ఆమెకు 40 ఏళ్లకు గతం గుర్తుకొచ్చిందట!
కాన్పూర్: ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన అచ్చం సినిమా కథను తలపిస్తోంది. చనిపోయిందని భావించిన ఓ మహిళ దాదాపు 40సం.రాల తరువాత తిరిగి వచ్చింది. తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాన్పూర్లో ఇన్యత్ పూర్ గ్రామంలో ఈ అద్భుత సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ గతం మర్చి పోయిన విలాసకు (82) 40 ఏళ్ల తర్వాత గతం గుర్తుకు రావడం, కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఓ వింతగా మారింది.
వివరాల్లోకి వెళితే..1976లో పాముకాటుతో విలాస మహిళ మరణించింది. అంటే సుమారు 40 ఏళ్ల క్రితం పశుగ్రాసం కోసం అడవికి వెళ్లినపుడు పాము కాటుకు గురైంది. ఆమెకు నాటు వైద్యం చేయించినా ఫలించలేదు. దీంతో ఆమె మరణించిందని భావించిన బంధువులు ఆమెను గంగా నదిలో పడేసి,అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు.
నదిలో కొట్టుకుపోతున్న ఆమెను కన్నోజ్ సరిహద్దు గ్రామం సరోజ్ టేకూ కు చెందిన రామసరన్ కాపాడి వైద్యం అందించారు. అయితే, ఆమె స్పృహ లోకి వచ్చి కోలుకున్నప్పటికీ, గతం మర్చిపోయింది. దాంతో వారి దగ్గరే ఉండిపోయింది. ఇటీవలే ఆశ్చర్యకరంగా ఆమెకు తన గతం పూర్తిగా గుర్తుకొచ్చింది. దీంతో విషయం తెలుసుకున్న పలువురు ఆమె చెప్పిన వివరాలను విశ్వసించి, వివరాలు సేకరించారు. అనంతరం సొంత గ్రామానికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిపారు. పుట్టుమచ్చలు ఆధారంగా తల్లిని గుర్తించారు విలాస కుమార్తెలు రామ కుమారి, మున్ని సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తరువాత తమ తల్లిని తిరిగి కలుసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.