పరీక్షలో ‘పది’లమేనా!
మారిన విద్యావిధానంపై తర్జనభర్జన
ఫలితాల్లో జిల్లా స్థానంపై
పెరుగుతున్న ఆసక్తి
నూతన విధానంపై ఉపాధ్యాయుల భిన్నాభిప్రాయాలు
భానుగుడి (కాకినాడ) :
దశాబ్దాల కాలంగా పాఠశాల విద్యా విధానంలో ప్రశ్న సమాధానాల పద్ధతిని పాటిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పద్ధతి నుంచి మూల్యాంకనానికి పరీక్ష విధానం మార్పు చేశారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు తొలిసారి నిరంతర సమగ్రమూల్యాంకన విధానంలో నిర్వహించనున్నారు. ఈ విధానం విద్యార్థుల మాటెలా ఉన్నా నిర్వహణ ఉపాధ్యాయులకు కత్తిమీద సాములా ఉంది. దీనిపై ఉపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు
2013–14 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లా తొలి స్థానంలో నిలిచింది. 2014–15లో రెండో స్థానం, 2015–16లో మూడో స్థానం దక్కించుకుంది. గత ఏడాది 67,493 మంది విద్యార్థులు రెగ్యులర్గాను, 3 వేల మంది ప్రైవేట్గాను పరీక్షలు రాశారు. ఈ ఏడాది మొత్తం 68 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది పరీక్షలను సీసీ కెమెరాల మధ్య నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా స్థానం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ జరిగిన మార్పు
గతంలో ప్రశ్నపత్రం ఆధారంగా విద్యార్థులు జవాబులు రాసేవారు. రాసిన జావాబులు ఆధారంగా మార్కులు వేసేవారు. విషయాన్ని ఆకళింపు చేసుకోకుండా బట్టీపట్టి జావాబులు రాస్తున్నారన్న విమర్శలతో దీనికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని ఈ ఏడాది అమలులోకి తెచ్చింది. వంద మార్కుల ప్రశ్న పత్రంలో 80 మార్కులు పరీక్ష పత్రానికి, మిగిలిన 20 మార్కులు ఇంటర్నల్స్గా నిర్ణయించింది. ఈ 20 మార్కుల్లో 10 మార్కులు 8 నుంచి 10 వరకూ విద్యార్థి పరీక్షల్లో సాధించిన ప్రగతిని, (4 నిర్మాణాత్మక మూల్యాంకన పరీక్షలకు+2 సంగ్రహణ మూల్యాంకన పరీక్షలకు) వెరసి 360 మార్కులకు ప్రగతిని గణిస్తారు. ఈ మార్కులతో పాటు తరగతిలో విద్యార్థి స్పందన, ప్రాజెక్టు తయారీలకు గాను 20 మార్కులు కేటాయించారు. మిగిలిన 80 మార్కులను పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. ఇందులో 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు.