సానియా-హింగిస్ ‘సిక్సర్’
- ఇండో-స్విస్ జంటకే గ్వాంగ్జూ ఓపెన్ టైటిల్
- ఈ సీజన్లో ఈ జోడీకిది ఆరో ట్రోఫీ
గ్వాంగ్జూ (చైనా): ‘సరిలేరు మాకెవ్వరూ’ అంటూ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ జంట ఈ సీజన్లో తమ ఖాతాలో ఆరో టైటిల్ను జమ చేసుకుంది. శనివారం ముగిసిన గ్వాంగ్జూ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్లో ఈ ఇండో-స్విస్ ద్వయం విజేతగా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 6-3, 6-1తో జు షిలిన్-యు జియోడి (చైనా) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన సానియా జంటకు 12,300 డాలర్ల (రూ. 8 లక్షల 13 వేలు) ప్రైజ్మనీతోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
- 58 నిమిషాలపాటు జరిగిన ఈ టైటిల్ పోరులో సానియా జంట నాలుగు ఏస్లు సంధించడంతోపాటు ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయినప్పటికీ, ప్రత్యర్థి సర్వీస్ను ఐదు సార్లు బ్రేక్ చేశారు.
- ఓవరాల్గా ఈ ఏడాది సానియా మీర్జాకిది ఏడో డబుల్స్ టైటిల్ కాగా... హింగిస్తో జతగా ఆరోది కావడం విశేషం. ఆదివారం చైనాలో మొదలయ్యే వుహాన్ ఓపెన్లోనూ టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగే సానియా-హింగిస్ జంటకు నేరుగా రెండో రౌండ్లోకి ‘బై’ లభించింది.
- ఈ ఏడాదే హింగిస్ను డబుల్స్ భాగస్వామిగా చేసుకున్న సానియా ఆమెతో కలిసి 13 టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. ఇందులో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్, చార్ల్స్టన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్జూ ఓపెన్లలో టైటిల్స్ సాధించింది.
- గ్వాంగ్జూ ఓపెన్లో టాప్ సీడ్ హోదాలో నేరుగా క్వార్టర్ ఫైనల్కు ‘బై’ పొందిన ఈ ఇండో-స్విస్ ద్వయం టైటిల్ నెగ్గే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోకకపోవడం విశేషం. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లోనూ సానియా-హింగిస్ జోడీ ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా విజేతగా నిలిచింది.