Cash-for-Vote Case
-
సీబీఐ దర్యాప్తు ఎందుకు జరపడం లేదు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ విమర్శించారు. కృష్ణా, గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా కేసుల భయంతో చంద్రబాబు మాట్లాడడం లేదని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ కేసుల విషయంలో సీబీఐ విచారణ జరుపుతున్నారని గుర్తు చేశారు. రుణమాఫీ కాకపోయినా చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను విమర్శించడం తప్పా మహానాడులో టీడీపీ చేసిందేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలకు పనికొచ్చే అంశాలపై చర్చ జరగలేదన్నారు. ప్రజల మెప్పు పొందలేమనే కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలు దొంగలు టీడీపీ నేతలేనని అన్నారు. అధికార నేతల స్వలాభం కోసం ఏపీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడితే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని వేణుగోపాల్ హెచ్చరించారు. -
5లక్షల పూచీకత్తుతో రేవంత్ రెడ్డికి బెయిల్
-
స్థానిక ఎన్నికల్లోనూ ‘ఓటుకు కోట్లు’
= ఇతర పార్టీల నుంచి గెలిచినవారికి ఎర = ఎన్నికలు ముగిసిన వెంటనే తాయిలాల పర్వం = పదవులే లక్ష్యంగా వ్యవహరించిన బాబు = మొదటి ఎన్నికల్లోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు ఆశల వల = ఇవీ బాబు మార్కు నైతిక విలువలు నీతులు ఇతరులకు చెప్పడానికే గాని.. పాటించడానికి కాదనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మార్కు సిద్ధాంతం. అందుకే ఆయన రాజకీయాల్లో నైతిక విలువల గురించి బహిరంగంగా ఉపన్యాసాలిస్తూ తెరవెనుక ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఎరవేసి పార్టీలోకి లాక్కుంటుంటారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలైనా సాగిస్తారనేందుకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు సాగించిన ‘ఓటుకు అయిదు కోట్ల’ వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం. సాక్షి, ఆంధ్రప్రదేశ్ బ్యూరో/నెట్వర్క్ చంద్రబాబు నాయుడి ప్రలోభాల పర్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తనవైపు తిప్పుకోవడానికే పరిమితం చేయలేదు. బాబు తన స్వార్థ రాజకీయాల నుంచి స్థానిక సంస్థలను కూడా వదిలిపెట్టలేదని అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తుండగా ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు చిక్కుకున్న చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లో నైతిక విలువల గురించి వల్లె వేస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. ఇతర రాజకీయ పక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నప్పుడుబాబుకు నైతిక విలువలు గుర్తుకు రాలేదా? అని విపక్ష నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు తీరు ‘చెప్పేవి శ్రీరంగ నీతులు...’ చందంగా ఉందని ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో బట్టబయలైందని అధికార వర్గాలు సైతం అనధికారిక చర్చల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటం గమనార్హం. జెడ్పీ పీఠాల కోసం చేసిందేమిటి? చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ‘ఓటుకు నోట్లు’ వ్యవహారానికి తెరలేపి తన మార్కు ఫార్టీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్కు కర్నూలు జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. బలం లేకపోయినా కర్నూలు జెడ్పీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసేందుకు సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు భారీ తాయిలాలు ఎరవేశారు. బాబు ఆదేశం మేరకు టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన ఎనిమింది, కాంగ్రెస్కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారు. కర్నూలు జిల్లాలోని 53 జెడ్పీటీసీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ 20 స్థానాలకే పరిమితమైంది. అయినా నైతికతను తుంగలో తొక్కి, ‘ఓటుకు నోటు’ వ్యవహారం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ను దెబ్బతీసి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో.... ఈ జిల్లాలో 46 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా 31 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించగా టీడీపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అయినా ఈ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలనే స్వార్థంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ భారీ అక్రమాలకు పాల్పడింది. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి భారీ ప్రలోభాలు చూపడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరు భారతి, పెంచలమ్మ, ముప్పాళ్ల విజేత, షల్మా షరీన్, తిరువీధి రమేష్, పులిచెర్ల నారాయణరెడ్డి, కె.జ్యోతి అనే ఎనిమిది మంది జెడ్పీటీసీ సభ్యులను టీడీపీ నిస్సిగ్గుగా తనవైపు తిప్పుకుంది. చంద్రబాబు ప్రతినిధులు చూపిన ఆశల తాయిలాలకు మిగిలిన వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు లొంగకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గద్దెను టీడీపీ కైవసం చేసుకోవాలనే చంద్రబాబు ఆశ నెరవేరలేదు. ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నూకసాని బాలాజీతోపాటు ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు దాసరి విజయ, దగ్గుబాటి నాగజ్యోతి, జాకీర్లకు భారీ తాయిలాలు ఇవ్వడం ద్వారా టీడీపీ తనవైపు తిప్పుకుంది. ఇలా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన 28 మంది జెడ్పీటీసీ సభ్యులను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్కు చెందినవారు 26 మంది కాగా కాంగ్రెస్ వారు ఇద్దరు కావడం గమనార్హం. మండల పరిషత్ పీఠాల కోసం.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లు రాజకీయాల నుంచి మండల పరిషత్లను కూడా మినహాయించలేదు. ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు ఆశల ఎరవేసి తమవైపు తిప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, నైతిక విలువలను కాలరాయడం ద్వారా బలం లేకపోయినా టీడీపీ పలు మండల పరిషత్ ఛైర్పర్సన్ పీఠాలను కైవసం చేసుకుంది. నగరపాలకలు, పురపాలికల్లో... నగరపాలక సంస్థలు/ పురపాలికల విషయంలోనూ బాబు అదే పంథా అనుసరించారు. ఆశల ఎరవేసి ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్ల మద్దతు సాధించడం, పార్టీలో చేర్చుకోవడం ద్వారా చంద్రబాబు బలం లేని చోట్ల కూడా కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను టీడీపీకి దక్కేలా చేశారు. నెల్లూరులో 54 కార్పొరేటర్ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ 32 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో మేయర్ స్థానం కైవసం చేసుకోగా... ఆ తర్వాత మేయర్తోపాటు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్పించుకుంది. ఈ వ్యవహారం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలున్నాయి. కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 20 కౌన్సిలర్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ 11 స్థానాలతో సంపూర్ణ మెజార్టీలో ఉన్నా ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభపరచి మద్దతు సాధించడం ద్వారా మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో 23 కౌన్సిలర్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ పార్టీకి చెందిన తొమ్మిది మందిని కొనుగోలు చేయడం ద్వారా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అక్రమంగా టీడీపీ దక్కించుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలకుగాను 15 చోట్ల విజయం సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ మెజార్టీతో ఉన్నా ఆ పార్టీ సభ్యులను ముగ్గురిని ప్రలోభాలకు గురిచేయడం ద్వారా టీడీపీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పలు చోట్ల ఇలానే ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలను వక్రమార్గంలో టీడీపీ కైవసం చేసుకుంది. -
రాష్ట్రం అబాసుపాలు
‘రాష్ట్రం పరువు తీశారు. లంచం కేసులో అడ్డంగా దొరికిపోయి రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరిస్తున్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. నీతులు వల్లించే టీడీపీ అధినేత అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి, దాని నుంచి బయటపడలేక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, మీడియాపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో కీలక సూత్రధారైన చంద్రబాబు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, బాబును అరెస్ట్ చేయాలి’ అంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజా మద్దతుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, బైఠాయింపు, మానవహారం, ధర్నాలతో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పోలీసులు 206 మంది నేతలను అరెస్టు చేశారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎండను సైతం లెక్క చేయకుండా జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మంగళవారం గంటలు తరబడి నిరసన తెలియజేశారు. సీఎం చంద్రబాబు డౌన్డౌన్... టీడీపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి... అవినీతి సీఎంను అరెస్టు చేయాలి... అంటూ ప్లకార్డులు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయనగరంలో.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి నాయకత్వంలో స్థానిక మయూరీ జంక్షన్వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు రూపొందించిన మేనిఫెస్టోను దహనం చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడును ఎ-1 నిందితునిగా చేర్చాలని ఎమ్మెల్సీ కోలగట్ల. వీరభద్రస్వామి డిమాండ్చేశారు. నిరసనలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్, సీనియర్ నాయకులు యడ్ల.రమణమూర్తి, పిళ్లా.విజయ్కుమార్, కాళ్ల గౌరీశంకర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగిరెడ్డి బంగారునాయుడు, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కురుపాంలో... చంద్రబాబు తీరును ఖండిస్తూ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కురుపాం బస్స్టాండ్లో బైఠాయించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ అధికార దాహంతో ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులను డబ్బుతో కొనాలని చూసిన చంద్రబాబు అడ్డంగా దొరికారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కురుపాం జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి పద్మావతి, ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో... గజపతినగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద ్దగజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలకు చెందిన మండలపార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, ఈదుబిల్లి కృష్ణ, కడుబండి రమేష్ నాయుడు , వర్రి నరిసింహమూర్తిల ఆధ్వర్యంలో వందలాదిమందితో ఆందోళన చేశారు. తొలుత స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్దకు ర్యాలీగా తరలి వచ్చారు. ఈకార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎస్కోటలో... నియోజకవర్గ ఇన్చార్జ్ నెక్కల నాయుడు బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత దేవి జంక్షన్ నుంచి శ్రీనివాస్ థియేటర్ వరకు ర్యాలీగా వెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి కాంప్లెక్స్కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందచేశారు. అనంతరం దేవి జంక్షన్కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేచలపు చిన రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో... స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ సీపీ పార్వతీపురం నియోజకవర్గం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, పట్టణ అధ్యక్షుడె మజ్జి వెంకటేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గర్భాపు ఉదయభాను తదితరుల ఆద్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు, పరకాల ప్రభాకర్ సిగ్గుమాలిన మాట్లాడుతున్నారని విమర్శించారు. బొబ్బిలిలో..: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, బేబినాయన సూచన మేరకు మున్సిపల్ ప్లోర్ లీడర్ రౌతు రామ్మూర్తినాయుడు, కౌన్సిలర్లు రాంబార్కిశరత్,మరిపి తిరుపతినాయుడు తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమవడంతో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. బాబే బాస్.. స్థానిక మొయిద జంక్షన్లో పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ నోటుకునోటు వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయమున్నట్లు బయటపడినా ఏసీబీ ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సురేష్బాబు, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ళ శ్రీరాములనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్లు కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణ , డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ, నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, పతివాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. నేతల అరెస్టును తెలుసుకుని అక్కడికొచ్చిన కోలగట్ల వీరభద్రస్వామి పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. పోలీసులకు దమ్ముంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాలన్నారు.