స్మార్ట్ నగరం
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరిగిపోతోంది. 2032 నాటికి మన దేశంలోని నగరాల జనాభా మరో 25-30 కోట్లు పెరిగిపోతుందని ఓ అంచనా. వచ్చే 20 ఏళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఉద్యోగం వంటి అనేక కారణాలతో నగరబాట పడతారని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి.
లేకుంటే ప్రస్తుతం ఉన్న నగరాలు త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి. దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి కోసం రూ.7,060 కోట్లను ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చ.మీ. నుంచి 20 వేల చ.మీ.కు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 10 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మూడేళ్ల కాల పరిమితిని నిర్దేశించారు.
రియల్ బూమ్..
స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలను ఎంపిక చేస్తారని స్థిరాస్తి నిపుణులు ధీమావ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా సిటీల్లో ఆధునిక వసతులతో పాటు, మౌలిక, రవాణా వంటి సేవలూ మెరుగవుతాయని ఆర్వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి చెప్పారు. ఇప్పటికే పలు సంస్థలు రియల్ వెంచర్లు, ప్రాజెక్ట్లను ఆయా నగరాలకు క్యూ కడుతున్నాయన్నారు.
అన్నీ స్మార్టే: అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవతంగా మార్చేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటివాటిని స్మార్ట్సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు.
{sాఫిక్ లైట్లు మొదలుకొని భవంతులు వరకూ అన్నీ కంప్యూటర్ నెట్వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి.
వైర్లెస్ సెన్సర్ల నెట్వర్క్లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు, అధికారులకు సమాచారమిస్తాయి.
నీటి పైపుల్లో లీకేజీలున్నా, చెత్త కుండీ నిండిపోయిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు సమాచారం వస్తుంది.
{sాఫిక్ జామ్ల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం వస్తుంది. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్లు వెలుతురులో హెచ్చు తగ్గులుంటాయి.
వాన నీటిని ఒడిసి పట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు ఉపయోగించ డం.
పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస సముదాయాలు ఉండేలా చూడటం.
మెట్రో, మోనో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థ ఏర్పాట్లుంటాయి.
అవసరాన్ని బట్టి స్మార్ట్గా పనిచేసే విద్యుత్ గ్రిడ్, పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్ట్లను ఏర్పాటు చేస్తారు.
స్మార్ట్ రహదారులు, విశాలమైన మైదానాలు, భూగర్భ జలాలు పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.
అగ్ని ప్రమాదాలు, వాతావరణాన్ని గుర్తించే సెన్సర్లు, ఆటోమేటిక్ విద్యుత్ వ్యవస్థలతో పాటు ఆధునిక రక్షణ ఏర్పాట్లను కల్పిస్తారు.