ఎన్ని ఉన్నా.. ఒక్కదానికే!
అఫిలియేషన్లలో ఊహించని ట్విస్ట్ హైకోర్టును ఆశ్రయించిన కళాశాలల యాజమాన్యాలు
హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. కొన్ని కళాశాలలకే అఫిలియేషన్ల నిలిపివేత, సీట్ల కోత ఉంటుందని భావించిన యాజమాన్యాలకు ప్రభుత్వం గట్టిగా షాక్ ఇచ్చింది. ఏకంగా 174 కాలేజీలకు అఫిలియేషన్లు నిలిపివేసి, లక్ష సీట్ల వరకు కోత పెట్టడంతో యాజమాన్యాలు ఆందోళనలో పడ్డాయి. అయితే తాము ఎక్కువ లోపాలు ఉన్న కళాళాలల అఫిలియేషన్లనే నిలిపివేశామని జేఎన్టీయూహెచ్ వర్గాలు చెబుతుండగా, యాజమాన్యాలు మాత్రం జేఎన్టీయూహెచ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నాయి. అఫిలియేషన్లు పొందిన కాలేజీల్లో కూడా లోపాలు ఉన్నాయని, అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిబంధనల ప్రకారం లేనే లేవని చెబుతున్నాయి. అలాంటపుడు తమ కాలేజీలకు మాత్రమే ఎందుకు అఫిలియేషన్లు నిలిపివేశారని ప్రశ్నిస్తున్నాయి. ఒక దశలో జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్లర్ రామేశ్వర్రావుపైనే ఆరోపణలకు దిగాయి. ఆయన మరో రెండు నెలల్లో పదవి నుంచి దిగిపోనున్న తరుణంలో తనపై ఉన్న అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి తమను బలి చేశారని యాజమాన్య ప్రతినిధి సునీల్ ఆరోపించారు.
ప్రముఖుల కాలేజీలకూ నిరాకరణ..
కళాశాలల అఫిలియేషన్ల నిలిపివేత, సీట్ల కోత విషయంలో జేఎన్టీయూహెచ్ ఓ ప్రత్యేక పద్ధతిని అమలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో యాజమాన్యానికి రెండు.. మూడు.. నాలుగు చొప్పున కాలేజీలు ఉన్నా.. వాటిల్లో ఒక్క కళాశాలకు మాత్రమే అఫిలియేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం కొన్ని యాజమాన్యాలకు, కొన్ని గ్రూపులకు నాలుగైదు వరకు కాలేజీలు ఉన్నాయి. వాటిలో నాణ్యత లేకపోవడం వల్లే అఫిలియేషన్లు నిరాకరించాల్సి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అనేక కాలేజీల్లో ఒక్కో బ్రాంచిలో 400 వరకు కూడా సీట్లు ఉండగా, వాటిని 180 సీట్లకు కుదించినట్లు సమాచారం. ఎక్కువ కాలేజీల్లో ఒక్కో బ్రాంచీలో సీట్లను 180కే పరిమితం చేశారు. అలాగే ప్రతి కాలేజీలో ఒక్కో బ్రాంచీ సెక్షన్లను కూడా మూడుకే పరిమితం చేశారు. దాదాపు అన్ని కాలేజీల అఫిలియేషన్ల విషయంలో ఇదే విధానం అమలు చేసినట్లు తెలిసింది. అఫిలియేషన్లు లభించని కాలేజీల జాబితాలో ప్రముఖుల కళాశాలలు కూడా ఉన్నాయి. ఓ మంత్రికి చెందిన మూడు కాలేజీలతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలకు చెందిన మరో మూడు కాలేజీలకు కూడా అఫిలియేషన్లు నిరాకరించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకుల కళాశాలలకు అఫిలియేషన్ల నిలిపివేత, సీట్లలో కోత విధించారు. అంతేకాదు కొన్ని ప్రముఖ గ్రూపులకు చెందిన కాలేజీలకు సైతం అఫిలియేషన్లు ఇవ్వలేదు.
సమాచారంలేదు.. సమయమూ ఇవ్వలేదు
కాలేజీల్లో లోపాలపై సమాచారం ఇవ్వకుండానే జేఎన్టీయూహెచ్ 174 కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించడం దారుణమని తెలంగాణ ప్రైవేటు ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీ యాజమాన్యాల సంఘం చైర్మన్ గౌతంరావు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. అఫిలియేషన్ల అంశంపై యాజమాన్యాలు ఆదివారం సమావేశమై చర్చించాయి. అనంతరం గౌతంరావు విలేకరులతో మాట్లాడారు. తనిఖీలు చేసినపుడు లోపాల సవరణకు కళాశాలకు అవకాశం ఇవ్వాలని, ఆ లోపాల వివరాలను తెలియజేయాలని పేర్కొన్నారు. రెండుసార్లు తనిఖీలు చేసినా తమకు లోపాలపై సమాచారం ఇవ్వకుండా, లోపాల సవరణకు సమయం ఇవ్వకుండా హఠాత్తుగా అఫిలియేషన్లను నిలిపివేసిందని విమర్శించారు. తమ కాలేజీలను కౌన్సెలింగ్లో చేర్చాలని, లేకపోతే అనుమతులు లభించిన 141 కాలేజీల్లోనూ ప్రవేశాలను నిలిపివేసేందుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు.
నేడు వాదనలు వినే అవకాశం?
అఫిలియేషన్ల నిలిపివేతపై యాజమాన్యాలు ఆదివారం సాయంత్రం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. సోమవారం సెలవుదినం అయినా వాదనలు వినేందుకు జడ్జి అంగీకరించారని యాజమాన్యాలు వెల్లడించాయి. అఫిలియేషన్లు లభించని 174 కాలేజీల్లో దాదాపు 150 కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించిన ట్లు తెలిసింది.
174 కాలేజీలపై వేటు
విద్యాప్రమాణాలు పాటించకపోవడమే కారణం
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి
వరంగల్: ఎక్కువ శాతం ఇంజనీరింగ్ కళాశాలలు ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగా విద్యాప్రమాణాలు పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడైనట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి తెలిపారు. అందుకే జేఎన్టీయూహెచ్, ఓయూ రీజియన్లో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ లభించలేదని, 141 ఇంజనీరింగ్ కళాశాలల్లోనే ప్రవేశాలకు అఫిలియేషన్ ఉందని స్పష్టం చేశారు. అఫిలియేషన్ ఉన్న కాలేజీలకు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆదివారం పాపిరెడ్డి‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణలో ప్రస్తుతం సీట్ల సంఖ్య 85 వేలకు తగ్గిందన్నారు. ఈ మేరకే విద్యార్థులు ఉంటారని తాము భావిస్తున్నామన్నారు. తెలంగాణలో వైస్చాన్స్లర్ పోస్టు ఖాళీగా ఉన్న యూనివర్సిటీలకు ప్రభుత్వం సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముందన్నారు. వీసీలతోపాటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు, పాలకమండళ్లను నియమించనున్నట్లు వివరించారు.