breaking news
comments on women
-
ఇదేం చెత్త వాగుడు: శివాజీపై పలువురి ఫైర్
‘‘చాలా బాగుందమ్మా (యాంకర్ని ఉద్దేశించి) ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. ఇంకో విషయం చెబుతున్నాను. హీరోయిన్లు ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకునిపోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా... ఏమీ అనుకోవద్దు హీరోయిన్లందరూ. మీరు అనుకున్నా నాకు భయం లేదు. లాగి పెట్టి, పీకుతాం మనం. అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, నిండుగా కట్టుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ‘సామాను’ కనబడే వాటిలో ఏమీ ఉండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు... కానీ ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకుంది? కాస్త మంచివి వేసుకోవచ్చు కదా... బాగుంటావు అని అనాలనిపిస్తుంది కానీ అనలేం. అంటే... స్త్రీకి స్వేచ్ఛ లేదా అంటారు.నేనిలా మాట్లాడితే... పెద్ద పెద్దోళ్లంతా సీక్త్రి స్వేచ్ఛ లేదని అంటారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. మన గౌరవం మన దేశ భాషల నుంచే పెరుగుతుంది. ప్రపంచ వేదికల్లో కూడా చీర కట్టుకున్నవారికే విశ్వ సుందరి కిరీటం వచ్చింది’’ అంటూ సోమవారం సాయంత్రం జరిగిన ‘దండోరా’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అమ్మాయిల దేహాన్ని ‘సామాను’ అనడం... ‘దరిద్రపు...’ అంటూ బహిరంగంగా అనడం పట్ల పాపులర్ యాంకర్–నటి అనసూయ, గాయని–అనువాద కళాకారిణి చిన్మయి, ప్రముఖ స్త్రీవాది కొండవీటి సత్యవతి స్పందించారు.అలాగే, దర్శకురాలు నందినీ రెడ్డి, నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ, నటి–నిర్మాత లక్ష్మీ మంచు, దర్శకురాలు నందినీ రెడ్డి, పాపులర్ యాంకర్ ఝాన్సీ తదితరులు శివాజీ నుంచి క్షమాపణ కోరాలంటూ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కి లేఖ రాశారు. ‘‘శివాజీ... ఏమిటా చెత్తవాగుడు’’ అంటూ సత్యవతి నిప్పులు చెరిగారు. ‘‘ఏంటా ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనా’’ అంటూ అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘శివాజీ హీరోయిన్లకు అనవసరమైన సలహా ఇచ్చాడు. వాళ్ల సామాను కవర్ చేసుకోవడానికి చీరలు కట్టుకోమంటున్నాడు.అతనేమో జీన్స్, హుడీలు వేసుకుంటాడు. మరి... భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, ధోతీలు కట్టుకోవచ్చుగా’’ అని చిన్మయి అతని మాటలను ఖండించారు. ‘‘శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం... ఒకరి ప్రవర్తనతో గౌరవం లభిస్తుంది కానీ ధరించే దుస్తులతో కాదు... మహిళలు గౌరవించబడాలి’’ అంటూ ప్రముఖ హీరో మంచు మనోజ్ ఓ లేఖ వెలువరించారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో మంగళవారం సాయంత్రం ‘క్షమాపణ’ చెబుతూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.