appeasement
-
ముస్లిం ఓట్ల కోసమే బుజ్జగింపు రాజకీయాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ముస్లింల ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్ను, వక్ఫ్ సవరణ బిల్లును గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కోల్కతాలో బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మమతా బెనర్జీ శకం 2026లో ముగుస్తుందని తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రికి మహిళలు తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని పేర్కొన్నారు. ఉగ్రవాదులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అణచివేయడాన్ని మమతా బెనర్జీ భరించలేపోతున్నారని విమర్శించారు. ఓటు బ్యాంక్ను కాపాడుకొనేందుకు ఎంతకైనా దిగజారుతున్నారని ఆక్షేపించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశి్చమబెంగాల్ వ్యక్తులు కూడా మరణించారని, అయినప్పటికీ మమతా బెనర్జీ నోరెత్తలేదని తప్పుపట్టారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లోని ముర్షీదాబాద్లో జరిగిన హింసాకాండ వెనుక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ హస్త ఉందని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. వసలదార్ల కోసం సరిహద్దులు తెరిచేశారని విమర్శించారు. పశి్చమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర భవిష్యత్తుతోనే కాకుండా.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయని అమిత్ షా స్పష్టంచేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో హింసను ఆశ్రయించకుండా డిపాజిట్లు అయినా తెచ్చుకోలగరా? అని మమతా బెనర్జీకి సవాలు విసిరారు. ఇదిలా ఉండగా, అమిత్ షా ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఖండించింది. సరిహద్దుల రక్షణ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుందని గుర్తుచేసింది. బంగ్లాదేశ్ నుంచి వలసదార్లు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. -
బంధుప్రీతి, బుజ్జగింపు విపక్షాలపై మోదీ ధ్వజం
వారణాసి/కోల్కతా: బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలే ప్రతిపక్షాల విధానమని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన సొంత లోక్సభ నియోజవర్గమైన వారణాసిలో ఆదివారం రూ.6,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారణాసి శివారులోని సీగ్రాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో పదేళ్ల క్రితం వరకు వందల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి పత్రికల్లో నిత్యం వార్తలు వస్తుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టలకు బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. వారణాసి అభివృద్ధిని అవి పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. ‘సబ్కా వికాస్’ సిద్ధాంతంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక గత 125 రోజులవ్యవధిలోనే దేశవ్యాప్తంగా రూ.15 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభించామని చెప్పారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పంచడం తమ లక్ష్యమని ప్రకటించారు. ఎయిర్పోర్టు విస్తరణ పనులకు శంకుస్థాపన పశి్చమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా ఎయిర్పోర్టు విస్తరణ పనులకు ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. రూ.1,550 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. శంకర కంటి ఆసుపత్రి ప్రారంభం వారణాసిలో కంచి మఠం ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్జే శంకర కంటి ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. ఈ ఆస్పత్రిలో ఏటా 30 వేల కంటి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మఠం వర్గాలు తెలిపాయి. వారణాసికి రావడం ఆశీర్వచనంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మత విశ్వాసాలకు, ఆధ్యాతి్మకతకు కేంద్రమైన వారణాసి నగరం ఆరోగ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందుతుండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మోదీపై కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నరేంద్ర దామోదర్ దాస్ కా అనుశాసన్’ అని అభివర్ణించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఇది ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వమని కొనియాడారు. -
ఆ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టాలి
న్యూఢిల్లీ: అవినీతి నిర్మూ లన, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలను భారత్ నుంచి తరిమి కొట్టాలని ప్రజలు నినదిస్తున్నారని ప్రధాని∙మోదీ అన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్పై పరోక్షంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ దినాన్ని బుధవారం బీజేపీ నిర్వహించింది. ఈ సందర్భంగా మూడింటిని దేశం నుంచి తరిమి కొట్టాలని ఒకే స్వరం వినిపిస్తోందని ప్రధాని చెప్పారు. ‘అవినీతిని దేశం నుంచి తరిమేయాలి. వారసత్వ రాజకీయాలను, బుజ్జగింపు రాజకీయాలను కూడా తరిమికొట్టాలి’’ అని ప్రధాని బుధవారం ఒక ట్వీట్లో వెల్లడించారు. మరోవైపు బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు పరిరక్షించాలంటే అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. -
దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపుల పర్వం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి , పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ బుజ్జగింపు పర్వం మొదలైంది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలలో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దిగ్విజయ్ సింగ్ ఈరోజు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించారు. ఆ తరువాత ఆయన పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రి జానా రెడ్డిలను కూడా కలుస్తారు. ఇదిలా ఉండగా, తెలంగాణ పీసీసీ ఎలక్షన్ కమిటీ సమావేశం గాంధీభవన్లో ప్రారంభమైంది. దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా టిఆర్ఎస్తో పొత్తు, అభ్యర్థుల ఎంపికపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. దిగ్విజయ్ సింగ్ మార్గదర్శకాలను సూచిస్తారు.