Advertisement
edupayala jatara
-
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్బుక్, క్యాష్బుక్లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
ఈసారి ఘనమేనా!
* రూ.కోటి నిధులపైనే కోటి ఆశలు * ఏర్పాట్లలో అధికారులు * 17 నుంచి ఏడుపాయల జాతర పాపన్నపేట: వెయ్యేళ్ల చరిత్ర గల ఏడుపాయల ఒకప్పుడు కీకారణ్యం. ప్రస్తుతం లక్షలాది భక్తులతో జనారణ్యంగా మారుతోంది. ఆదాయం ఘనంగా ఉన్నా సౌకర్యాలు అంతంత మాత్రమే. ఎంతో ఇష్టంగా వచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యాల మధ్య దైవ దర్శనం చేసుకొని వెళ్తున్నారు. నదిలో పడి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి రూపాయలు విడుదల చేశారు. కొంతలో కొంత బెటరేనని పలువురు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతేనే ఏడుపాయల రూపురేఖలు పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఇలా.. ఏడుపాయల దుర్గా భవానీ మాత ఆలయ బడ్జెట్ గత ఏడాది రూ.1,82,42,201. ఇందులో రూ.1,72,38,084 ఖర్చు చేశారు. 46 మంది ఉద్యోగులుండగా సుమారు 42 శాతం ఆదాయం వారి జీతభత్యాలకే ఖర్చువుతోంది. సీజీఎఫ్, ఈఏఎఫ్, ఏడబ్ల్యుఎఫ్, అడిట్ ఫీ కలిసి సుమారు 21.5 శాతం వ్యయమవుతోంది. జాతర కోసం రూ.37 లక్షలు వెచ్చిస్తుంటారు. అమ్మవారి ఆదాయాన్ని పరిశీలిస్తే ఇప్పటివరకు రూ.85 లక్షల ఫిక్స్ డిపాజిట్లు ఉన్నాయి. కిలో 362 గ్రాముల బంగారు ఆభరణాలు, 102 కిలోల వెండి ఆభరణాలున్నాయి. వీటికితోడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇచ్చిన బంగారు కిరీటం, హారాలు ఉన్నాయి. భక్తుల సౌకర్యాల విషయానికొస్తే అంతంత మాత్రమే. సత్రాలన్నీ దాతలవే.. ఏడుపాయల్లో మొత్తం 46 సత్రాలు ఉండగా, అందులో 40 దాతలవే కావడం గమనార్హం. జాతర సమయంలో ఆ సత్రాలన్నీ దాతలతోనే నిండిపోతాయి. భక్తులు తలదాచుకోవడానికి బండరాళ్లు, చలువ పందిళ్లు, చెట్ల నీడలే దిక్కవుతున్నాయి. గత ఏడాది జాతర సమయంలో వర్షం పడటంతో భక్తుల అనేక అవస్థలు పడ్డారు. తలదాచుకోవడానికి చోటులేక చెట్టుకొకరు, పుట్టకొకరుగా పరుగులు తీశారు. స్నానఘాట్లు లేకపోవడంతో గత ఐదేళ్లలో సుమారు 60 మంది భక్తులు మంజీర నదిలో స్నానం చేస్తూ నీట మునిగి చనిపోయారు. తాగు నీటి పైప్లైన్లు మురికి నీటిలోనే తేలియాడుతున్నాయి. సత్రాల చుట్టూ చెత్తా చెదారం పేరుకుపోయింది. మహిళలకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో జాతర సమయంలో అవస్థలు పడుతున్నారు. ఇటీవల హుండి లెక్కింపులో కిందిస్థాయి ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించి సుమారు రూ.3 వేలు నొక్కేశారు. జాతర సమయంలో సైతం సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుంటారనే ఆరోపణలున్నాయి. టెండర్ హక్కులు పొందిన వారు కూడా పరిమితికి మించి రుసుం వసూలు చేస్తారని భక్తులు ఆరోపిస్తున్నారు. మద్యం సైతం జోరుగా విక్రయిస్తుంటారు. ఈసారి రూ.కోటితో ధూంధాంగా.. ఈనెల 17న ఏడుపాయల జాతర ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా వచ్చిన జాతర కోసం మునుపెన్నడూ లేని రీతిలో ధూంధాంగా జరిపించేందుకు అధికారులు, పాలకవర్గం ప్రత్యేక కృషి చేస్తోంది. భక్తులు స్నానాలు చేసేందుకు ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్నానఘాట్లను నిర్మిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పించేందుకు తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడానికి 500 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏడుపాయలను సుందరంగా అలంకరించి జనం మెచ్చే జాతరగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈసారి హరిత రెస్టారెంట్తోపాటు టూరిజం డార్మెటరీలు భక్తులకు కొంత ఉపయోగపడనున్నాయి. ఏడుపాయలకు సింగూర్ నీరు సంగారెడ్డి అర్బన్: ఏడుపాయల జాతరను పురస్కరించుకొని 0.30 టీఎంసీల నీటిని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసినట్టు సంగారెడ్డి నీటి పారుదల శాఖ ఈఈ రాములు తెలిపారు. దిగువకు నీటిని వదిలినందున నది పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ నీరు ఘనపూర్ ఆనకట్టకు ఆదివారం రాత్రికి చేరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.