బీజేపీలో చేరిన తృప్తి సావంత్
సాక్షి, ముంబై: తూర్పు బాంద్రా (కళానగర్) అసెంబ్లీ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే తృప్తి సావంత్ శివసేనతో తెగతెంపులు చేసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మంగళవారం ఆమె బీజేపీలో చేరారు.
టికెట్ ఇవ్వకపోవడంతో..
తూర్పు బాంద్రా అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో దివంగత శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే నివాసమైన మాతోశ్రీ బంగ్లా ఇక్కడే ఉంది. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ నియోజకవర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒక సవాలుగా తీసుకుంటాయి. తూర్పు బాంద్రా అనేక సంవత్సరాలుగా శివసేనకు కంచుకోటగా ఉంది. కాగా, 2018 మార్చిలో బాంద్రా నియోజక వర్గం శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ అలియాస్ బాలాసావంత్ అకస్మాత్తుగా మృతి చెందారు. దీంతో తూర్పు బాంద్రాకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో బాలాసావంత్ భార్య తృప్తి సావంత్ శివసేన టికెట్పై పోటీచేశారు.
ఆ సమయంలో శివసేన, బీజేపీ ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపలేదు. ప్రత్యర్థిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి నారాయణŠ రాణేపై తృప్తి గెలిచారు. ఆ సమయంలో రాణే కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అనంతరం 2019 అక్టోబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తృప్తి సావంత్ ను పక్కన బెట్టి మేయర్ విశ్వనాథ్ మహాడేశ్వర్కు అభ్యర్థిత్వం కట్టబెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన తృప్తి సావంత్ తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఫలితంగా ఓట్లు చీలిపోయి విశ్వనాథ్ పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి జిషాన్ సిద్ధికికీ లభించడంతో విజయఢంకా మోగించారు.