శివాజీ మట్టెలు ధరించాలి: చిన్మయి‘‘తెలుగు నటుడు శివాజీ నటీమణులను ‘దరిద్రపు... (రాయడానికి వీలు లేని పదం)’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాను’ను కప్పుకోవడానికి చీరలు ధరించాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు. శివాజీ ఒక అద్భుతమైన సినిమాలో విలన్ గా నటించి, చివరికి ఇన్సెల్ బాయ్స్కు హీరోగా మారిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే... వృత్తిపరమైన ప్రదేశాల్లో శివాజీ ‘దరిద్రపు...’ వంటి పదాలను ఉపయోగిస్తున్నాడు. శివాజీ జీన్స్, హుడీ ధరిస్తాడు. అయితే అతను ధోతీలు మాత్రమే ధరించి, భారతీయ సంస్కృతిని పాటించాలి... బొట్టు పెట్టుకోవాలి. అతను వివాహితుడని తెలిసేలా కంకణం, మెట్టెలు ధరించాలి. ఇక్కడ (ఫిల్మ్ ఇండస్ట్రీని ఉద్దేశించి కావొచ్చు) మహిళలను చూసే విధానం బాగాలేదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా గాయని చిన్మయి స్పందించారు.పరిశ్రమ మౌనం వహించడం ఆందోళనకరం‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేస్తున్న వంద మందికిపైగా మహిళా నిపుణుల తరఫున మేము ఈ లేఖ రాస్తున్నాం’’ అంటూ నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీ లక్ష్మీ అంటూ ‘మా’కి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ⇒ ‘మా’ సభ్యునిగా ఉన్న శివాజీ ‘దండోర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, బహిరంగ వేదికపై హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదు... ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి ప్రయోజనం పొందుతున్నవాళ్లూ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులూ చేసినప్పుడు చాలా హానికరం. అతను ఉపయోగించిన ‘సామాన్లు, దరిద్రపు’ వంటివి అవమానకరమైన వి. అంతేకాదు... నటీమణులను బెదిరించినట్లు అయింది. ఇది బీఎన్ఎస్ 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించడంగా పరిగణించబడుతుంది. ఇది శిక్షార్హమైన నేరం. శివాజీ నుంచి బహిరంగ, షరతులు లేని క్షమాపణ కోరుతున్నాం.. లేకుంటే మేం తీవ్ర చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. మహిళల దుస్తులు, చీర లేదా ఇతరత్రా డ్రెస్సింగ్పై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదు. ఆధునిక, సృజనాత్మక పరిశ్రమలో దీనికి స్థానం లేదు. మహిళలు నిజమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు పరిశ్రమ మౌనం వహించడం కూడా ఆందోళనకరమైనది. నటీమణులు నిధీ అగర్వాల్, సమంత ఇటీవల మూక దాడులకు గురైనప్పుడు సామూహిక ఆగ్రహం, జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనకరమైనది.మహిళల భద్రతను గౌరవాన్ని ఉల్లంఘించినప్పుడు నిశ్శబ్ద ప్రతిస్పందన ఎందుకు ఉంది? క్షమాపణకు మించి మేము ‘మా’ నుండి స్పష్టమైన, జవాబుదారీతనం, చర్యను కోరుతున్నాం. ‘మా’ అసోసియేషన్ వెంటనే ఈ కింది చర్యలను రూపొందించి అమలు చేయాలని అభ్యర్థిస్తున్నాం.⇒ కేవలం క్షమాపణలు మాత్రమే కాదు. ఈ విషయాలపై కూడా ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ’ జవాబుదారీతనం వహిస్తుందని అనుకుంటున్నాము. అలాగే ‘మా’ అసోసియేషన్ ఈ క్రింది అంశాలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధులు – నందినీ రెడ్డి, సుప్రియా యార్లగడ్డ, స్వప్న దత్, లక్ష్మీ మంచు, ఝాన్సీలక్ష్మిఇదిలా వుంటే... శివాజీ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఈ వివాదం సద్దుమణిగింది అన్నట్లుగా ‘మా’ ఓ ప్రకటన విడుదల చేసింది.