Deputy Mayor post
-
డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ఢిల్లీ: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. ఆ ఎన్నికల సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారని, అక్రమాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఎంపీ గురుమూర్తి సహా పలువురుపై దాడికి పాల్పడిన సందర్భాన్ని సుబ్రహ్మణ్యస్వామి లేఖలో పేర్కొన్నారు.కాగా, ఈనెలలో జరిగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి సర్కార్.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అన్యాయంగా డిప్యూటీ మేయర్ పదవిని లాక్కుంది. దాడులు, దౌర్జన్యాలతో పదవి లాక్కున్న కూటమి ప్రభుత్వం బరి తెగించి.. కుతంత్రాలకు తెరతీసింది వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల కిడ్నాప్తో కూటమి విధ్వంసం సృష్టించింది. టీడీపీకి ఓటు వేయకుంటే ఇళ్లు కూలుస్తామంటూ బెదిరింపులకు దిగింది. మహిళా కార్పొరేటర్లపై కూడా దాడులు చేసిన కూటమి గూండాలు.. బెదిరింపులకు పాల్పడ్డారు.మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 49 డివిజన్లకు గానూ 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందింది. భూమన అభినయరెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడింది. కూటమికి ఒక్క కార్పొరేటరే ఉన్నా అధికార బలంతో దాన్ని దక్కించుకునేందుకు కుట్రలకు తెర తీశారు. -
ఢిల్లీ మేయర్ ఆప్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇవాళ(శుక్రవారం) మేయర్ క్యాండిడేట్ను ప్రకటించింది ఆ పార్టీ. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆప్ మేయర్ అభ్యర్థిగా మహిళ అభ్యర్థి పేరును ప్రతిపాదించింది. షెల్లీ ఒబెరాయ్(39) పేరును మేయర్ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించింది. ఇక డిప్యూటీ మేయర్గా ఆలే మొహమ్మద్ ఇక్బాల్ పేరిటి నామినేషన్ దాఖలు చేసింది. షెల్లీ ఒబెరాయ్.. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేశారు. ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఆమె కౌన్సిలర్గా నెగ్గారు. పశ్చిమ ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ నుంచి ఆమె నెగ్గారు. షెల్లీ ఒబెరాయ్.. ఇండియన్ కామర్స్ అసోషియేషన్లో లైఫ్టైం మెంబర్. ఇందిరా గాంధీ ఒపెన్ యూనివర్సిటీ నుంచి ఆమె స్కూల్ మేనేజ్మెంట్ స్టడీస్లో పీహెచ్డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు. ఇక ఆలె మొహమ్మద్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఆప్ నేత అయిన షోయబ్ ఇక్బాల్ తనయుడు. పదిహేడు వేల ఓట్ల మెజార్టీతో ఈ ఎన్నికల్లో నెగ్గారు ఆయన. మేయర్ పోస్ట్ నామినేషన్లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది.ఢిల్లీ మేయర్ను మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోటీలో మరొ అభ్యర్థి గనుక నిలబడకపోతే.. షెల్లీ ఒబెరాయ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. పదిహేనేళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొడుతూ.. ఆప్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 250 స్థానాలకుగానూ ఆప్ 134, బీజేపీ 104, కాంగ్రెస్ 9 వార్డులను దక్కించుకున్నాయి. ఆప్ విజయంతో మేయర్ పదవికి పోటీ పడే ఆలోచనలో లేనట్లు బీజేపీ ఇదివరకే ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది. -
కాకినాడ టీడీపీలో 'డిప్యూటీ' చిచ్చు
► అలకవహించిన మత్స్యకార వర్గాలు ► ఎమ్మెల్యే తీరుపై పార్టీలో అసహనం కాకినాడ: కాకినాడ సిటీ నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న మత్స్యకార వర్గాలను పార్టీ నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ మండిపడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మత్స్యకార వర్గాలైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులకు 12 మందికి కార్పొరేటర్ సీట్లు కేటాయించగా 11 మంది విజయం సాధిస్తే కనీసం గుర్తింపు కూడా లేకపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. 48 డివిజన్లకు గాను కాకినాడలో 43, రూరల్లో 5 డివిజన్లు ఉండగా, మెజార్టీ వర్గాన్ని ఎలా విస్మరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తాను ప్రాతినిధ్యం వహించే మత్స్యకార వర్గానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారంటూ బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. రెండుమూడు రోజుల్లో మత్స్యకార కార్పొరేటర్లు, ముఖ్య నేతలు సమావేశమై తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గానికి చెందిన కొందరు కార్పొటరేటర్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేపై అసహనం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై మత్స్యకార వర్గాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాను ప్రతిపాదించిన అభ్యర్థికి మేయర్ స్థానాన్ని దక్కించుకోలేకపోయిన కొండబాబు కనీసం సొంత సామాజికవర్గానికి డెప్యూటీ మేయర్ను కూడా ఇప్పించలేకపోయారంటూ మండిపడుతున్నారు. కార్పొరేటర్గా గెలుపొందిన అన్న కుమారుడు వనమాడి ఉమాశంకర్తోపాటు సీనియర్ కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్, మల్లాడి గంగాధర్, చవ్వాకుల రాంబాబు ప్రధానంగా డిప్యూటీ మేయర్ను ఆశించారు. వాస్తవానికి మత్స్యకారుల్లో అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన వనమాడి ఉమాశంకర్ పేరు ప్రతిపాదనకు రాగా మరో వర్గమైన వాడబలిజలు తమకే ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో చోడిపల్లి, చవ్వాకుల రాంబాబు పేర్లు ప్రతిపాదనలకు వచ్చాయి. అయితే చివరి నిముషంలో వీరెవ్వరినీ కాదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థి డిప్యూటీ మేయర్ పోస్టును దక్కించుకున్నారంటూ గగ్గోలుపెడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో అంతర్గతంగా చిచ్చురేపుతోంది. మత్స్యకార వర్గాల ప్రాధాన్యతను ఎమ్మెల్యే వనమాడి పార్టీ ముఖ్యనేతల ఎదుట చెప్పడంలో విఫలమయ్యారని, అందువల్లే తమకు అన్యాయం జరిగిందంటూ వాపోతున్నారు. సొంత సామాజికవర్గం నుంచే తీవ్ర నిరసన వ్యక్తమవుతుండడంతో ఎమ్మెల్యేకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. కాకినాడ టీడీపీలో డెప్యూటీ మేయర్ పదవి చిచ్చు రేపుతోంది. మేయర్ ఓసీ మహిళకు కేటాయించిన నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవిని మత్స్యకార వర్గానికి కేటాయిస్తారని ఆశించారు. అయితే పరిస్థితులు తారుమారై ఆ పదవిని కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కేటాయించడంతో మత్స్యకార వర్గాలు పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.