caste free
-
తొలి కులరహిత ద్రవిడోద్యమ మార్గదర్శి
దక్షిణ భారతదేశంలో కులాన్ని ప్రశ్నిస్తూ తొలిసారి గొంతెత్తిన కార్యకర్త అయోతీ థాస్. ఆది ద్రావిడ నేపథ్యం నుండి వచ్చిన ఆయన రాజకీయం, సాహిత్యం, మతం వంటి అనేక రంగాలలో అవిరళకృషి చేసినవారు. తమిళ పండితుడు.వృత్తి రీత్యా సిద్ధ వైద్యుడు. పందొమ్మిదవ శతాబ్దం చివరలో ఆది ద్రావిడ ప్రజల అభ్యున్నతి కోసం నడుం బిగించి 1891లో ‘కుల రహిత ద్రవిడ మహాసభ’ను స్థాపించారు. ఈ విషయంలో రెట్టమాలై శ్రీనివాసన్ అనే మరో సంఘ సంస్కర్త ఈయనకు సహకరించారు. బౌద్ధం స్వీకరించిన అయోతీ థాస్, పరయల (మాలల) అసలు మతం బౌద్ధమని తేల్చారు. అంద రినీ అందులోకి మారమని సూచించారు. కులరహిత సమాజం బౌద్ధం ద్వారానే సాధ్యమని ఉద్బోధించారు.1861–91 మధ్య కాలంలో క్రైస్తవులు, ముస్లింలు మినహా మిగిలిన వారందరినీ బలవంతంగా హిందువులుగానే పరిగణించేవారు. అయితే అయోతీ థాస్ ‘హిందూ’ అనే గుర్తింపును నిరాకరించారు. కారణమేమంటే హిందూను గుర్తిస్తే అందులో ఉన్న కుల నిర్మాణాన్ని, నిచ్చెన మెట్ల కుల సంస్కృతిని, అసమా నతలను స్వీకరించాలి. అందుకని ఆయన దాన్ని తిరస్కరించడంతో పాటు, తన అనుయాయులందరినీ తిరస్కరించమని సూచించారు. ఆయన రాజకీయంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. తను స్థాపించిన ‘కుల రహిత ద్రవిడ మహా సభ’ పక్షాన 10 డిమాండ్లతో ఒక వినతి పత్రం తయారు చేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి పంపారు. వారు వాటిని తమ 12వ సమావేశంలో చర్చించారు కూడా! అయితే, అందులో ఒక్క డిమాండుకు కూడా సుముఖత వ్యక్తపరచలేదు. ఆ డిమాండ్లలో ఉచిత విద్య, బంజరు భూముల కేటాయింపు, పరయల ఆలయ ప్రవేశం వంటివి ఉన్నాయి. ఆలయ ప్రవేశం ఇక్కడ భక్తికి సంబంధించిన విషయం కాదు. మనుషులుగా సమాన హోదా, సమాన హక్కుకు సంబంధించిన విషయం. కాంగ్రెస్ పార్టీతో పని కాలేదని అయోతీ థాస్ తన ప్రయత్నం మానుకోలేదు. ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్కు పోటీగా 1884లో స్థాపితమైన ‘మద్రాస్ మహాజన సభ’కు కూడా అవే పది డిమాండ్ల వినతి పత్రం పంపించారు. కానీ, అక్కడా చుక్కెదురైంది. నిర్వాహక సభ్యులు ఆయనను ఘోరంగా అవమానించారు.జరిగిన అవమానంతో అయోతీ థాస్ తీవ్రమైన మనో వేదనకు గురయ్యారు. తాము హిందువులమే అయితే జాతి విచ క్షణ ఎందుకూ? కుల దూషణలెందుకూ? దేవుడు అందరి వాడైన ప్పుడు ఆలయ ప్రవేశం తమకెందుకు ఉండదూ? