Gagan Khoda
-
కనీసం 7 టెస్టులు ఆడి ఉండాలి
ముంబై: ప్రస్తుత భారత క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆడిన టెస్టు మ్యాచ్ల సంఖ్య ఆరు! సెలక్టర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుభవం విషయంలో ప్రసాద్ ఎన్నో సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్త సెలక్టర్ ఎంపికకు అర్హత విషయంలో బీసీసీఐ భారీ మార్పులేమీ చేయలేదు. కెరీర్లో 7 టెస్టు మ్యాచ్లు ఆడిన వారు సీనియర్ జట్టు సెలక్టర్ పదవికి అర్హులని ప్రకటించింది. ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో ఏర్పడబోయే రెండు ఖాళీల కోసం బోర్డు దరఖాస్తులు కోరుతోంది. పదవీకాలం ముగిసిపోవడంతో ఎమ్మెస్కే ప్రసాద్తో పాటు గగన్ ఖోడా తప్పుకోనున్నారు. వీరి స్థానాల్లో కొత్త సెలక్టర్లు వస్తారు. మిగిలిన ముగ్గురు సెలక్టర్లు శరణ్దీప్ సింగ్, దేవాంగ్ గాందీ, జతిన్ పరాంజపేలు మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. బోర్డు పేర్కొన్న అర్హతలను బట్టి చూస్తే... సెలక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేవారు కనీసం 7 టెస్టులు లేదా 30 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు లేదా 10 వన్డేలతో పాటు 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండటంతో పాటు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 24ను చివరి తేదీగా నిర్ణయించగా... సెలక్టర్లను ఎవరు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారనే విషయంలో మాత్రం బోర్డు స్పష్టతనివ్వలేదు. సీనియర్ పురుషుల జట్టుతో పాటు జూనియర్ పురుషుల జట్టు, సీనియర్ మహిళల జట్ల సెలక్టర్ల కోసం కూడా బీసీసీఐ దరఖాస్తులు కోరింది. టెస్టు జట్టులోకి రాహుల్? ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఆఖరిసారిగా నేడు భారత సీనియర్ జట్టు ఎంపిక జరగనుంది. న్యూజిలాండ్లో జరిగే టెస్టు, వన్డే సిరీస్ కోసం టీమ్లను కమిటీ ఆదివారం ఎంపిక చేస్తుంది. వన్డే, టి20ల్లో అద్భుత ఫామ్లో ఉన్న లోకేశ్ రాహుల్ను టెస్టు టీమ్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ తన ఆఖరి టెస్టును వెస్టిండీస్తో కింగ్స్టన్లో గత ఆగస్టులో ఆడాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లతో జరిగిన టెస్టు సిరీస్లలో అతని పేరును పరిశీలించకుండా సెలక్టర్లు శుబ్మన్ గిల్ను రిజర్వ్ ఓపెనర్గా ఉంచారు. అయితే తాజా ప్రదర్శనతో రాహుల్ అవకాశాలు మెరుగయ్యాయి. అశ్విన్, జడేజా రూపంలో ఇద్దరు స్పిన్నర్లు అందుబాటులో ఉండటంతో కుల్దీప్ను కాకుండా ఐదో పేసర్గా నవదీప్ సైనీ వైపే మొగ్గు కనిపిస్తోంది. చివరి నిమిషంలో ఫిట్నెస్ పరీక్షలో విఫలమైన టి20లకు దూరమైన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫిట్గా మారితే వన్డేల్లోకి ఎంపిక చేయడం దాదాపుగా ఖాయం. మిడిలార్డర్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతనికంటే మెరుగైన టెక్నిక్ కలిగిన రహానే కివీస్ గడ్డపై రాణించవచ్చనేది అంచనా. అదనపు బ్యాట్స్మన్ను తీసుకోవాలని భావిస్తే ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ పేరు అందరికంటే ముందుగా పరిశీలనలో ఉంది. ఈ టూర్లో భారత్ 5 టి20ల తర్వాత 3 వన్డేలు, 2 టెస్టులు ఆడుతుంది. -
గగన్ ఖోడా దిగిపోవాల్సిందేనా!
