హైకోర్టులో ఏఎస్జీగా బొమ్మినేని నారాయణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ)గా న్యాయవాది బొమ్మినేని నారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్రానికి చెందిన పలు సంస్థల తరఫున ఆయన ఉమ్మడి హైకోర్టులో వాదనలు వినిపిస్తారు.
ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా వ్యవహరిస్తున్న పి.విష్ణువర్ధన్రెడ్డి పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తుంది. అయితే ఈ పదవిలో కొనసాగేందుకు ఆయన ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలువురు బీజేపీ నేతలను సైతం కలిసి ఏఎస్జీగా తనను కొనసాగించేలా చూడాలని కోరారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పోస్టుకు నారాయణరెడ్డిని ఎంపిక చేసింది. ఆయన సోమవారం ఏఎస్జీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.