ayurveda hospitals
-
నిరసన ఉద్రిక్తం
సాక్షి, సిటీబ్యూరో/వెంగల్రావునగర్: చారిత్రక చార్మినార్లోని ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు తరలింపుపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు.. కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఓపీ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స నిమిత్తం దూర ప్రాంతాల నుంచి సోమవారం ఆస్పత్రికి వచ్చిన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోపలికి అనుమతించాలని రోగులు వేడుకున్నా ఆందోళనకారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులు, బాధితులను శాంతింపజేశారు. ఇదీ వివాదం... 1958లో 60 పడకల సామర్థ్యంతో చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 100 పడకలకు పెంచినప్పటికీ.. స్థలాభావంతో 75 పడకతోనే కొనసాగుతోంది. ఆస్పత్రి ఔట్పేషెంట్ విభాగానికి గ్రేటర్ నుంచే కాకుండా శివారులోని మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2014లో భవనాన్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించగా... వైద్యుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. మరమ్మతుల పేరుతో ఇటీవల ఈ భవనాన్ని ఖాళీ చేయాలని భావించింది. ఇప్పటికే ఆయా వార్డులను ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం 10 పడకలతో కేవలం ఓపీ సేవలు అందిస్తున్నారు. అయితే ఆయుర్వేద ఆస్పత్రిని ఉద్దేశపూర్వకంగానే తరలిస్తున్నారని... ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పాతబస్తీ ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు, వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తాజాగా తమ ఆందోళనలను ఉధృతం చేశారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఔట్పేషెంట్ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఓపీ సేవలు బంద్ చేయడంతో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులు నిరాశేతో వెనుదిరగాల్సి వస్తోంది. రోగుల ఆగ్రహం.. ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో అటు వైద్యులు, ఇటు రోగులు ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు బతిమిలాడినా విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో రోగులు వైద్య విద్యార్థులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు వెనక ద్వారం నుంచి లోపలికెళ్లి ఓపీ చీటీ రాయించుకునేందుకు ప్రయత్నించగా అక్కడ సైతం అడ్డుకున్నారు. ఆందోళనకారులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామకృష్ణ తదితరులు ఆసుపత్రికి వచ్చి విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రిని తరలించడానికి వీల్లేదని.. అలా చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరాశే కొన్ని రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా జ్వరం తగ్గినప్పటికీ... కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఇక్కడ నయం చేస్తారని తెలిసి ఒడిశా నుంచి వచ్చాను. అయితే ఆస్పత్రికి తాళాలు వేసి తర్వాత రమ్మని అంటున్నారు. లోపలికి పంపించాలని వేడుకున్నా వినలేదు. ఎంతో ఆశతో నిరాశే మిగిలింది. – పి.మేఘన, ఒడిశా -
నిర్వేదం
–దుస్థితిలో ఆయుర్వేద ఆస్పత్రులు – 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేని వైనం – ఇప్పటికే ఆరు మూత ఆయుర్వేదానికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మన ప్రాచీన వైద్యవిధానం కావడంతో పునరుత్తేజానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 28న జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా నిర్వహించింది. ఇంతవరకు బాగానే ఉన్నా..జిల్లాలోని ఆయుర్వేద ఆస్పత్రుల పరిస్థితి మాత్రం నానాటికీ దిగజారుతోంది. వైద్యులు, సిబ్బంది లేకపోవడం, మందుల కొరత తదితర కారణాలతో మూతపడుతున్నాయి. అనంతపురం టౌన్ : జిల్లా వ్యాప్తంగా 50 ఆయుర్వేద డిస్పెన్సరీలు(ఆస్పత్రులు) ఉన్నాయి. రెగ్యులర్ కింద 28, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద 22 నడుస్తున్నాయి. వీటిలో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, ఎస్ఎన్ఓలు ఉండాలి. అయితే.. ఏ ఆస్పత్రిలోనూ తగినంత మంది సిబ్బంది లేరు. 30 డిస్పెన్సరీల్లో వైద్యులే లేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బూదిలి, గడేహోతూరు, హావళిగి, నరసింగయ్యగారిపల్లి, పుట్లూరు, విడపనకల్లు, కోడూరు, అచ్చంపేట, ముదిగుబ్బ, రొళ్ల, సొమందేపల్లి, చుక్కలూరు, కళ్యాణదుర్గం, కొర్రపాడు, నాగసముద్రం గేట్, నల్లచెరువు, పెద్దవడుగూరు, పేరూరు, పుట్టపర్తి, రామగిరి, రొద్దం, శెట్టూరు, యల్లనూరు, ఎర్రగుంట డిస్పెన్సరీలను మెడికల్ ఆఫీసర్ లేకుండానే నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేని కారణంగా అగళి, బొమ్మనహాళ్, తాడిమర్రి, శంకరగల్, అమరాపురం, మోరుబాగల్ వైద్యశాలలు మూతపడ్డాయి. భరోసా లేని బతుకులు రెగ్యులర్ డిస్పెన్సరీల్లో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు సక్రమంగా వస్తున్నా.. ఎన్ఆర్హెచ్ఎం కింద పని చేస్తున్న వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏటా రెన్యూవల్ కోసం పోరాడాల్సిన దుస్థితి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే వీరి కాంట్రాక్ట్ గడువు ముగిసినా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. రెన్యూవల్ కాకపోవడంతో ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియక మానసిక వ్యథ అనుభవిస్తున్నారు. మందుల సరఫరాకు బ్రేక్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఫార్మసీ తెలంగాణకు వెళ్లిపోయింది. దీంతో మందుల సరఫరాకు బ్రేక్ పడింది. ప్రస్తుతం అరకొరగా వస్తున్నాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నెలకు 1,200 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. అనంతపురంలోని ఆస్పత్రికి రోజూ 60 మంది వరకు వస్తున్నారు. అయితే.. వీటిలో చాలా మందులు అందుబాటులో లేవు. నొప్పులకు వాడే యోగరాజ గుగ్గులు, కాంచనార గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, సింహనాద గుగ్గులు, డయాబెటీస్కు వాడే నిసామలకి, బీపీ బాధితులకు ఇచ్చే సర్పగంధతో పాటు జలుబు, కంటి, చెవి సమస్యలు వస్తే వేసే డ్రాప్స్ కూడా లేవు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నా అటు ప్రజాప్రతినిధులు గానీ, ఇటు అధికారులు గానీ పట్టించుకోవడం లేదు.