నీ ఒంట్లో ఇంత కొవ్వేందిఏమిటా చెత్త వాగుడు శివాజీ? నువ్వేమో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ మా మా గురించి అవాకులు చవాకులు పేలతావా నీ ఒంట్లో ఇంత కొవ్వేంది మా బట్టల గురించి వాగడానికి నువ్వెవడివిచెప్పులు తేవాలాచెర్నాకోలా తేవాలానిన్ను తన్ని తగలెయ్యడానికిఅడ్డమైన వాళ్ళూ చెడ్డీలేసుకుని బయలుదేరుతారు సిగ్గూ ఎగ్గూ వదిలేసి అయినా నువ్వెవడివి మా గురించి తీర్పులు చెప్పడానికి మర్యాదగా చెంపలేసుకుని సారీ చెప్పు గుంజీళ్ళు తీసి మోకాళ్ళ మీద కూర్చుని క్షమాపణ అడుగు ఇంకెప్పుడూ ఇలా వాగనని నీకు నువ్వు ప్రమాణం చేసుకో మా జోలికొస్తే ఖబడ్దార్ బండకేసి ఉతికి ఆరేస్తాం. – కొండవీటి సత్యవతి ఎడిటర్, భూమిక, స్త్రీవాద పత్రికఅలా అనడానికి ఎంత ధైర్యం?: అనసూయశివాజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనసూయ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ముఖ్య విశేషాలు ...⇒ నా లైఫ్లో హీరోల ఫ్యాన్స్ పేరుతో చేసిన ట్రోల్స్లో ముఖ్యంగా మూడు ఉన్నాయి. ఒకటి ‘అత్తారింటి దారేది’ (ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ని గ్రూపుతో చేయలేనని రిజెక్ట్ చేశారు), రెండోది ‘అర్జున్ రెడ్డి’ (ఈ మూవీ పబ్లిక్ ఫంక్షన్లో ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు), మూడోది అంతకుముందు ‘గంగోత్రి’ (ఆ సినిమాలో అల్లు అర్జున్ తనకు నచ్చలేదని చెప్పడం). అయితే అప్పట్లో మెచ్యుర్టీ లేకుండా, లౌక్యం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన మాటలు అవి.కానీ ఎవరి మీదా అయిష్టంతోనో, హిడెన్ ఎజెండాతోనో మాట్లాడిన మాటలు కావు. అప్పుడు నన్ను చాలా అగౌరవపరిచారు... పర్సనల్గా టార్గెట్ చేస్తూ, మెసేజ్లు పెట్టారు. అయితే నన్ను బాధపెట్టే విషయం ఏంటంటే... ఫ్యాన్స్ పేరుతో ట్రోల్స్ చేస్తున్నప్పుడు, అరాచకాలు చేస్తున్నప్పుడు ఎవరి ఫ్యాన్ అని వారు చెప్పుకుంటారో ఆ స్టార్ ఒక్క మాట చెబితే బాగుండేది. కానీ అలా ఎప్పుడూ జరగలేదు.⇒ తొలి ప్రాధాన్యం కుటుంబానికే...నాకు సినిమానే జీవితం కాదు... యాక్టింగ్ అంటే ఇష్టం... అంతే. నా తొలి ప్రాధాన్యం నా కుటుంబానికే. అందరూ ఆదర్శంగా తీసుకునేలా నా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటాను. అందుకే కెరీర్కన్నా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇస్తాను. అవకాశాల కోసం ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ అలా చేసి, అవకాశాలు తెచ్చుకుంటే నాకు తృప్తిగా ఉండదు.⇒ రెబల్ అనుకున్నా ఫర్వాలేదుపిరికిగా ఉండే స్త్రీలనే మగవాళ్లు టార్గెట్ చేస్తారు. బోల్డ్గా ఉండే అమ్మాయిల గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తారు. ‘ఫేక్ ఫెమినిజమ్’ అని, ‘అటెన్షన్ సీకింగ్’లో భాగంగా ఇలా మాట్లాడుతున్నానని కూడా అంటారు. అయినా ‘నో ప్రాబ్లమ్’. నేను ఉమెన్ని కోరేది ఒక్కటే. పిరికిగా ఉండొద్దు. ధైర్యంగా బతకాలి. ‘రెబల్’ అనుకున్నా ఫర్వాలేదు... మన జోలికి ఎవరూ రారు.