breaking news
concerts
-
విందామా... ప్రకృతి గీతం
ప్రకృతి నుండి వచ్చే వివిధ వైవిధ్యభరితమైన ధ్వనులు...... పక్షుల కువకువలు, నదీ ప్రవాహాలు, గాలి వీచికలు, సాగర ఘోషలు, జలపాత జోరులు, తుమ్మెద ఝంకారాలు, కీటక శబ్దాలు... వెరసి భూమి మనకు అందించే సంగీత కచేరి. ఆ దృష్ట్యా చూసేవారికీ భూమి అద్భుత సంగీతకారిణిగా గోచరిస్తుంది. నదులు, వాగులు, సాగరాలను, సెలయేళ్ల గలగలలను వివిధ సంగీత సాధనాలను వాయించే సంగీతకారులుగా చేసి, పక్షుల కుహూ కుహూలను గాత్రధారులను చేసి, ఈ అద్భుత మేళవింపుతో మనకు సంగీతాన్ని వినిపించే గొప్ప సంగీతవేత్త. శోధించ గలిగేవారికి మరెన్నో వివిధ సంప్రదాయ సంగీతాలు, అనేక రాగాలను శ్రవణానందకరంగా వినిపించే గొప్ప సంగీత దర్శకురాలు. అవును. భూమికి సంగీతం ఉంది. వినగలిగేవారికి అది సంగీతాన్ని వినిపిస్తుంది. అయితే మనం దృష్టి సారించి చూసి, తెలుసుకోగలగాలి. వినగలగాలి. అసలు మనకు జిజ్ఞాస, వినే మనస్సుండాలి. ఈ భూమి, దీని మీద నివసించే మానవులు, ప్రకృతి జంతుకోటి చేసే కదలికలకు, శబ్దాలకు లేదా ధ్వనులకు, ఓ తూగు, ఊగు, లయ ఉంటుంది. వాటికి మనస్సును పులకింపచేసే ఒక శక్తి ఉంది. అవి వీనులకు విందు కలిగిస్తాయి. ఓ హాయినిస్తాయి. మనస్సుకు ఒక ప్రశాంతతనిచ్చి, ఒక అలౌకిక ఆనందానికి లోను చేస్తాయి. అనేకమంది కవులు, రచయితలు భూమి వినిపించే సంగీతం గురించి చక్కగా వర్ణించారు విశ్వవ్యాప్తంగా. అది వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, షేక్స్పియర్, కీట్స్, వర్డ్స్వర్త్ లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. నదులు ప్రవాహపు తీరు వినసొంపుగా ఉంటుంది. ప్రవహించే భూ విస్తీర్ణాన్ని బట్టి వివిధ రకాలుగా నది ధ్వనిస్తుంటుంది. అవన్నీ చెవులకు హాయినిస్తాయి. నదులను తనలో కలుపుకునే సముద్రం నిరంతరం గర్జిస్తూనే ఉంటుంది. పర్వతాల, కొండల మీదనుండి భూమి ఒడిని చేరాలని తహతహలాడుతూ దుందుడుకుగా దూకే ఝరులు వీక్షకుల గుండెలను ఝల్లుమనిపిస్తూ విభ్రాంతిని కలిగించినా శ్రవణాలకు ఒకే సంగీత వాద్యాన్ని వందలమంది వాయించినంత అనుభూతినిస్తాయి. ఇహపరమైన ఇక్కట్లను, బాధను కొద్దిసేపైనా మనం మరిచేటట్టు చేస్తుంది. శ్రవణానందకరమైన ఏ శబ్దమైనా మనసును రసమయం చేయగల మహత్తును కలిగి ఉంటుంది. గాలి ఈలలు వేస్తుందని, ఎన్నెన్నో ఊసులు చెప్పగలదని ఎంతమందికి తెలుసు? వేసవి తాపాన్ని తొలగిస్తూ మనస్సులను ఝల్లుమనిపిస్తూ భూమిని ముద్దాడటానికి అనూహ్యమైన వేగంతో వచ్చే తొలకరిజల్లు శ్రవణ పేయమై మన ఉల్లాన్ని ఆనందలహరిలో ప్రవహింప చేయదూ! తెలతెలవారుతుండగానే చెట్ల మీద ఉండే పక్షులు