తీవ్రవాదుల చేతుల్లోకి కొత్త నోట్లు
శ్రీనగర్: నల్లధనం, తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు పాత పెద్ద నోట్లు రద్దు చేశామన్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మోదీ సర్కారు కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జమ్మూకశ్మీర్ బందిపోరా జిల్లాలోని హంజన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి.
ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులు, తూటాలు, ఆయుధ సామాగ్రితో పాటు కొంత నగదును సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వంద రూపాయల నోట్లతో పాటు కొత్తగా చెలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు ఉండటం చూసి సైనికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఘటనా స్థలంలో దొరికిన రెండు రూ. 2 వేల నోట్లు అసలైనవా, నకిలీవా అనేది వెల్లడి కాలేదు. 14 రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి రావడం పట్ల సైనిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ నోట్లు తీవ్రవాదుల చేతుల్లోకి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాత రూ. 500, రూ. వెయ్యి నకిలీ నోట్లు ముద్రించి సరిహద్దు గుండా మన దేశంలోని చొరబడుతున్న ఉగ్రవాదులకు రూ. 2 వేల నోటుతో కళ్లెం పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే తాజా ఉదంతంతో అంచనాలు తల్లకిందులయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.