భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్