District planning and zoning
-
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
హన్మకొండ : జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా ఉండే 17 మంది జెడ్పీటీసీ సభ్యుల ఎంపిక కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 2, జనరల్కు 3 రిజర్వు అయ్యాయి. ఈ కేటగిరీలకు చెందిన 17 స్థానాలకు.. 28 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 15న నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 16న నామినేషన్ల ఉపసంహరణ, 17న పోలింగ్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ జరుగుతుంది. నామినేషన్ల దాఖలు చేసిన వారి జాబితా ఇదీ... ఎస్టీ జనరల్ కేటగిరీకి ఒక స్థానం ఉంది. ముగ్గురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీ భూక్య సామ్య(టీఆర్ఎస్), వర్ధన్నపేట జెడ్పీటీసీ సభ్యుడు పాలకుర్తి సారంగపాణి(టీఆర్ఎస్), తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు జాటోతు కమలాకర్(టీఆర్ఎస్). ఎస్టీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ పదవికి రఘునాథపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు భానోతు శారద(టీఆర్ఎస్), తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు పుల్సం సరోజన(స్వతంత్ర) నామినేషన్ వేశారు. ఎస్సీ జనరల్ కేటగిరీలో ఒక స్థానం ఉంది. నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యుడు ధర్మారపు వేణు(కాంగ్రెస్) నామినేషన్ వేశారు. ఎస్సీ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నా యి. నలుగురు జెడ్పీటీసీలు నామినేషన్లు వేశారు. దేవరుప్పుల జెడ్పీటీసీ సభ్యురాలు నల్ల ఆండాలు(కాంగ్రెస్), గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు నామవరపు విజయలక్ష్మి(కాంగ్రెస్), కొడకండ్ల జెడ్పీటీసీ సభ్యురాాలు బక్కి కవిత(కాంగ్రెస్), పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ(టీఆర్ఎస్) నామినేషన్ వేశారు. బీసీజనరల్ కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఆరుగురు జెడ్పీటీసీలు నామినేషన్ వేశారు. ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు(టీఆర్ఎస్), ములుగు జెడ్పీటీసీ సభ్యుడు సకినాల శోభన్(టీఆర్ఎస్), నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడు చెట్టుపల్లి మురళీధర్(టీడీపీ), హసన్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్(టీఆర్ఎస్), మరిపెడ జెడ్పీటీసీ సభ్యుడు పూల్నె మాణిక్యం(కాంగ్రెస్), మహబూబాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న(కాంగ్రెస్) నామినేషన్ వేశారు. బీసీ మహిళా కేటగిరీలో మూడు స్థానాలు ఉన్నాయి. ఏడుగురు జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ వేశారు. జనగామ జెడ్పీటీసీ సభ్యురాలు బెలిదె విజయ(టీఆర్ఎస్), బచ్చన్నపేట జెడ్పీటీసీ సభ్యురాలు వేముల స్వప్న(టీఆర్ఎస్), చేర్యాల జెడ్పీటీసీ సభ్యురాలు సుంకరి సరిత(టీఆర్ఎస్), మద్దూరు జెడ్పీటీసీ సభ్యురాలు నాచగోని పద్మ(కాంగ్రెస్), ఏటూరునాగారం జెడ్పీటీసీ సభ్యురాలు వలియాబీ(కాంగ్రెస్), కేసముద్రం జెడ్పీటీసీ సభ్యురాలు బండారు పద్మ(కాంగ్రెస్), హన్మకొండ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీరామోజు అరుణ(టీఆర్ఎస్) నామినేషన్లు వేశారు. జనరల్ మహిళా కేటగిరీలో రెండు స్థానాలు ఉన్నాయి. ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. పరకాల జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి(టీఆర్ఎస్), భూపాలపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు మీరాబాయి జర్పుల(టీఆర్ఎస్) నామినేషన్ వేశారు. జనరల్ కేటగిరీ స్థానాలు మూడు ఉన్నాయి. లింగాలఘణపురం జెడ్పీటీసీ సభ్యుడు గంగసాని రంజిత్రెడ్డి(టీఆర్ఎస్), నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాం భరత్(కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి మారారు), ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యుడు లేతాకుల సంజీవరెడ్డి(కాంగ్రెస్) నామినేషన్లు వేశారు. ఏకగ్రీవానికి సహకరించాలి : జెడ్పీ చైర్పర్సన్ డీపీసీ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవం చేయనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. ఈ మేరకు నామినేషన్ వేసిన సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. జిల్లా పరిషత్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల ముఖ్య నాయకులతో, జెడ్పీ ఫ్లోర్ లీడర్లు, నామినేషన్ వేసిన జెడ్పీటీసీ సభ్యులతో చర్చలు జరుపుతున్నామన్నారు. దీనికి సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికపై ‘గులాబీ’ సభ్యుల్లో అసంతృప్తి
