ఆ ఆశ, ఆలోచన నాకు లేదు: త్రినాథరావు నక్కిన
‘‘పన్నెండేళ్ల నా కెరీర్లో ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించాను. అయితే వేగంగా సినిమాలు చేసి, డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన, ఆశ నాకు లేదు. నంబర్లు తక్కువ అయినా మంచి సినిమాలు తీయాలన్నదే నా ఆకాంక్ష. అందుకే నిదానంగా చేసుకుంటూ వెళుతున్నాను’’ అని త్రినాథరావు నక్కిన చెప్పారు. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా రూపొందిన చిత్రం ‘చౌర్య పాఠం’. కార్తీక్ ఘట్టమనేని కథ అందించిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన నిఖిల్ గొల్లమారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్పై డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో త్రినాథరావు విలేకరులతో పంచుకున్న విశేషాలు.→ కార్తీక్ ఘట్టమనేని తండ్రి ఐజీగా చేశారు. ఆయన హయాంలో జరిగిన ఓ చిలిపి దొంగతనం కేసు గురించి కార్తీక్ చెప్పినప్పుడు సరదాగా అనిపించింది. ఈ నేపథ్యంలో సినిమా చేద్దామనే ఆలోచన వచ్చింది. ఆ కేసుని స్ఫూర్తిగా తీసుకొని ఫిక్షన్ యాడ్ చేసి, ఈ కథ రాశాడు కార్తీక్. ఈ సినిమాకి దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి పేరుని తనే చెప్పాడు. ‘కార్తికేయ’ సినిమా షూటింగ్లో తన చురుకుదనం, ప్రతిభని గుర్తించాను. దీంతో ఓకే చెప్పాను. తను ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్ని మాత్రం మూడుసార్లు మార్పించాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూసుకున్నాక చాలా బాగుందనిపించింది. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ కథకి రెండింతలు న్యాయం చేశాడు. ఈ చిత్రం దొంగతనం చేయాలనుకునే వారికి ఓ పాఠంలా ఉంటుంది (నవ్వుతూ). → కొత్తవాళ్లకి ఒక వేదిక సృష్టించి, అవకాశాలు ఇవ్వాలన్నది నా కల. ఎప్పటి నుంచో ఉన్న ఆ కల ‘చౌర్యపాఠం’తో నెరవేరింది. నిర్మాతగా మారి డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. కేవలం కొత్తవారికి అవకాశం కల్పించా లనే మంచి ఉద్దేశంతోనే నిర్మాతగా మారాను. మేం అనుకున్నదాని కంటే పది శాతం బడ్జెట్ పెరిగింది. మా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో రాజీ పడకుండా మంచి క్యాలిటీతో తీశాం.→ ఇంద్ర రామ్ ఈ కథకి సరిగ్గా సరి΄ోయాడు. కొత్తవాడు కదా సరిగ్గా చేస్తాడో? లేదో అనుకున్నాం. సెట్స్కి వెళ్లాక రెండు రోజులు కంగారు పడినా, ఆ తర్వాత బాగా నటించాడు. అలానే ΄ాయల్ రాధాకృష్ణ తెలుగు నేటివిటీ మిస్ అవ్వకుండా చక్కగా నటించింది. → ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్స్కి రావడం తగ్గించడానికి చాలా కారణాలున్నాయి. వాళ్లని థియేటర్స్కి రప్పించే సినిమాలు తీయడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం హవీష్ హీరోగా నా డైరెక్షన్లో చేస్తున్న సినిమా 25 శాతం పూర్తయింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, ‘దిల్’ రాజుగారి బ్యానర్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్లో సినిమాలు చేయాల్సి ఉంది.