లోథా కమిటీ సిఫారసుల ప్రభావం తృటిలో బయటపడిన ఎంఎస్కే న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఇప్పుడు జాతీయ సీనియర్ సెలెక్షన్ కమిటీపై పడింది. సెంట్రల్ జోన్ సెలెక్టర్గా పని చేస్తున్న గగన్ ఖోడా... తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుత కమిటీలో సందీప్ పాటిల్ చైర్మన్గా, విక్రమ్ రాథోర్, సాబా కరీమ్, ఖోడా, ఎం.ఎస్.కే ప్రసాద్లు సెలెక్టర్లుగా పని చేస్తున్నారు. అయితే ఇందులో పాటిల్, రాథోర్, కరీమ్ల నాలుగేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగుస్తుంది. కానీ అక్టోబర్ 2015లో బాధ్యతలు చేపట్టిన ఖోడా, ప్రసాద్ (సౌత్జోన్)ల భవిష్యత్పైనే ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. పాత నిబంధనల ప్రకారం ఈ ఇద్దరూ 2019 వరకు పదవిలో కొనసాగడానికి అవకాశం ఉంది. అయితే లోథా కమిటీ ప్రతిపాదనల ప్రకారం... టెస్టులు ఆడిన మాజీ ఆటగాళ్లు మాత్రమే సెలెక్షన్ కమిటీలో ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం రెండు వన్డేలు మాత్రమే ఆడిన ఖోడా... కెరీర్లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. దీంతో తొలి వేటు ఇతనిపైనే పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఆరు టెస్టులు, 17 వన్డేలు ఆడిన ప్రసాద్ మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఖోడాను ఓ ఆరు నెలల పాటు పదవిలో కొనసాగించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త సెలెక్షన్ కమిటీ (ముగ్గురు సభ్యులు మాత్రమే) పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించే వరకు అతను ఉండటం చాలా అవసరమని బోర్డు భావిస్తోంది. మరోవైపు ఆగస్టు 5న జరగనున్న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం వేదిక ముంబై నుంచి ఢిల్లీకి మారింది. -
'కొంత ఆశ్చర్యం.. మరికొంత ఆనందం'
జైపూర్: గగన్ ఖోడా.. రాజస్థాన్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ 1998, మే నెలలో భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. అందులో అతని అత్యధిక స్కోరు 89 పరుగులు. కాగా, ఆ తరువాత అతనికి జట్టులో స్థానం దక్కలేదు. అప్పట్లో గగన్ కు జాతీయ జట్టులో స్థానం దక్కపోవడానికి కారణాలు అప్రస్తుతమే అయినా.. తాజాగా భారత క్రికెట్ సెలెక్టర్ గా ఎంపికై వార్తలో నిలిచాడు. సెంట్రల్ జోన్ నుంచి రాజేందర్ సింగం హన్స్ స్థానంలో గగన్ ఖోడాకు సెలెక్షన్ కమిటీలో అవకాశం కల్పించారు. అయితే దీనిపై గగన్ ఖోడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నాకు బీసీసీఐ సెలెక్టర్ గా ఎంపికైనట్లు పిలుపు వచ్చింది. నేను నిజంగా ఆశ్చర్యానికి గురయ్యా. చాలా కాలం నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్ననాకు బీసీసీఐ నుంచి కాల్ రావడాన్ని నమ్మలేకపోయా. నేను ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కంపెనీలో పని చేస్తున్నా. నాకు బీసీసీఐ అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా' అని ఖోడా ఆనందం వ్యక్తం చేశాడు. గగన్ ఖోడా 132 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ఆడి 8,516 పరుగులు చేశాడు. దాదాపు 40.00 సగటుతో 20 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు చేశాడు. అందులో అతని బెస్ట్ 300 పరుగులు. కాగా, భారత క్రికెట్ జట్టులో ఆడటానికి అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. కాగా, జాతీయ క్రికెట్ ను వదిలేసిన 17 ఏళ్లకు గగన్ కు ఈ రూపంలో అదృష్టం తలుపు తట్టడం నిజంగా గొప్ప విషయమే కదా..