⇒ ఆ జంతువులతో జాగ్రత్తమనం అడవికి వెళ్లామనుకోండి... జంతువుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం జాగ్రత్తలు తీసుకుంటా కదా. అలాగే సమాజంలోని మగాళ్ల రూపంలో ఉండే కొన్ని జంతువులు ఉన్న చోట మనం (మహిళలు) ఉండాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మగవాళ్లల్లో మంచివాళ్లు చాలామంది ఉన్నారు. కానీ జంతువుల్లా ఉండేవాళ్లతో జాగ్రత్త. ఎందుకంటే వాళ్లు మనుషులు కాదు... సంస్కారం ఉండదు. జంతువులు కాబట్టి రెచ్చిపోతారు. అలాంటివాళ్లు ఉన్న చోట నా జాగ్రత్తలో నేను ఉంటాను. ⇒ మా అత్తగారింట్లో నన్ను అర్థం చేసుకున్నారుమా ఆయన బిహారీ. మా పెళ్లప్పటికి నేను సినిమా ఇండస్ట్రీలో లేను. మా అత్తగారింట్లో ‘గూంఘట్’ (ముసుగు) కల్చర్ ఉంది. కానీ నేను అలా ముసుగు వేసుకోవాలని వాళ్లు ఆశించలేదు. నేను మోడ్రన్గా ఉంటాను. అయితే నా వస్త్రధారణకు, నా మనస్తత్వానికి ఏమాత్రం సంబంధం లేదని మా మామగారు గ్రహించారు. నన్ను కూతురిలా చూసుకుంటారు. మా ఆయన నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మా ఇంట్లో నా చుట్టూ అలాంటి మగవాళ్లు ఉన్నారు. వేరే అమ్మాయిల జీవితాల్లోనూ ఇలా మంచి మగవాళ్లు ఉండాలన్నది నా ఆశ.⇒ ధోతీ కట్టుకుని ఉండగలరా?వస్త్రధారణ అనేది కంపర్ట్ కోసమే. ఇప్పుడు మగవాళ్ల దుస్తులు గురించి మాట్లాడుకుందాం. ఇంట్లో పూజలు చేసినప్పుడు పట్టు ధోతీ కట్టుకుని చేస్తారు కదా... పూజ అయిపోగానే తీసేసి, ‘షార్ట్స్’ వేసుకుంటారు. మరి... ధోతీ కట్టుకుని గంటలు గంటలు ఉండమంటే వాళ్లు ఉంటారా? ఉండరు... ఎందుకంటే ధోతీ వారికి సౌకర్యం కాదు. మరి అమ్మాయిలు వాళ్ల కంఫర్ట్ గురించి ఆలోచించకూడదా? అయినా చీర కట్టుకో అంటారు... అసలు చీర కంటే ‘ఎక్స్పోజింగ్’ వేరే ఏ డ్రెస్లో ఉంటుంది?⇒ అసలు ఆ పదం ఏంటి?‘సామాను’ అనే పదం ఏంటి? ఆడవాళ్ల శరీర భాగాలను అలాపోల్చడానికి ఎంత ధైర్యం ఉండాలి? పైగా బహిరంగ వేదిక మీద ‘దరిదప్రు....’, ‘సామాను’ అనే పదాలు వాడటం ఎంత ధైర్యం? రాజకీయాల్లో ఉన్నామనే ధైర్యమా? వాళ్లకి కూతుళ్లు లేరా? అయినా వేరేవాళ్లకు తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉండాలా? నేనేదో రెబలియస్గా మాట్లాడటం లేదు. అమ్మాయిలు కుక్కిన పేనులా ఉండాలని సీక్రెట్ ఎజెండాతో కొందరు మగవాళ్లు రూల్స్ పెట్టారు. కానీ, అమ్మాయిలను గౌరవించే మగవాళ్లు మన సమాజంలో చాలామంది ఉన్నారు. ప్రపంచంలో మంచి భాగస్వాములుగా ఉండే మగవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లని చూసినప్పుడల్లా ఆ జంతువుల్లాంటి మగవాళ్లు ఇలా ఎందుకు ఉండటంలేదు అనిపిస్తుంటుంది.⇒ అక్కడ క్రైమ్ రేట్ తక్కువఅమ్మాయిలు ధరించే దుస్తులే వారికిప్రోటెక్షన్ అంటే... అస్సలు కానే కాదు. నా కుటుంబంలో ఉన్న మగవాళ్లు ప్రోటెక్ట్ చేస్తారు... కానీ రక్షణ పేరుతో కంట్రోల్ చేయాలనుకోలేదు. కొన్ని దేశాలు ఉన్నాయి... అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ధరించే దుస్తులతో సంబంధం లేదు. ఆ దేశాల్లో అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి... మనకు ఎందుకీ పక్షపాతం?నాకు ఇద్దరు మగపిల్లలున్నారు. ఒక తల్లిగా వాళ్లకి మంచి ప్రపంచం ఉండాలని కోరుకుంటాను. చేతకాని మగవాళ్లందరూ ఆడవాళ్లను హర్ట్ చేస్తుంటారు. అందుకే మా అబ్బాయిలు నాకంటే ధైర్యంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ధైర్యంగా ఉండే మగవాళ్లు హర్ట్ చేయాలనుకోరు. వాళ్లకి ఇన్సెక్యూర్టీ ఉండదు కాబట్టి. -
