Cement Production
-
వికా సాగర్ జేవీలో పూర్తివాటా వికా చేతికి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కర్నాటక రాష్ర్టం గుల్బర్గాలో ఏర్పాటు చేసిన వికా సాగర్ సిమెంట్లో 47 శాతం వాటాను వికాకు విక్రయిస్తోంది. 47 శాతం వాటాను రూ. 435 కోట్లకు (షేరు ధర రూ.66.68) అమ్మడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు సాగర్ సిమెంట్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఫ్రాన్స్కు వికా, రాష్ట్రానికి చెందిన సాగర్ సిమెంట్స్ సంయుక్త భాగస్వామ్యంతో గుల్బర్గాలో వికా సాగర్ సిమెంట్ పేరుతో 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల సిమెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని 2008లో నిర్ణయించుకున్నాయి. ఈ వెంచర్లో వికాకు 53 శాతం వాటా వుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ కింద డిసెంబర్, 2012 నాటికి 2.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం సాగర్ సిమెంట్ రూ.86 కోట్లు వ్యయం చేసింది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా భాగస్వామ్యం నుంచి తప్పుకున్నామని, ఇక నుంచి రెండు కంపెనీలు వాటి శక్తి సామర్థ్యాలున్న రంగాలపై పూర్తి దృష్టిసారించడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందని సాగర్ సిమెంట్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ప్లాంట్ పెట్టడం లేదా ఇతర కంపెనీలను కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాగర్ సిమెంట్స్ 2.3 మిలియన్ టన్నుల క్లింకర్ సామర్థ్యం, 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అవసరమైన నియంత్రణా సంస్థల అనుమతులు రాగానే డీల్ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది. -
ప్రస్తుతం నష్టాల్లో పరిశ్రమ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో సిమెంటు రంగం ఆరు నెలల్లో గాడిన పడుతుందని పరిశ్రమ భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సాధారణంగా మౌలిక వసతుల పరంగా అభివృద్ధి ఉంటుంది కాబట్టి సిమెంటుకు డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇదే జరిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని ప్రముఖ కంపెనీకి చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణ రంగం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వ సంబంధిత నిర్మాణ పనులవల్ల సాధారణంగా ఎన్నికల ముందు సిమెంటకు డిమాండ్ పెరుగుతుంది. అయితే ఈ దఫా ఆ తరహా పనులేవీ జరగడం లేదు. దాంతో పరిశ్రమ ఇంకా నీరసంగానే నెట్టుకొస్తోంది. సిమెంటు కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. సిమెంటు వినియోగం పెరిగితేనే కంపెనీలు మనగలుగుతాయి. ఈ ఏడాది అక్టోబరు నుంచి నెలకు 20 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడవుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. బస్తాకు రూ.60 దాకా నష్టం..: రాష్ట్రంలో నాలుగేళ్ల క్రితం నెలకు 23-24 లక్షల టన్నుల సిమెంటు అమ్ముడైంది. ఇప్పుడది నెలకు 15-16 లక్షల టన్నులకు పడిపోయింది. రాజకీయ అనిశ్చితి, బలహీన సెంటిమెంటుతో అమ్మకాలు గణనీయంగా క్షీణించాయి. రాష్ట్రంలో బస్తా సిమెంటు ధర అటూఇటూగా రూ.220-250 పలుకుతోంది. ఉత్తరాదిన ఇది రూ.350 ఉంది. కంపెనీల మధ్య పోటీ కారణంగానే రాష్ట్రంలో ధర తక్కువగా ఉందని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఒక్కో బస్తాపైన రకాన్నిబట్టి కంపెనీలు రూ.20-60 దాకా నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు కంపెనీలు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరిన్ని ప్లాంట్లు మూతపడక తప్పదని అన్నారు. అక్టోబరు నుంచి అమ్మకాలు