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆయన వాటికి సమాధానాలు కను గొనే ప్రయత్నంలో వేదాలు, బ్రాహ్మణత్వం, ఆచారాలు వంటి వాటి గూర్చి అధ్యయనం ప్రారంభించారు.1870 దశకంలో తన పాతికేళ్ళ ప్రాయంలో తమిళనాడు నీల గిరి ప్రాంతంలోని తోడర్–కొండ జాతులను సమైక్యపరిచి 1875లో ‘అద్వైతానంద సభ’కు రూపకల్పన చేశారు. అప్పుడే రెవరెండ్ జాన్ రతినమ్తో పరిచయం ఏర్పడింది. ఈయన మద్రాసులో ఆది ద్రావిడుల కోసం వెస్లియన్ మిషన్ పాఠశాల నిర్వహిస్తున్నాడు. ఆయన పరిచయంతో అయోతీ థాస్కు కొత్త ఉత్సాహం లభించింది. దాంతో 1885లో ‘ద్రవిడ పాండ్యన్’ అనే వార్తా పత్రికను ప్రారంభించారు. 1886లో ‘ఆది ద్రావిడులు హిందువులు కారు’ అని భారతదేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మ కమైన ప్రకటన చేశారు.1891లో ద్రవిడ మహాసభను స్థాపించి, ఆది ద్రావిడులకు ఒక పిలుపునిచ్చారు. వారంతా తమను తాము హిందువులుగా కాక, ‘కుల రహిత తమిళులు’గా ప్రకటించుకోవాలని కోరారు. ఆ రోజుల్లో అదొక సాహసోపేతమైన చర్య. ఒకసారి అయోతీ థాస్ తన అనుచరులతో థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడ యిన కల్నల్ హెచ్.ఎస్. ఆల్కాట్ను కలుసుకున్నారు. బౌద్ధం స్వీకరించాలన్న తన కోర్కెను ఆయనకు తెలియజేశారు. ఆయన అయోతీ థాస్ శ్రీలంకకు వెళ్లే ఏర్పాటు చేశాడు. శ్రీలంకలో అయోతీ థాస్ సింహళ బౌద్ధ భిక్షువు సుమంగళ నాయక్ నుండి ధమ్మదీక్ష స్వీకరించారు. చెన్నై తిరిగి వచ్చాక 1889లో ‘శాక్య బౌద్ధ సంఘాన్ని’ స్థాపించి, దాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేశారు. ఈయన అప్పుడు ఏర్పాటు చేసిన శాక్య బౌద్ధ సొసైటీయే కాల క్రమంలో ఇండియన్ బుద్ధిస్ట్ అసోసియేషన్గా మారిపోయింది. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా నిలిచిన ఆయన, రచయితగా చేసిన కృషి కూడా తక్కువది కాదు. అంబికయ్యన్ కథ, ఇంద్ర జాతి చరిత్ర, ఇంద్ర దేశ బౌద్ధ పండుగలు, తిరువళ్ళువర్ చరిత్ర వంటి డజనకు పైగా గ్రంథాలు రాశారు.‘అయోతీ థాస్’గా ప్రసిద్ధుడైన ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాత్తవరాయన్. అయోతీ థాస్ అనేది ఆయనకు ఆయనే పెట్టుకున్న పేరు. బాల్యంలో ఈయన అయోధ్య దాసర్ పండిట్ అనే ఉపాధ్యాయుడి వద్ద చదువు నేర్చుకున్నారు.తమిళం, ఇంగ్లిష్, పాళీ భాషలు, తత్వశాస్త్రం, సిద్ధ వైద్యం... ఇలా అనేక విషయాలు నేర్చుకున్నారు. అందువల్ల గురువుగారి పట్ల ఏర్పడ్డ గౌరవ భావంతో తన పేరు కూడా అయోధ్య దాసర్గా చెప్పుకునేవాడు. ఆ పేరే స్థిరపడి అయోతీ థాస్గా మారింది. తమిళ పలుకుబడి థాస్ అంటే తెలుగులో దాసుడు అనే అర్థం.