యువతులపై ‘పుచ్చకాయ’ వ్యాఖ్యలు.. కేసు
సాక్షి, తిరువనంతపురం : ముస్లిం యువతులను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసిన కేరళ ప్రొఫెసర్ చిక్కుల్లో పడ్డారు. కోజీకోడ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నాన్-బెయిలబుల్ వారెంట్ను జారీచేశారు. కోజీకోడ్లోని ఫరూక్ ట్రైనింగ్ కాలేజ్ ప్రొఫెసర్ జౌహర్ మునవ్వీర్ ఈ మధ్య ఓ మీటింగ్ లో మాట్లాడుతూ.. కాలేజీలోని అమ్మాయిలు బుర్ఖాలు ధరించినప్పటికీ.. ఛాతి భాగాన్ని మాత్రం పూర్తిగా కప్పుకోరని .. ఆ భాగాన్ని పుచ్చకాయలా చూపిస్తూ ఆకర్షిస్తుంటారని, ఆపై లెగ్గిన్స్ అంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడిచింది. కొందరు మహిళలు నగ్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మరికొందరు పుచ్చ కాయలతో వక్షోజాలను కప్పిపుచ్చుకుని వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ తమ ఫోటోలను షేర్ చేశారు. భారతీయ మహిళలకు సరిపడ బట్టలు ఎంటో చెప్పండి అంటూ జౌహర్పై విమర్శలు గుప్పించారు. కాగా, అమ్రిత అనే యువతి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు అధ్యాపకుడిపై కేసు నమోదు చేసి, వారెంట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రొఫెసర్ గత నాలుగు రోజులుగా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
మీరు నల్లగా ఉన్నా.. తెల్ల అమ్మాయిలు కావాలా!
మహిళలపై జేడీ(యూ) ఎంపీ శరద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో సోమవారం తీవ్ర గందరగోళం నెలకొంది. రాజ్యసభలో బీమా బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ''మీ దేవుడు రవిశంకర ప్రసాద్లా నల్లగా ఉంటారు. కానీ పెళ్లి ప్రకటనల్లో మాత్రం తెల్లటి అమ్మాయిలు కావాలని చెబుతారు'' అని శరద్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటితో పాటు ఇంతకుముందు శరద్ యాదవ్ దక్షిణాది మహిళల నల్ల రంగు గురించి చేసిన వ్యాఖ్యలనూ ఆయన ప్రస్తావించారు. ''వాళ్లు చాలా అందమైన వాళ్లు.. వాళ్లకు డాన్సు చేయడం కూడా వచ్చు'' అని గతంలో శరద్ యాదవ్ అన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని రవిశంకర ప్రసాద్ సభలో ప్రస్తావించారు. శరద్ యాదవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందేనని పట్టుబట్టారు. దీనిపై శరద్ యాదవ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించుకున్నారని చెప్పారు. దేశంలోను, ప్రపంచంలోను చాలామంది నల్లరంగు మహిళలున్నారని, దీనిపై తాను ఎవరితోనైనా చర్చించగలనని, భారతీయ సంస్కృతిని తాము ఎంతో గౌరవిస్తామని అన్నారు. అయినా అధికారపక్షం మాత్రం పట్టు విడవలేదు. మహిళల రంగు మీద సభ్యులు వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అయితే.. దీనిపై చర్చకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ నిరాకరించారు. -
ఆడాళ్లంటే నేతలకు మరీ ఇంత అలుసా!
