hindukush mountains
-
ముంచుకొస్తున్న ముప్పు
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్తోపాటు ఐస్ల్యాండ్లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్మింగ్ యాంగ్ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్మింగ్ యాంగ్ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు. -
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. భారత్లోనూ ప్రకంపనలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్ను తాకాయి.వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్లో హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl— Niv Calderon (@nivcalderon) April 16, 2025 -
Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్షీర్ గురించి తెలుసా?
పంజ్షీర్.. కొద్ది రోజులుగా ఈ పేరు అంతర్జాతీయంగా మారు మోగుతోంది. చుట్టూ పర్వతాలే కోట గోడలా రక్షణనిస్తున్న ఆ లోయవైపు ఇన్నాళ్లూ ఎవరూ కన్నెత్తి కూడా చూడలేకపోయారు. ఇప్పుడు తాలిబన్లు ఆ లోయపై పట్టు బిగించాలని చూస్తూ ఉంటే మరోవైపు తాలిబన్ వ్యతిరేక శక్తులు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. ఎందుకీ లోయపై తాలిబన్లకు అంత మక్కువ? అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్కు ఈశాన్యంగా 150 కి.మీ. దూరంలో హిందుకుష్ పర్వత సానువుల్లో పంజ్షీర్ లోయ ఉంది. దీనిని అయిదు సింహాల లోయ అని కూడా పిలుస్తారు. ఈ లోయకి ఆ పర్వతాలే రక్షణ కవచాల్లా నిలుస్తాయి. ఈ లోయలోకి వెళ్లాలంటే పంజ్షీర్ నది వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ఇరుకైన రహదారి మాత్రమే మార్గం. అందుకే అక్కడి స్థానికులకు ఈ లోయను కాపాడుకోవడం అత్యంత సులభంగా మారింది. భౌగోళికంగా చూస్తే అఫ్గాన్తో సంబంధం లేనట్టుగానే ఉంటుంది కానీ దేశంలో ఉన్న 34 ప్రావిన్స్లలో పంజ్షీర్ కూడా ఒకటి. చారిత్రకంగా చూస్తే పలుమార్లు నిర్ణయాత్మక పాత్రని పోషించింది. మొదట్నుంచి ఎవరికీ తలవంచకుండా సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్న ఈ లోయపై ఆధిపత్యం సాధించడానికి తాలిబన్లు ఈసారి తీవ్రంగా ప్రయతి్నస్తున్నారు. పోరాటాల గడ్డ పంజ్షీర్ అంటే అహ్మద్ షా మసూద్ గురించి చెప్పుకోవాలి. 1953 సంవత్సరంలో ఈ లోయలో జన్మించిన మసూద్ తనకంటూ ఒక గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇస్లాం మత శక్తులతో తనలో చివరి ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూ వచ్చారు. పంజ్షీర్ లోయ స్వతంత్రతని కాపాడారు. 1980 దశకంలో అఫ్గాన్ను సోవియెట్ యూనియన్ దురాక్రమణ చేసినప్పుడు, 1990 నాటి అంతర్యుద్ధం సమయంలో, తాలిబన్లు దేశాన్ని పాలించిన 1996–2001 మధ్య కాలంలో కానీ ఈ లోయ ఎప్పుడూ ఎవరి వశం కాలేదంటే మసూద్ పోరాట పటిమే కారణం. ఆ లోయలో లక్షా 50 వేల మంది వరకు నివసిస్తారు. వారంతా తాజిక్ తెగకు చెందిన వారు. మరోవైపు పాస్తూన్ తెగ వారు ఎక్కువగా తాలిబన్ ముఠాలో చేరారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు మçసూద్ శక్తియుక్తులతో వారు ఆ లోయవైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు. పంజ్షీర్ లోయతో పాటు చైనా, తజికిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య పాకిస్తాన్ వరకు ఆయన ప్రభావమే ఉండేది. మసూద్కి సంప్రదాయ ఇస్లామ్ భావాలు ఉన్నప్పటికీ సమాజంలో మహిళలకు సమాన స్థానం ఇవ్వాలని ఆరాటపడేవారు. అయితే మసూద్ గ్రూప్ సభ్యులే ఎక్కువగా మానహక్కుల్ని హరించారన్న విమర్శలు ఉన్నాయి. 