Integrated Terminal Building
-
చెన్నై ఎయిర్పోర్ట్లో మరో కొత్త టర్మినల్
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.1,260 కోట్లతో నిర్మించిన నూతన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ భవంతి(ఫేజ్–1)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అద్భుత రీతిలో ఈ టర్మినల్కు తుదిరూపునిచ్చారు. ‘ సంవత్సరానికి 2.3 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్పోర్ట్ నూతన టర్మినల్ ఏర్పాటుతో ఇక మీదట ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది’ అని ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు సంప్రదాయాల్లో ఒకటైన కొల్లం(రంగోళీ), విశేష ప్రాచుర్యం పొందిన పురాతన ఆలయాలు, భరతనాట్యం, రాష్ట్రంలోని ప్రకృతి సోయగాలు, వారసత్వంగా వస్తున్న స్థానిక చీరలు ఇలా తమిళనాడుకే ప్రత్యేకమైన విశిష్టతల మేళవింపుగా భిన్న డిజైన్లతో నూతన టర్మినల్ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. నూతన టర్మినల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతోపాటు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా పాల్గొన్నారు. దీంతోపాటు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో చెన్నై–కోయంబత్తూరు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘అద్భుత నగరాలకు అనుసంధానించిన వందేభారత్కు కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా మోదీ ట్వీట్చేశారు. కొత్త రైలురాకతో రెండు నగరాల మధ్య ప్రయాణకాలం గంటకుపైగా తగ్గనుంది. రాష్ట్ర రాజధాని, పారిశ్రామిక పట్టణం మధ్య ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలు ఇదే కావడం విశేషం. సేలం, ఈరోడ్, తిరుపూర్లలోనూ ఈ రైలు ఆగుతుంది. బుధవారం మినహా అన్ని వారాల్లో ఈ రైలు రాకపోకలు కొనసాగుతాయి. వివేకానంద హౌజ్ను సందర్శించిన మోదీ చెన్నై పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నగరంలోని వివేకానంద హౌజ్ను దర్శించారు. 1897లో స్వామి వివేకానంద ఈ భవంతిలోనే తొమ్మిదిరోజులు బస చేశారు. రామకృష్ణ మఠ్ 125వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడారు. ‘ రామకృష్ణమఠ్ అంటే నాకెంతో గౌరవం. నా జీవితంలో ఈ మఠం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది. పాశ్చాత్య దేశాలకు పయనంకాకముందు వివేకానందుడు బసచేసిన ఈ భవంతిని దర్శించడం నాకు దక్కిన ఒక మంచి అవకాశం. ఇక్కడ ధ్యానం చేయడం ప్రత్యేకమైన అనుభవం. ఇది నాకెంతో ప్రేరణను, కొండంత బలాన్ని ఇస్తోంది. ఆధునిక సాంకేతికత సాయంతో పురాతనమైన నాటి గొప్ప ఆలోచనలు నేడు ముందు తరాలకు అందుతుండటం చాలా సంతోషదాయకం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి మోదీ ఘన నివాళులర్పించారు. -
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ
-
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ
వడోదర(గుజరాత్): వడోదర ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకు వచ్చామన్నారు. కేరళలోని కొచ్చి, గుజరాత్లోని వడోదరలో గ్రీన్ ఎయిర్ పోర్ట్లు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎంతో అధునికత వస్తోందని, రైళ్లలో కొత్త సాంకేతికత తీసుకొస్తామని చెప్పారు. త్వరలో వడోదరలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. -
జెట్ స్పీడ్ !
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభివృద్ధి అడుగు ముందుకు పడుతోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ప్లాన్ రూపకల్పనకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సన్నాహాలు చేస్తోంది. అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు బోయింగ్, కార్గో విమానాలు కూడా రాకపోకలు సాగించేలా రన్వే విస్తరించనున్నారు. గన్నవరం : విజయవాడ సమీపంలో రాజధాని ప్రకటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్తో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి ఏఏఐ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఉన్న సుమారు 500 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న 490 ఎకరాలు అప్పగిస్తే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తామని ఎయిర్పోర్టు అథారిటీ అధికారులు పేర్కొంటున్నారు. భూసేకరణ పూర్తయిన మూడేళ్లలోనే ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ఏఏఐ కూడా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో... విమానాశ్రయ విస్తరణలో భాగంగా సుమారు 700 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుగా వీలుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ను నిర్మించడంతో పాటు భారీ బోయింగ్ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 9,500 అడుగుల రన్వేను సుమారు 12,500 అడుగుల వరకు విస్తరించనున్నట్లు ఎయిర్పోర్టు డెరైక్టర్ రాజ్కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. కార్గో సర్వీసులు నడిపేందుకు అనువైన వసతులతో పాటు అప్రాన్, కార్ పార్కింగ్, ఏటీసీ టవర్ తదితర నూతన హంగులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.