భారతీయ సమాజంలో ఆడవాళ్లను చులకనగా చూడడం, వారిపై జరుగుతున్న అత్యాచారాలకు వారే బాధ్యులంటూ నిందలు వేయడం, వారి అందచందాల గురించి అసంబద్ధంగా మాట్లాడటం మన ఎంపీలకు, రాజకీయ నేతలకు పరిపాటిగా మారిపోతున్నది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఏ పార్టీవారైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, తమ వ్యాఖ్యలపై వివాదం చెలరేగగానే తమ ఉద్దేశం అది కాదంటూ నాలిక్కరుచుకోవడమూ కూడా పరిపాటిగానే మారిపోతున్నది. దక్షిణాది రాష్ట్రాల అమ్మాయిలు అందంగా ఉంటారని, వారి రంగు, శరీరాలు కూడా అందంగా ఉంటాయని, పైగా వారికి డాన్స్ చేయడం కూడా వచ్చంటూ జనతాదళ్ (యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెల్సిందే. బీమా బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ‘ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 29 శాతం నుంచి 49 శాతానికి పెంచడం తెల్లరంగు అమ్మాయి కావాలంటూ ఇచ్చే పెళ్లి ప్రకటనలా ఉంది’ అని అన్నారు. అంతటితో ఆగకుండా ‘దక్షిణాది అమ్మాయిలు అందంగా ఉంటారు. వారి శరీరాలే కాదు, ఒంటి రంగు కూడా అందంగా ఉంటుంది. అలాంటి అందం ఇక్కడ లేదు’ అని వ్యాఖ్యానించారు. తెల్ల రంగు ఉన్నందుకే వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియాస్ డాటర్’ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్కు తీహార్ జైల్లో చిత్రీకరణకు అనుమతించారని కూడా ఆరోపించారు. ఆయన మాటల సారాంశం...బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడమంటే నల్లరంగు అమ్మాయిని వదిలేసి తెల్లరంగు అమ్మాయి వెంటబడినట్టనీ...వీటిపై సభ లోపలా బయటా వివాదం రేగడంతో తన ఉద్దేశం నలుపు, తెలుపంటూ ఆడవారి పట్ల వివక్ష చూపడం ఎంత మాత్రం కాదని సమర్థించుకున్నారు. గతంలో నేతలు ఆడవారి గురించి ఇంతకంటే ఘాటైన, వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. వాటిలో మచ్చుకు కొన్ని.. ఇంట్లోనే ఉంచితే రేప్లు జరగవు: బొత్స సత్యనారాయణ 2012లో ఢిల్లీలో నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసి చంపేసినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ‘భారత్కు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందంటే రాత్రిపూట స్త్రీలు కూడా తిరగొచ్చని అర్థం చేసుకోరాదు. ఇలాంటి రేపులు జరగకుండా ఉండాలంటే చీకటి పడ్డాక ఆడవాళ్లను ఇంట్లోనే ఉంచాలి’ అన్నారు. నిర్భయ గురించి ప్రస్తావిస్తూ ‘అసలు ఆ సమయంలో ఆమె ఎందుకు ప్రైవేటు బస్సెక్కాలి. అలా ఎక్కకపోతే ఇది జరిగేది కాదు కదా’ అని వ్యాఖ్యానించారు. అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు: ములాయం ముంబై శక్తి మిల్స్ ఆవరణలో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడాన్ని సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ ఖండిస్తూ, ‘అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు. అంతమాత్రాన ఉరిశిక్ష విధిస్తారా? తాము అధికారంలోకి వస్తే ఇలాంటి చట్టాలను మారుస్తాం’ అని ఆయన గత లోక్సభ ఎన్నికల ర్యాలీలో వ్యాఖ్యానించారు. డిస్కోతెక్లో డాన్స్ చేసి వస్తున్నారు: అభిజిత్ ముఖర్జీ నిర్భయ రేప్కు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న మహిళా కార్యకర్తల గురించి ‘డెస్కోతెక్లో డాన్స్చేసి ఇక్కడికొచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారు’ అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు. త్వరగా పెళ్లిళ్లు చేస్తే రేప్లు జరగవు: ఓం ప్రకాష్ చౌతాలా ‘అమ్మాయిలకు పిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తే వారిపై రేపులు జరగవు. మొగల్ సామ్రాజ్యంలో రేప్ల నుంచి తమ పిల్లల్ని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్లిళ్లు చేసేవారు’ అని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా వ్యాఖ్యానించారు. పట్టణీకరణ వల్లే రేప్లు: మోహన్ భగవత్ సిటీ సంస్కృతి వల్లనే రేప్లు జరుగుతున్నాయని, భారత్లో రేప్లు జరిగేవి కావని, నవీన ఇండియా రేప్లు పెరిగాయని 2013లో ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. యాభై కోట్ల గర్ల్ ఫ్రెండ్: నరేంద్ర మోదీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు 2012లో జరిగిన ఓ ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ భార్య సునంద పుష్కర్ గురించి ప్రస్తావిస్తూ ‘వాహ్ క్యా గర్ల్ ఫ్రెండ్ హై. ఆప్నే కబీ దేఖా హై 50 క్రోర్ కా గర్ల్ ఫ్రెండ్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