వీరిది విద్యావంతుల కుటుంబం. ఈయన తండ్రి కాంత ప్పన్, ఫ్రాన్సిస్ వైటీ ఎల్లిస్ అనే బ్రిటిష్ అధికారి దగ్గర పని చేసేవాడు. తన కుటుంబం తరతరాలుగా భద్రపరచుకుంటూ వచ్చిన తాళపత్ర గంథాలు తిరుక్కురళ్, నాలడియార్లను ఫ్రాన్సిస్ ఎల్లిస్కు అందించాడు కాంతప్పన్. ఆయన వాటి విలువను గ్రహించి, ఇంగ్లిష్లోకి అనువదించాడు. తర్వాత పుస్తకాలుగా ముద్రించి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ రకంగా తమిళుల సాంస్కృతిక సంపదైన తిరుక్కురళ్ వెలుగులోకి వచ్చింది. అయోతీ థాస్ 1845 మే 20న మద్రాసులోని రాయ పేటలో జన్మించారు. మళ్ళీ అదే మే నెల 5వ తేదీన 1914లో 69వ యేట కన్నుమూశారు. ఒక రకంగా పెరియార్, ద్రవిడర్ కళగమ్, బి.ఆర్. అంబేడ్కర్లకు ఈయనే స్ఫూర్తిప్రదాత! డా‘‘ దేవరాజు మహారాజు – వ్యాసకర్త సాహితీవేత్త, విశ్రాంత ప్రొఫెసర్(మెల్బోర్న్ నుంచి) -
వర్గ దృష్టితో కుల నిర్మూలన
సమీక్షణం వర్గ దృష్టితో కుల నిర్మూలన పుస్తకం : పల్లవి లేని పాట రచన : రంగనాయకమ్మ విషయం : ‘ఎక్కడ ఏ ఉద్యమం, ఏ విప్లవం, అపజయం పాలైనా దానికి కారణం ప్రజలు అవరు. నాయకులే అవుతారు. ప్రజలకు ఏ నూతన చైతన్యాలూ, ఏ నూతన నియమాలూ నేర్పని, నేర్పే అర్హతలు లేని నాయకులే స్వప్పాల్ని నవ్వుల పాలు చేస్తారు.’ : రంగనాయకమ్మ కొండపల్లి కోటేశ్వరమ్మ రాసిన ‘నిర్జన వారధి’ చదివాక చెరుకూరి సత్యనారాయణ రాసిన ‘తొణికిన స్వప్నం’ అనే వ్యాసానికి సమాధానంగా ‘విరిగిన స్వప్నం’ పేరుతో రంగనాయకమ్మ రాసిన వాక్యాలు పైవి. అన్ని కమ్యూనిస్టు పార్టీలకు, విప్లవ పార్టీలకు ఉపకరించే మాటలవి. ‘పల్లవి లేని పాట’ పేరుతో ఒక నవలికా, కుల విధానం, దెయ్యాల శాస్త్రం, మార్క్సిజం గురించిన కొన్ని వ్యాసాలూ కలిపి వేసిన ఈ పుస్తకం ఓ వంద పుస్తకాలు చదివిన అనుభవాన్ని కలిగిస్తుంది. ఉన్నవి 18 వ్యాసాలే అయినప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక అంశాలపై పాఠకుడికి విస్తృత అవగాహన కలిగిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు తాత్విక వ్యాసాలలో ఉన్న ‘బుద్ధికొలత వాదం’పై చేసిన విమర్శకు స్పందించిన విరసం నాయకులకు జవాబుగా మరో మూడు వ్యాసాలు రాసి, మార్క్సిస్టుకు ఉండాల్సిన జాగ్రత్తలు చెప్పారు. లక్ష్మింపేట మారణకాండకు ముందునించీ అటు దళిత ఉద్యమకారులకీ, ఇటు విప్లవోద్యమకారులకీ మధ్య కుల నిర్మూలనపై ఉన్న బేధాభిప్రాయాల నేపథ్యంలో.... ప్రజాపంథా, జనశక్తి వంటి పార్టీల ధృక్పథాలనూ, వేములపల్లి వెంకటరామయ్య, చంద్రంల ఆలోచనలనూ వివరిస్తూనే, ‘దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్సు మాత్రమే అవసరం’ అనే తన అవగాహనపై ఉసా, బిఎస్ రాములు, ఎంఎఫ్.గోపీనాథ్, పండ్ల గోపీకృష్ణ, తంగిరాల చక్రవర్తి, వైవి రమణరావులకు జవాబులు ఇచ్చారు. మానవ హక్కుల కార్యకర్త ఎన్.