బద్ధకాన్ని వదిలించుకునే క్రమంలో ఒళ్ళు విరుచుకుంటూ, రెక్కల సవరింపులో చేసే విదిలింపులు, టపటపలు, గొంతు సవరించుకుంటూ చేసే కిల కిలకిలలు ఉదయపు నడకలో ఉన్నవారికి నిత్యానుభవమే. తెల్లవారుతోందన్న సంగతిని సూచిస్తూ... కొక్కోరో కో.. అని కుక్కుటం చేసే శబ్దం మేలుకొలుపుకు చిహ్నం. సూర్యాస్తమయాన్ని సూచించే ఇంటికి వడివడిగా చేరుకునే పశువుల గిట్టల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తూ... ముచ్చటను కలుగచేస్తాయి. ఈ భూమి మీద జంతువులు కూడ నివసిస్తున్నాయి. మనుషుల స్వరాలలోని వైచిత్రి వాటిలో కూడ చూస్తాము. అడవికి రాజుగా భాసిల్లే సింహం చేసే గర్జన, మదమెక్కిన గజరాజు పెట్టే ఘీంకారం, చెడు భావనను కలిగించే నక్కల ఊళలు, పాము బుసలు, శిరోభారాన్ని, చికాకును కలిగించే కీచురాళ్ళ ధ్వనులు మనలను భీతిల్లేటట్లు చేస్తాయి. మానవ ప్రమేయం లేక ప్రకృతి చేసే శబ్దాలను అనాహతమని, మానవ ప్రేరితంగా వచ్చే శబ్దాలను లేదా ఆహతమని అంటారు. మన ఊపిరి నిలిపేందుకు నిరంతరం పరిశ్రమించే ఊపిరితిత్తుల ఉచ్వాస నిశ్వాసాలలో ఓ లయ ఉంది. శ్రుతి ఉంది. ఇవి సంగీత ధ్వనులే. మన ప్రాణాన్ని నిలిపే గుండె లబ్.. డబ్ ల ధ్వనిని ఎంత లయబద్ధంగా చేస్తుంది! శ్రుతి లయలలో రవ్వంత అపశ్రుతి వచ్చినా ఫలితం మరణమే కదా! మన శరీరాన్ని.. నాదమయం.. అన్నారు ప్రాజ్ఞలు. నాదం ఒక ప్రాణశక్తి. సంగీతానికి మనసును పరవశింపచేసే శక్తి ఉంది. ఒక గొప్ప సంగీత గాత్రధారి ఆలాపన చాలు మనల్ని తన్మయులను చేయటానికి. మాటను చక్కగా ఉచ్చరిస్తూ, కావలసిన ఊనికనిస్తూ మాటలలోని భావాన్ని గొంతులో పలికిస్తూ భాషించే వ్యక్తి సంభాషణ శ్రోతలనలరిస్తుంది. ఈ పోహళింపులకు మాధుర్యాన్ని జోడిస్తూ పాడగల పశువుల కాపరి పాట మనలను ఎంతగా అలరించగలదో, అంతగానే ఉన్నత శ్రేణి కి చెందిన సంగీతకళాకారుని త్యాగరాజ కీర్తన కూడ. ఇంతటి మహత్తును కలిగి ఉన్న సంగీతాన్ని భూమి మనకు నాదరూపంలో అందిస్తుంది. దీన్ని ఆనందించి పరవశించి, దాన్ని ఒక అనుభూతి చేసుకుని మనసు పొరల్లో పొదవుకోగల ఏకైక బుద్ధిజీవి మానవుడు ఒక్కడే. భూమి తన సంగీతంతో మన మనస్సుకు ఎంతో ప్రశాంతతను, సాంత్వన చేకూర్చి మనలను ఆనంద రసజగత్తులోవిహరించేయగల ఓ గొప్ప సంగీతజ్ఞురాలు. ఈ ఆనందస్థితిలో మనిషి తన విధిని చక్కగా నిర్వర్తించగలడు. ఈ ఆనందమే స్వర్గమైతే దీన్ని మనకు అందచేసే భూమి స్వర్గ తుల్యమే. దీన్ని మనం కాపాడుకోవాలి. సంరక్షించుకోవాలి. జీవనశైలి, నాగరికత, సాంకేతికతలనే పేరుతో దీన్ని విధ్వంసం చేసే హక్కు మనకెక్కడుంది? ఇప్పటికే ఈ గ్రహం మీద మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నాం. ఈ భూ గ్రహాన్ని పూర్తిగా ఓ అగ్నిగుండంగా మార్చి భావితరానికి కానుకగా ఇద్దామా! ప్రస్తుతానికి మనిషి నివసించే, నివసించగల ఒకే ఒక గ్రహం ఈ భూమి. మన ముందు తరాలు, మన తరం నివసించిన ఈ.. ఆనందనిలయాన్ని... ముందు తరాలకు అందించే బాధ్యత మనందరిదీ. పక్వానికొచ్చిన పంటను పడతులు ఒకచేత ఒడుపుగా పట్టుకుని మరొక చేత కొడవలితో కోసే వేళ అది చేసే శబ్దంలో క్రమముంటుంది. అది సంగీతమే! కోసిన కంకులను మోపులుగా కళ్లాలలో కర్రలతో కొడుతున్నవేళ, తూర్పార పట్టే వేళ చేట చెరుగుళ్ల శబ్దాలు ఒక వింత ధ్వనిని చేస్తాయి. ఎంత ఆహ్లాదాన్నిస్తాయి! ఒకనాటి పల్లెటూళ్లు చక్కని సంగీత కచేరిలు చేస్తుండేవి. పాలు పితికే క్షణాన ఆ ధార పాత్రను తాకుతున్నప్పుడు వచ్చే ధ్వనికి ఓ లయ ఉంది. తరుణులు పెరుగును చిలికే వేళ కవ్వం, కవ్వపు తాడు చేసే ధ్వని, కవ్వపు గుత్తి కుండను తాకే శబ్దానికి ఎంత లయ! వీటికి తోడు అ ఆ మగువల చేతిగాజులు చేసే ధ్వని ఓ నాదమే. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ఏఆర్ రెహమాన్ కచ్చేరీలు రద్దు
ఏఆర్ రెహమాన్ సంగీత కచ్చేరీలు రద్దయ్యాయి. ఆయన ఎక్కువగా విదేశాల్లోనే సంగీత కచ్చేరీలు నిర్వహిస్తున్నారు. మే, జూన్ నెలల్లో ఉత్తర అమెరికాలో సంగీత విభావరి నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత కరోనా ఎఫెక్ట్ ఆయన సంగీత కచ్చేరీలపైనా పడింది. అమెరికాలో సంగీత కచ్చేరీలు నిర్వహించడం తనకూ, తన సంగీత బృందానికి శ్రేయస్కరం కాదని భావించిన ఏఆర్ రెహమాన్ వాటిని రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. (‘జుమాంజి’ నటికి కరోనా) నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్ వాయిదా అలాగే నటుడు యోగిబాబు వివాహ రిసెప్షన్ వాయిదా పడింది. ఆయన మంజుభార్గవి అనే వైద్యురాలిని గత ఫిబ్రవరి 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. ఏప్రిల్ 5న వివాహ రెసెప్షన్ ఉంటుందని ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. (లిక్కర్ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి) -
స్టార్ హీరోయిన్ల మధ్య కోల్డ్వార్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. సల్మాన్తో పాటు వీరిద్దరు దబాంగ్ రీలోడెడ్ పేరిట నిర్వహిస్తున్న షోల కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టూర్లో భాగంగా అక్కడికి వెళ్లిన జాక్వలిన్, కత్రినాలు ఒకరికొకరు ఎదురుపడటానికి సైతం ఇష్టపడటం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ టూర్కు వీరితో పాటు సోనాక్షి సిన్హా, మనీశ్ పాల్లు కూడా వెళ్లారు. కత్రినా, జాక్వలిన్ల మధ్య అంతరాయలను గమనించిన సల్మాన్ వీరిద్దరు ఒకరికొకరు తారసపడకుండా చూడాలని ఇతర టీమ్ సభ్యులకు సూచించారు. హోటలల్లో కూడా కత్రినా, జాక్వలిన్లకు కేటాయించే రూమ్లు దూరంగా ఉండేలా వారు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. -
సుదీర్ఘ మృదంగ విన్యాసం
తిక్క లెక్క సాధారణంగా కచేరీలు ఎంతసేపు జరుగుతాయి..? మహా అయితే రెండు మూడు గంటలు. ప్రత్యేక సందర్భాల్లో అక్కడక్కడా నిర్వహించే బృంద కచేరీలైతే ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా అరుదుగా జరుగుతుంటాయి. అయితే, ఒకే మనిషి ఏకధాటిగా ఇరవై ఒక్క రోజులు కచేరీ చేయడం సాధ్యమేనా..? అసాధ్యం అనుకుంటున్నారా..? ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు కేరళకు చెందిన యువ మృదంగ విద్వాంసుడు కుళల్మన్నం గోపాలకృష్ణన్ రామకృష్ణన్. కర్ణాటక సంగీత కచేరీల్లో ఎక్కువగా పక్కవాద్యంగా ఉండే మృదంగంతో ఏకంగా 501 గంటల సేపు సోలో కచేరీ నిర్వహించి గిన్నెస్ రికార్డు సాధించాడు. -
యుద్ధం జరుగుతోందనుకున్నాం
పారిస్ : పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడికి బలైన ప్రదేశాల్లో బాటాక్లాన్ కూడా ఒకటి. అక్కడో సంగీత కార్యక్రమం జరుగుతోంది. అక్కడంతా కోలాహలంగా ఉంది. చాలా ఉత్సాహంగా, మ్యూజిక్ బ్యాండ్తో హోరెత్తుతోంది. ఇంతలో అక్కడ ఒక్కసారిగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాలను బీబీసీ రిపోర్టు చేసింది. మ్యూజిక్ కన్సర్ట్ చాలా ఉత్సాహంగా ఉంది.. పెద్ద సౌండుతో సంగీతం వినిపిస్తోంది. ఇంతలో సడన్గా కాల్పులు వినిపించాయి. భీకరమైన అరుపులు. చుట్టూ చూశా.. ముసుగు ధరించిన ఉన్న ఒక నీడ లాంటి రూపం నావైపు చూస్తోంది. అంతోలోనే నా వైపు గురి పెట్టి కాల్పులు జరిపింది. తృటిలో నేను బతికిపోయాను. కానీ పక్కన వ్యక్తి చనిపోయాడు.. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. భీకరమైన కాల్పులు. దాదాపు అందరూ నేలపైన పడుకున్నారు. మరికొంతమంది ఇక్కడ యుద్ధం జరుగుతోందని అరుస్తూ నాలుగు వైపులా భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. మేం పక్కనే ఉన్న కెఫే లో దాక్కున్నాం. యుద్ధం జరుగుతోందని ఎవరో అరవగానే అందరూ నమ్మారు. ఎక్కడివాళ్లక్కడ నేలమీద పడుకుండిపోయాం.. భారీ ఎత్తున సైరన్ లు వినిపిస్తున్నాయి... భయంతో వణికిపోయాం. తర్వాత వెనక డోర్ నుంచి మమ్మల్ని తప్పించారంటూ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న వారు చివురుటాకుల్లా వణికిపోతూ బీబీసీ న్యూస్ తో తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.