Branch Canal works
-
మళ్ళీ నామినేషన్ దందా షురూ!
సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సినవి కావు. అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. అక్రమాల దందా పునరావృతంఅస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్పై కట్టబెట్టకపోవడం గమనార్హం. పూర్తికాక ముందే నిధులు మిగులా?.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. -
అడ్డదారిలో అయినవారికి..
సాక్షి, హైదరాబాద్: టీడీపీ పాలనలో ఆశ్రీత పక్షపాతం యథేచ్ఛగా సాగుతోంది. అయిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడం కొనసాగుతోంది. తాజాగా రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి కంపెనీకి కట్టబెట్టారు. టెండర్లలోనే టైలర్మేడ్ నిబంధనలు పెట్టి కావాల్సినవారికి అడ్డదారిలో కాంట్రాక్టులు కట్టబెట్టే మార్గాన్నే ఈ టెండర్లలోనూ ప్రభుత్వం అనుసరించింది. పనుల కోసం ఆర్కే ఇన్ఫ్రా-హెచ్ఈఎస్-కోయా సంస్థలు జాయింట్ వెంచర్గా ఒక టెండరు, గాయత్రి కన్స్ట్రక్షన్ తరపున ఒక టెండరు దాఖలయ్యాయి. శుక్రవారం హంద్రీ-నీవా ప్రాజెక్టు మదనపల్లె-3 సర్కిల్ కార్యాలయంలో సాంకేతిక, ధరల బిడ్స్ను పరిశీలించారు. గాయత్రి కన్స్ట్రక్షన్-డబ్ల్యుపీఐఎల్ జాయింట్ వెంచర్కు నిబంధనల మేరకు అర్హతలేదని నిర్ధారించారు. ఈ పని విలువలో సగం.. అంటే రూ.207 కోట్ల విలువైన కాలువ తవ్వకం, లైనింగ్ పనులను ఏడాది కాలంలో పూర్తి చేసి ఉండాలనే నిబంధన పెట్టారు. గాయత్రి ఈ పరిమాణం లో పనులు చేసినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో ఆ సంస్థ తరపున దాఖలుచేసిన టెండర్ను అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆర్కే ఇన్ఫ్రా-హెచ్ఈఎస్-కోయా సంస్థలు దాఖలుచేసిన జాయింట్ వెంచర్ దాఖలు చేసిన ఏకైక టెండర్ను పరిశీలించారు. ఆ సంస్థ రూ.413కోట్ల పనికి రూ.430,29,99,999తో టెండర్ వేసింది.ఇది అంచనా విలువకు 4.0073 శాతం (రూ.13.50కోట్లు) ఎక్కువ. రెండే కంపెనీలు టెండర్లు వేయడం, అందులో ఒక కంపెనీకి అర్హత లేదని నిర్ధారించి కాంట్రాక్టును ఆర్కే ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. చక్రం తిప్పిన నేత : కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను దక్కించుకునేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ముందునుంచీ కన్నేశారు. అదే జిల్లాకు చెందిన మరో టీడీపీనేత శ్రీనివాసులురెడ్డి టెండర్ దాఖలు చేయగా, ముందునుంచీ కన్నేసిన నేత టెండర్లు దాఖలు చేయకుండా పనుల్లో వాటా కావాలని కోరినట్టు ప్రచారం జరిగింది. దీన్ని ఖరారు చేస్తూ టీడీపీ నేతకే పనులు దక్కాయి. గడువు తొమ్మిది నెలలే :కుప్పం కాలువకు వచ్చే సంక్రాంతికి నీరందించాలని సీఎం నిర్ణయించారు. ఈ కాలువ పలమనేరు నియోజకవర్గంలోని అప్పినపల్లె గ్రామం నుంచి కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువు వరకు సాగుతుంది. రూ. 413 కోట్ల అంచనా వ్యయంతో 143 కి లోమీటర్ల కాలువ, మూడుచోట్ల ఎత్తిపోతల పథకాలు, 285చోట్ల కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణం జరగాలి. ఎనిమిది మండలాల్లో 4.5లక్షల మందికి తాగునీరు, 6,300 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పనులన్నింటిని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల గడువును విధించింది. దీనిపై ఇంజనీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.