పుంజుకుంటాయన్న సంకేతాలు ఉన్నాయి. బస్తా ధర రూ.300-320 ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. అలా అయితేనే నష్టాల నుంచి గట్టెక్కుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఖర్చులనుబట్టే ధర..: గిరాకీ-సరఫరాకుతోడు సెంటిమెంటు బాగోలేనప్పుడు సహజంగానే సిమెంటు ధరలు తక్కువగా ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటిదే. రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగినంత మాత్రాన ధరలు గణనీయంగా పెరుగుతాయని చెప్పలేమని ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. దీనికనుగుణంగానే సిమెంటు పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుందన్నారు. బొగ్గు, డీజి ల్, విద్యుత్ చార్జీలపై కొత్త సర్కారు పన్నుల విధానం పరిశ్రమకు కీలకమని వెల్లడించారు. వీటి ధరలకుతోడు తయారీ వ్యయం ఆధారంగానే సిమెంటు ధర నిర్ణయమవుతుందని ఆయన చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్లోని సిమెంటు కంపెనీలన్నింటి వార్షిక స్థాపిత సామర్థ్యం సుమారు 70 మిలియన్(7 కోట్లు) టన్నులు. ఉత్పత్తి 45-50 మిలియన్ టన్నులకు పరిమితమైంది. ఇందులో రాష్ట్ర అవసరాలకుపోను మిగిలినది తమిళనాడు, కర్నాటక, ఒరిస్సాలకు తరలివెళ్తోంది. ప్రోత్సాహమిస్తే మరిన్ని.. రాష్ట్ర కంపెనీలు ఇటీవలి కాలం నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్కు నెలకు సుమారు లక్ష టన్నుల సిమెంటు, క్లింకర్ను ఎగుమతి చేస్తున్నాయి. పోర్టు చార్జీల తగ్గింపు, పన్నుల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలిస్తే ఎగుమతులు మరింత పెంచేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది. కొత్త ప్రభుత్వం గనక చార్జీలు పెంచితే తయారీ వ్యయంతోపాటు సిమెంటు ధరలకూ రెక్కలొస్తాయి. తద్వారా ఎగుమతులు తగ్గుతాయనేది పరిశ్రమ ఆందోళన. -
మౌలిక పరిశ్రమల వృద్ధి అంతంతే...
న్యూఢిల్లీ: కీలక మౌలికరంగ పరిశ్రమల పనితీరు నవంబర్లో మందకొడిగానే నమోదైంది. ప్రధానంగా సహజవాయువు, ఎరువులు, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత పేలవంగా ఉండటంతో.. వృద్ధిరేటు 1.7 శాతానికే పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మౌలిక వృద్ధి 5.8 శాతంగా ఉంది. అయితే, ఈ ఏడాది అక్టోబర్లో మైనస్ 0.6 శాతం క్షీణతతో పోలిస్తే.. నవంబర్లో తిరిగి వృద్ధిబాటలోకి రావడం గమనార్హం. బొగ్గు, ముడిచమురు, ఉక్కు, సిమెంట్, విద్యుత్లతో కూడిన 8 రంగాల మౌలిక పరిశ్రమలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)లో 38% వెయిటేజీ ఉంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలంలో మౌలిక వృద్ధి రేటు 2.5%గా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో ఇది 6.7%. నవంబర్ ఐఐపీ గణాంకాలపై ఈ మౌలిక వృద్ధి మందగమనం ప్రభావం ఉంటుందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డీకే జోషి పేర్కొన్నారు. అక్టోబర్లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 1.8 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. రంగాలవారీగా మౌలిక పనితీరు.. నవంబర్లో గ్యాస్ ఉత్పాదకత మైనస్ 11.3 శాతం కుంగింది. గతేడాది ఇదే నెలలో ఈ రంగం ఉత్పాదకత మైనస్ 15 శాతం క్షీణించింది. ఇక పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పాదకత 29.8 శాతం వృద్ధి నుంచి మైనస్ 5 శాతం క్షీణతలోకి జారిపోయింది. ఎరువుల ఉత్పాదకత వృద్ధి 0.6%కే(గత నవంబర్లో 5%) పరిమితమైంది. ఉక్కు ఉత్పాదకత కూడా వృద్ధి 7.8% నుంచి 3.9 శాతానికి పడిపోయింది. సిమెంట్(4.2% వృద్ధి), విద్యుత్(5.9%), బొగ్గు(2.3%), క్రూడ్(1.1%) రంగాలు గతేడాది నవంబర్తో పోలిస్తే కాస్త మెరుగైన వృద్ధిని సాధించాయి.