exchange of currency notes
-
కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగింపు...
2005 ముందునాటి నోట్లపై జూన్ 30 తాజా డెడ్లైన్ ముంబై: 2005కు పూర్వం ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు ఉద్దేశించిన గడువును రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) వచ్చే ఏడాది జూన్ 30 దాకా పొడిగించింది. వాస్తవానికి ఇది జనవరి 1తో ముగిసిపోవాల్సి ఉంది. రూ.500, రూ.1,000 సహా వివిధ మారకం విలువల కరెన్సీ నోట్లను జూన్ 30 దాకా పూర్తి విలువకు మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. పాత కరెన్సీ నోట్లను చలామణీలో నుంచి ఉపసంహరించే దిశగా వాటిని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడంగానీ అందుబాటులో ఉన్న బ్యాంకుల శాఖల్లో గానీ ప్రజలు మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించిన సంగతి తెలిసిందే. ఈ రకంగా సింహ భాగం పాత నోట్లను ఇప్పటికే చలామణీలో నుంచి ఉపసంహరించినట్లు ఆర్బీఐ తెలిపింది. అదనపు భద్రతా ఫీచర్లతో ముద్రిస్తున్న మహాత్మా గాంధీ సిరీస్ నోట్లు దాదాపు దశాబ్దం నుంచి చలామణీలో ఉండటం వల్ల పాత నోట్ల ఉపసంహరణతో ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించడం కొనసాగిస్తామని ఆర్బీఐ పేర్కొంది. 2005కి పూర్వం నోట్లకు వెనుకవైపున వాటిని ముద్రించిన సంవత్సరం ఉండదు. నకిలీ కరెన్సీకి చెక్ చెప్పే ఉద్దేశంతో ఆ తర్వాత నుంచి అదనపు భద్రతా ప్రమాణాలు జోడించడంతోపాటు ముద్రణ సంవత్సరాన్నీ నోట్లపై ముద్రిస్తున్నారు. పాత నోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు పెట్టాక రూ. 52,855 కోట్ల విలువ చేసే 144.66 కోట్ల నోట్లను ఆర్బీఐ ధ్వంసం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇందులో రూ.100 మారకం విలువగల నోట్లు 73.2 కోట్లు, రూ.500 నోట్లు 51.85 కోట్లు, రూ. 1,000 నోట్లు 19.61 కోట్లు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయ్యాల్లో ధ్వంసం చేయడం జరిగింది. 2005కి పూర్వం ముద్రించిన సిరీస్ నోట్లను శాఖల్లో గానీ ఏటీఎంల ద్వారా గానీ, జారీ చేయొద్దంటూ ఇప్పటికే బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఈ చర్యలతో ప్రస్తు తం చెలామణీలో ఉన్న పాత నోట్ల సంఖ్య స్వల్పం గానే ఉంటుందని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. -
నోట్ల మార్పిడికి బ్యాంకులు రెడీ
న్యూఢిల్లీ/ముంబై: కరెన్సీ నోట్ల మార్పిడి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. భద్రతా ప్రమాణాలను పెంచేందుకు... నకిలీ కరెన్సీ, నల్లధనానికి అడ్డుకట్టవేయడంలో భాగంగా 2005కు ముందునాటి నోట్లను వ్యవస్థ నుంచి ఉపసంహరించాలని ఆర్బీఐ నిర్ణయించిన సంగతి తెలిసిందే. పాత నోట్లను(రూ.500, 1,000 నోట్లు సహా) బ్యాంకుల్లో ఇచ్చి 2005 తర్వాత ముద్రించిన నోట్లను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మార్చుకోవాలని ఆర్బీఐ తొలుత పేర్కొంది. అయితే, ఇప్పటినుంచే ఈ మార్పిడి చేసుకోవచ్చంటూ తదుపరి మరో ప్రకటన చేసింది. నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్ ఖాతాదారుల నుంచి కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, అయినప్పటికీ తాము దీనికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిప్యూటీ ఎండీ పి.కె.మల్హోత్రా చెప్పారు. ‘మావద్ద సుమారు 1,000 నగదు డిపాజిట్ యంత్రాలు ఉన్నాయి. ఖాతాదారుల డిమాండ్ను తట్టుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. నకిలీ కరెన్సీ చలామణికి అడ్డుకట్టవేసేందుకు ఆర్బీఐ చర్యలు దోహద పడతాయి. 2005 తర్వాత ముద్రించిన నోట్లలో భద్రతకు సంబంధించి మరిన్ని అంశాలు జోడించారు’ అని ఆయన పేర్కొన్నారు. నోట్ల మార్పిడి విషయంలో ఆర్బీఐ ఆదేశాలను పాటిస్తామని ఓరియంటల్ బ్యాంక్(ఓబీసీ) సీఎండీ ఎస్ఎల్ బన్సల్ తెలిపారు. అయితే, ఇప్పటికే చాలావరకూ పాత కరెన్సీ వ్యవస్థ నుంచి తొలగి ఉండొచ్చని.. అందువల్ల ప్రజలు మరీ అంతలా క్యూలు కట్టే అవకాశాల్లేవనేది ఆయన అభిప్రాయం. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) సీనియర్ అధికారి కూడా తమ బ్యాంక్ బ్రాంచీలన్నీ నోట్ల మార్పిడి రద్దీని తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, ఈ ఏడాది జూలై 1 వరకూ మాత్రమే ఏ బ్యాంక్లోనైనా కస్టమర్లు నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆతర్వాత ఖాతా ఎక్కడైతే ఉందో ఆ బ్యాంక్ శాఖలో మాత్రమే మార్చుకోవాలని ఆర్బీఐ పేర్కొంది.