సగానికి పైగా షెడ్డుకే..
- 31,260 వైద్య పరికరాలకుగాను... 18 వేలు పనిచేయనివే
- ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుంటుపడిన వైద్య ఆరోగ్య సేవలు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులు రోజురోజుకూ కునారిల్లుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగానికిపైగా సాధారణ పరికరాలు సహా వైద్య పరికరాలు మూలనపడి ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా గుర్తించింది. అవి ఏమాత్రం పనిచేయడం లేదని అధికారులు గుర్తించారు. ఏసీలు మొదలు మైక్రోస్కోపులు, బ్లడ్ సెల్ కౌంటర్లు, క్లినికల్ థర్మామీటర్, డీప్ ఫ్రీజర్, డెలివరీ టేబుళ్లు, డయాగ్నోస్టిక్ ఆల్ట్రాసౌండ్ మిషన్, డయాలసిస్ మిషన్, డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్, ఈసీజీ రికార్డర్, ఐ స్లిట్ ల్యాంప్ బయో మైక్రోస్కోప్, గ్లూకోమీటర్, ఇన్ఫాంట్ కేర్ ట్రాలో, ఇన్ఫాంట్ రేడియంట్ వార్మర్లు అనేకం మరమ్మతుల్లో ఉన్నాయి.
ఇనుస్ట్రుమెంట్ స్టెరిలైజర్, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్, పేషెంట్ స్ట్రెచర్ ట్రాలీ వంటివీ మరమ్మతుల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,260 వైద్య పరికరాలు, ఇతరత్రా నాన్ మెడికల్ పరికరాలున్నాయి. వాటిల్లో 18 వేల పరికరాలు (60%) మరమ్మతుల్లో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తేల్చింది. రోగులను తరలించే స్ట్రెచర్లు మొదలు కొని ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ తదితర 360 రకాల పరికరాల స్థితిగతులపై ఆ శాఖ నివేదిక తెప్పించుకుంది. అందులో 60 శాతం వరకు మరమ్మతులకు గురయ్యాయని నిర్ధారించింది.
మరమ్మతు బాధ్యత ఒకే కంపెనీకి...
కొత్త వాటిని కొనుగోలు చేయడం, ఉన్న వాటిని బాగు చేయడం కోసం ప్రభుత్వం నడుం బిగించింది. ముందుగా వైద్య పరికరాల నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను ఔట్ సోర్సింగ్ ద్వారా ఒక కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. ఐదేళ్ల వరకు ఆ కంపెనీయే నిర్వహణ, మరమ్మతు బాధ్యత తీసుకుంటుంది. ఇందుకోసం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రూ. 20 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ద్వారా ఈ టెండర్ల ప్రక్రియ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. అయితే ఒకే ఒక కంపెనీకి అప్పగించడం వల్ల వేలాది పరికరాలను వారెంత వరకు సక్రమంగా నిర్వహిస్తారోనన్న విమర్శలూ ఉన్నాయి.