fake passport scam
-
‘వేలిముద్రల మార్పిడి’ ముఠా అరెస్టు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆపరేషన్ ద్వారా వేలిముద్రలను మార్చుతూ.. నకిలీ పాస్పోర్టులు సృష్టించి అక్రమంగా వ్యక్తులను విదేశాలకు పంపుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు వ్యక్తులతో పాటు నకిలీ పాస్పోర్టులు, సర్జికల్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామానికి చెందిన బొక్కా రాంబాబు 2010లో కువైట్ వెళ్లాడు. అక్కడ అక్రమంగా స్పిరిట్ తయారు చేస్తూ పట్టుబడడంతో 2015లో అతడిని ఇండియాకు పంపారు. కువైట్లో ఉండగా శ్రీలంక దేశానికి చెందిన జాకీర్ హుస్సేన్, అక్బర్ ఆలీ, వైఎస్సార్ జిల్లాకు చెందిన మహ్మద్ బాషా, ఖాదర్ బాషా, ముజుఫర్ పరిచయం అయ్యారు. వీరి ద్వారా రాంబాబు ఇంటివద్దే తన పది వేళ్లకు ఆపరేషన్ చేయించుకుని వేలిముద్రలు మార్పించుకున్నాడు. భీమవరానికి చెందిన మేరీ రాజ్యలక్ష్మి, భగ్గేశ్వరం గ్రామానికి చెందిన పీఎంపీ వీరా త్రిమూర్తులుతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి దొంగ పాస్పోర్టులు, వీసాలు తయారు చేసే నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కొండెం రాజారెడ్డి పరిచయం అయ్యాడు. వీరంతా కలసి జార్ఖండ్, బిహార్, తమిళనాడు, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, ఢిల్లీ, రాజంపేట తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 70 మంది వ్యక్తులకు వేలిముద్రల మార్పిడి చేశారు. నకిలీ పాస్పోర్టులు సృష్టించి వీరిలో కొందరిని అక్రమంగా విదేశాలకు పంపారు. ఇందుకోసం ఒక్కో వ్యక్తి నుంచి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ సొమ్ములు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. కీలక నిందితులు బొక్కా రాంబాబు, కొండెం రాజారెడ్డి, ముజుఫర్, పీఎంపీ వీరా త్రిమూర్తులు, శ్రీలంకకు చెందిన మహ్మద్ జాకీర్ హుస్సేన్ అలియాస్ మహ్మద్ ఫరూక్లను పాలకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
‘కేసీఆర్, హరీశ్లను అరెస్ట్ చేయాలి’
హైదరాబాద్: నకిలీ పాస్పోర్టు కుంభకోణం కేసు లో కేసీఆర్, హరీశ్రావులను కూడా అరెస్టు చేయాలని మాజీ ఎమ్మె ల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) సతీమణి నిర్మల డిమాండ్ చేశారు. ఈ కేసులో అసలు నిందితులైన కేసీఆర్, హరీశ్రావులను వదిలిపెట్టి తన భర్తను అక్రమంగా ఇరికించారన్నారు. చంచల్గూడ జైల్లో ఉన్న జగ్గారెడ్డిని బుధవారం ఆమె ములాఖత్లో కలసి వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు సాధారణ ములాఖత్ ఇచ్చారని, జాలీ మధ్యలోంచి మాటలు స్పష్టంగా వినపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి మచ్చలేని మనిషి అని కేసీఆర్ ఎలా ఎదిగారో ప్రజలందరికీ తెలుసన్నారు. జగ్గారెడ్డిని కలిసినవారిలో కుమారుడు భరత్సాయిరెడ్డి, కూతురు జయలక్ష్మీ ఉన్నారు. -
కిష్టప్ప ఎంపీ అయితే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: నేరమని తెలిసీ డబ్బు కోసం మనుషుల అక్రమ రవాణాకు సహకరిస్తానంటూ నేరగాళ్లతో ఒప్పందం చేసుకున్న మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప లోక్సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడంపై పోలీసు, నిఘా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వ్యక్తికి ఆ పార్టీ టికెట్టు ఇవ్వడం పైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. 2007లో వెలుగులోకి వచ్చి దేశాన్ని కుదిపేసిన మనుషుల అక్రమ రవాణా కుంభకోణంలో ప్రధాన నిందితుడు రషీద్ అలీ తనకు నిమ్మల కిష్టప్పతో ఉన్న సాన్నిహిత్యాన్ని రాష్ట్ర నేరపరిశోధన విభాగం అధికారుల వద్ద బయటపెట్టాడు. అతడిచ్చిన వాంగ్మూలంలో పలువురు వీఐపీలతో పాటు కిష్టప్పతో తాను చేసిన లావాదేవీల గుట్టువిప్పాడు. కిష్టప్ప లాంటి వాళ్లు పార్లమెంట్లో అడుగుపెట్టినా.. ముష్కరులతో పాటు అలాంటి వారిపైనా నిఘా పెట్టాల్సి వస్తుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రిగా ఉన్నపుడే నేరగాళ్లకు సహకరించడానికి అంగీకరించిన కిష్టప్ప.. రేపు కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ప్రభుత్వం వస్తే పలు స్కామ్లకు తెరతీసే ప్రమాదం ఉంటుందని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బెయిల్పై ఉన్న రషీద్తో పాటు మరికొంత మంది నిందితులు నిమ్మల కిష్టప్ప వంటి వారి సహకారంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అప్పట్లో సంచలనం సృష్టించిన కుంభకోణం.. నకిలీ పాస్పోర్టులు, వీసాల స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో ఢిల్లీలో మొదలైన దీని ప్రకంపనకు హైదరాబాద్నూ తాకాయి. అక్రమ వలసల కారణంగా అమెరికా వంటి దేశాలు భారతీయులకు గతంలో వీసాలు జారీ చేయడం నిలిపేశాయి. దీంతో రాజకీయ ప్రముఖుల సిఫార్సు లేఖలతో నకిలీ పాస్పోర్టులు, వీసాల కుంభకోణానికి బీజం పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాశిపేట లింగయ్య, సోయం బాపూరావు తదితరులపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పాస్పోర్ట్ బ్రోకర్ రషీద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు ముజఫర్ అలీ ఖాన్ తదితరులు నిందితులుగా ఉన్నారు. కాగా, ప్రధాన నిందితుడు రషీద్ మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి తన స్నేహితుడు ప్రకాష్రెడ్డి ద్వారా కొందరు రాజకీయ ప్రముఖులతో పాటు నిమ్మల కిష్టప్పను కలిశానని సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నలుగురు గుజరాతీయులకు వీసాల కోసం సహకరిస్తే రూ. 20 లక్షలు ఇస్తానంటూ నిమ్మల కిష్టప్పతో బేరం కుదుర్చుకున్నానని వెల్లడించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగా హైదరాబాద్లోని సైఫాబాద్ పోలీసులు తనతో పాటు ప్రకాష్రెడ్డినీ అరెస్టు చేయడంతో పథకం పారలేదని రషీద్ చెప్పాడు. అప్పట్లో పోలీసులు తమ నుంచి స్వాధీనం చేసుకున్న పాస్పోర్టుల్లో నిమ్మల కిష్టప్పది కూడా ఉందని, ఆ తరవాత అది ఆయనకు చేరిందని వివరించాడు.