2001లో మసూద్ని అల్ఖాయిదా ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ లోయను నడిపిస్తున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, మాజీ రక్షణ మంత్రి బిస్మిల్లా మొహమ్మద్లు కూడా ఆయనకు సహకరిస్తూ లోయను కాపాడుతున్నారు. పచ్చల లోయ ఈ లోయలో ఎక్కువగా ఎమరాల్డ్ (పచ్చలు) లభిస్తాయి. ఇప్పటివరకు ఇంకా తవ్వకం చేపట్టని ఎన్నో పచ్చల గనులు ఉన్నాయి. అవే ఈ ప్రాంతానికి ప్రధాన ఆదాయ వనరు. అమెరికా నాటో దళాలు స్వాదీనంలో అఫ్గాన్ ఉన్నప్పుడు ఈ లోయలో కూడా ఎంతో అభివృద్ధి జరిగింది. అఫ్గాన్లో ఇంధనానికి ఒక హబ్గా మారింది. ఎన్నో జలవిద్యుత్ ఆనకట్టల్ని ఈ లోయలో నిర్మించారు. విద్యుత్లో స్వయంసమృద్ధిని సాధించిన ప్రాంతం ఇదొక్కటే. పచ్చల గనులతో ఆర్థికంగా పటిష్టంగా ఉండడంతో తాలిబన్లు ఈ లోయని ఆక్రమించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. పంజ్షీర్కు ఎదురయ్యే సవాళ్లేంటి ? పంజ్షీర్లో పచ్చలు, వెండి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆహారం, వైద్యం అవసరాల కోసం అఫ్గాన్లో ఇతర ప్రాంతాలపై ఆధారపడక తప్పదు. ప్రస్తుతం ఈ లోయ చుట్టూ తాలిబన్లు తమ కమాండర్లను మోహరించారు. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా నిలిపివేశారు. అయితే ఆ లోయలో వచ్చే చలికాలం వరకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరించే ఆ లోయ తమ ఉనికిని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగించేలా కనిపిస్తోంది. పంజ్షీర్పై పూటకొక రకమైన వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో అంతిమ విజయం ఎవరిదో వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్లో భారీ భూకంపం
♦ 89 మందికి గాయాలు ♦ భారత్లోనూ ప్రకంపనలు ♦ కశ్మీర్లో ఒకరి మృతి ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: హిందూకుష్ పర్వతాల్లో శనివారం భారీ భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో వచ్చిన ఈ విపత్తు ధాటికి పాకి స్తాన్లో 89 మంది గాయపడ్డారు. ఒక్క పెషావర్లోనే 59 మందికి గాయాలయ్యారు. భారత్, తజికిస్తాన్లోనూ ప్రకంపనలు వచ్చాయి. జమ్మూకశ్మీర్లో ఒకరు చనిపోయారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం కాబూల్కు 280 కి.మీ. దూరంలోని భూమికి 203 కి.మీ దిగువన నమోదైంది. కాబూల్, ఇస్లామాబాద్ తదితర చోట్ల భూకంప ప్రభావం కనిపించింది. హరియాణా, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయి. కశ్మీర్లోని మెంధార్లో భూకంపంలో ఒకరు మృతిచెందారు. జరీద్ అహ్మద్ అనే యువకుడు కుటుంబ సభ్యులను ఇంటి నుంచి బయటకు తీసుకొస్తూ కుప్పకూలి చనిపోయాడు. -
పాకిస్థాన్ను వణికించిన భూకంపం
పాకిస్థాన్లోని వాయవ్య ప్రాంతంలో పెను భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. దీంతో ప్రజలు భయకంపితులయ్యారు. భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్లోని హిందూకుష్ పర్వతాల్లో ఉంది. ఇది ఖైబర్-ఫక్తుంఖ్వా రాష్ట్ర రాజధాని పెషావర్, చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే, ప్రభావిత ప్రాంతాల్లో ఎవరూ మృతి చెందినట్లు మాత్రం సమాచారం అందలేదు. 50 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. మన్షేరా, చిత్రాల్, బజౌర్, మింగోరా, మాలాకండ్ జిల్లాల్లో కూడా భూకంప ప్రభావం ఉంది. కాగా, పాక్ నైరుతి దిశలోని బెలూచిస్థాన్ ప్రాంతంలో 5.3 తీవ్రతతో శుక్రవారంనాడే ఓ భూకంపం వచ్చింది. 2005లో 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 74వేల మంది మరణించారు.