జీవన్కుమార్ పాకీపని కార్మికుల విషాద జీవనంపై రాసిన వ్యాసానికి సహానుభూతి చెందారు. చివరగా స్కైబాబా అధూరె కథలపై రాసిన ఏడు ఉత్తరాలను పొందుపర్చారు. - డా. నూకతోటి రవికుమార్ పేజీలు: 222 వెల: 100 ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2; ఫోన్: 0866- 2431181 చావుమీద బతికేవాళ్లు... పుస్తకం : మరణానంతర జీవితం (నవల) రచన : నందిగం కృష్ణారావు విషయం : మరణానంతర జీవితం.. ఇది ఎవరూ చూడలేనిది. అయితే ఎవరైనా మరణిస్తే మూఢాచారాల పేరుతో కలచివేసే సంఘటనలు చాలామందికి ఎదురుపడే ఉంటాయి. పుట్టుక నుంచి గిట్టుక వరకు, అందులోనూ ప్రధానంగా అంత్యక్రియల మూఢాచారాల పేరుతో జరిగే దోపిడీ... ఆ తంతు చేయకపోతే బతికున్నవాడి పుట్టి కూడా మునిగిపోతుందనే పెద్దలు... గ్రామాల్ని గడగడలాడించిన దొరలు సైతం బ్రాహ్మణ్యం ముందు బానిసే అవుతారంటూ రచయిత నందిగం కృష్ణారావు రాసిన ‘మరణానంతర జీవితం’ నవల వాస్తవాల్ని కళ్ల ముందుంచింది. అయినవాడు పోయాడన్న బాధ ఒక పక్క... పంతులు చెప్పినట్టు పాడె కట్టకపోతే దెయ్యాలు, భూతాలవుతారనే భయం మరోపక్క... ఈ రెండింటి మధ్య నలిగిపోయే మనిషి చివరికి కర్మకాండలు పూర్తి కావడమంటే చావు మీద బతికే వాళ్లని వదిలించుకోవడమనే నిజాన్ని లైవ్లీగా రాశారు రచయిత. - పెమ్మరాజు పేజీలు: 192; వెల: 120; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాద్-36. ఫోన్: 040-27678430 కొత్త పుస్తకాలు వాయుగానం (కావ్యం) రచన: తాళ్లూరి లాబన్బాబు పేజీలు: 152; వెల: 100 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 403, విజయసాయి రెసిడెన్సీ, 16-11-20/7/1/1, సలీంనగర్ కాలనీ, మలక్పేట, హైదరాబాద్-36. ఫోన్: 9848787284 పావని (దీర్ఘకవిత) రచన: బి.హనుమారెడ్డి పేజీలు: 94; వెల: 50 ప్రతులకు: అధ్యక్షులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం, ఒంగోలు-523002. ఫోన్: 9440288080 ఝాన్సీ హెచ్.ఎం. (కథలు) రచన: చెన్నూరి సుదర్శన్ పేజీలు: 128; వెల: 100 ప్రతులకు: రచయిత, 1-1-21/19, ప్లాట్ నం.5, రోడ్ నం.1, శ్రీ సాయి లక్ష్మి శోభా నిలయం, రామ్ నరేష్ నగర్, హైదర్నగర్, హైదరాబాద్-85. ఫోన్: 9440558748 పొందూరు మరో పోర్బందర్ రచన: వాండ్రంగి కొండల్రావు పేజీలు: 108; వెల: 20 ప్రతులకు: వాసవి ప్రింటర్స్, మార్కెట్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా-532168. ఫోన్: 9573577898 కలరవాలు (కవిత్వం) రచన: ఆత్మకూరు రామకృష్ణ పేజీలు: 168; వెల: 100 ప్రతులకు: రచయిత, 8-8-01, ప్రణీత రెసిడెన్సీ, గుంటుపల్లి, విజయవాడ-521241. ఫోన్: 9493405152 మనిషిలోకి ప్రవహించాలి (కవిత్వం) రచన: ద్వానా శాస్త్రి పేజీలు: 62; వెల: 50 ప్రతులకు: రచయిత, 1-1-428, ఆర్చీస్ నెస్ట్, గాంధీనగర్, హైదరాబాద్-80. ఫోన్: 9849293376