వరంగల్ :జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఎన్నికలు టీఆర్ఎస్లో గందరగోళానికి దారితీస్తున్నాయి. డీపీసీ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆ పార్టీ ముఖ్య నేతల వైఖరి.. ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య సొంత నియోజకవర్గం స్టేషన్ఘన్పూర్లోనే ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. డీపీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియతో ఈ విషయం స్పష్టమైంది. డీపీసీలో 30 మంది సభ్యులు ఉంటారు. జిల్లాపరిషత్ చైర్పర్సన్ అధ్యక్షురాలిగా, కలెక్టర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. నలుగురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన 24 మందిని ఎన్నుకుంటారు. గ్రామీణ ప్రాంతాల నుంచి 17 మంది జెడ్పీటీసీ సభ్యులు, పట్టణ/నగర ప్రాంతాల నుంచి కౌన్సిలర్లు/కార్పొరేటర్లు కలిపి ఏడుగురు సభ్యులుగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన జెడ్పీటీసీ సభ్యుల నుంచి 17 మందిని ఎన్నుకునే ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. 17 స్థానాల విషయంలో టీఆర్ఎస్కు 10 స్థానాలు, కాంగ్రెస్కు 6 స్థానాలు, టీడీపీకి ఒకటి చొప్పున కేటాయించుకునేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే డీపీసీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ఒప్పందాన్ని ప్రతిపాదించిన టీఆర్ఎస్ సభ్యులే 18 మంది నామినేషన్లు వేయడంతో ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. డీపీసీలో టీఆర్ఎస్కు కేటాయించిన 10 స్థానాల్లో డిప్యూటీ సీఎం టి.రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించాలని అనుకున్నారు. వర్ధన్నపేట, పాలకుర్తి, జనగామ, మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల నుంచి ఒక్కో జెడ్పీటీసీకి అవకాశం ఇచ్చేలా టీఆర్ఎస్లో అంతర్గతంగా అంగీకారం కుదిరింది. టీఆర్ఎస్కు సంబంధించి డీపీసీ తమ నియోజకవర్గానికి కేటాయించిన స్థానానికి ఎవరిని ప్రతిపాదించాలనేది ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకే అప్పగించారు. టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సమక్షంలో జిల్లాలోని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలోనే ఈ మేరకు అంగీకారం కుదిరింది. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి, లింగాలఘణపురం జెడ్పీటీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. వీరిలో ఒకరి పేరు ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మరొకరి పేరును ఎంపీ కడియం శ్రీహరి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్లు వేశారు. దీంతో ఉన్నత పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. ఎవరికి సర్ది చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. జనగామ నియోజకవర్గం నుంచి జనగామ జెడ్పీటీసీ సభ్యుడి పేరును స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రతిపాదించారు. టీఆర్ఎస్కు చెందిన బచ్చన్నపేట, చేర్యాల జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. ఇద్దరి నామినేషన్లను ఉపసంహరింపజేందుకు టీఆర్ఎస్ జిల్లా నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి హసన్పర్తి జెడ్పీటీసీ సభ్యుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అనూహ్యంగా వర్ధన్నపేట, పర్వతగిరి, హన్మకొండ జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురికి సర్దిచెప్పడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. పాలకుర్తి నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్కు చెందిన తొర్రూరు జెడ్పీటీసీ సభ్యుడు నామినేషన్ వేశారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు మద్దతు తెలిపిన కొడకండ్ల, దేవరుప్పుల కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. వీరిద్దరినీ ఏ పార్టీలో పరిగణిస్తారనేది ఉపసంహరణ రోజున స్పష్టత రానుంది. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్ వెంట టీఆర్ఎస్లో చేరారు. డీపీసీలో ఈ నియోజకవర్గం కోటాలో ఒకరికి అవకాశం ఉంటే.. మరిపెడ, నర్సింహులపేట జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు సంబంధించిన ములుగు, భూపాలపల్లి, పరకాల, నెల్లికుదురు(మహబూబాబాద్) జెడ్పీటీసీ సభ్యులు నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్లోనూ ఇంతే... ఒప్పందంలో భాగంగా డీపీసీలో టీఆర్ఎస్కు ఏడు స్థానాల కేటాయింపు జరిగింది. అయితే ఏకంగా 9 మంది సభ్యులు నామినేషన్లు వేశారు. మహబూబాబాద్, గోవిందరావుపేట, ఆత్మకూరు, కేసముద్రం, ఏటూరునాగారం, మద్దూరు, తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరికితోడు కాంగ్రెస్ నుంచి గెలిచి చైర్పర్సన్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన కొడకండ్ల, దేవరుప్పుల జెడ్పీటీసీ సభ్యులు సైతం నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన చైర్పర్సన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు టీఆర్ఎస్ కోటాలో నామినేషన్ వేశారు.