ దుకాణంలో చాట్ తింటూ ఆడంబరాలు లేకుండా స్థానికులతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘కాశీ విశ్వనాథుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ నావెంట ఉంటాయి.

అనంత్-రాధికల వివాహ ఆహ్వాన పత్రికను పరమశివుడికి సమర్పించి స్వామివారి దీవెనలు కోరేందుకు వచ్చాను. పదేళ్ల తర్వాత స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది’ అన్నారు. ఈ మేరకు తీసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.