International Rice Research Institute
-
తెల్ల బియ్యం తిన్నా... షుగర్ పెరగదు
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసెమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రాలో గ్లైసెమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్కు వచ్చి న ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వ చ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు అధిక ప్రొటీన్ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్పీవోల ద్వారా సాగు.. మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్అత్యల్ప గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు రెట్టింపు ప్రొటీన్ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికికేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. -
స్వాతి నాయక్కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
క్లైమేట్ స్మార్ట్ రైస్ : ఆరోగ్యంగా జీవించొచ్చు
లాస్ బనోస్, మనీలా(ఫిలిప్పీన్స్) : ఏడు రకాల అటవీ వరి వంగడాల జన్యువుల ద్వారా కొత్త రకపు వరి విత్తనాల అభివృద్ధి పూర్తయినట్లు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్ఆర్ఐ) ప్రకటించింది. ఈ విత్తునాల ద్వారా ఉత్పత్తి చేసిన పంటను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని సాగించొచ్చని పేర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వంగడాలను ‘క్లైమేట్ స్మార్ట్ రైస్’ గా పేర్కొనచ్చని తెలిపింది. భూ మండలంపై సంభవించే వాతావరణ మార్పులను తట్టుకుని అధిక ఉత్పత్తిని ఈ వంగడాలు అందజేస్తాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని వెల్లడించింది. చాలా రకాల జీవ, నిర్జీవ సంబంధిత వ్యాధులను ఈ వంగడాలు నిరోధిస్తాయని వెల్లడించింది. ’నేచుర్ జెనెటిక్స్’ అనే జర్నల్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని తెలిపింది. -
కరువులోనూ అధిక దిగుబడినిచ్చే వరి!
ఫలించిన జపాన్ శాస్త్రవేత్తల కృషి డీఆర్ఓ1 జన్యువుతో కూడిన సరికొత్త వంగడానికి రూపకల్పన తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సాధారణ వరి కన్నా మూడున్నర రెట్ల దిగుబడి.. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ ధాన్యం దిగుబడి దారుణంగా తగ్గిపోతుందన్న భయం ఇక అక్కర్లేదు. కరువు పరిస్థితులతో నీటి కొరత నెలకొన్న సందర్భాల్లోనూ మూడున్నర రెట్ల వరకు దిగుబడిని అందించే అత్యాధునిక వరి వంగడం అందుబాటులోకి రానుంది. జపాన్ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. జన్యుమార్పిడి సాంకేతికత జోలికి పోకుండానే వీరు ఈ ఘనతను సాధించడం విశేషం. సాధారణంగా వరి మొక్కల వేళ్లు భూమిలోకి మరీ ఎక్కువ లోతుకు వెళ్లవు. తక్కువ లోతులోనే పక్కలకు పాకుతాయి. అందువల్లే ఏమాత్రం పూర్తిస్థాయిలో నీటి తడులు అందకపోయినా తట్టుకోలేవు. ఫలితంగా ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడంపై జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రోబయోలాజికల్ సెన్సైస్కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేశారు. డీపర్ రూటింగ్ 1(డీఆర్ఓ1) అనే జన్యువును గుర్తించి ఈ సమస్యను అధిగమించారు. మామూలు వరి వంగడం వేళ్ల కన్నా.. ఈ జన్యువు కలిగి ఉన్న వరి వంగడాల వేళ్లు భూమిలోకి రెట్టింపు లోతు వరకూ చొచ్చుకెళతాయని ముఖ్య పరిశోధకుడు యుసకు యుగ తెలిపారు. లోతుకు వెళ్లిన ఈ వేళ్లు భూమి లోపలి పొరల్లో నుంచి నీటిని, పోషకాలను మొక్కకు అందిస్తాయని వివరించారు. ఒక మోస్తరు నీటికొరత ఉన్న పరిస్థితుల్లో సాధారణ వరితో పోల్చితే ఈ వరి వంగడం రెట్టింపు దిగుబడి ఇస్తోందని తెలిపారు. అదే తీవ్రమైన కరువు పరిస్థితుల్లో సాధారణ వరి దిగుబడి బాగా తగ్గిపోగా.. ఈ వంగడం దిగుబడి మాత్రం దానికంటే 3.6 రెట్లు ఎక్కువగా వచ్చిందని వెల్లడించారు. ‘‘డీఆర్ఓ1 జన్యువు 60కిపైగా వరి వంగడాల్లో ఉంది. అయితే ఇవన్నీ వేళ్లను లోతుగా చొప్పించగలిగే వంగడాలు కాదు. వేళ్లను లోతుగా చొప్పించలేని మేలు రకం వరితో డీఆర్ఓ1 జన్యువు ఉన్న వరి వంగడాన్ని సంకరం చేసి సరికొత్త వంగడాన్ని రూపొందించాం’’ అని ఆయన వివరించారు. భారత్కు ఉపయోగకరం.. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) అంచనాల ప్రకారం విశ్వవిపణిలో బియ్యం ధరలను అదుపులో ఉంచాలంటే ఏటా 80 లక్షల నుంచి కోటి టన్నులను అదనంగా పండించాల్సి ఉంటుంది. దీనిని బట్టి.. కరువును సమర్థంగా ఎదుర్కొనేలా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఆవశ్యకత ఎంత ఉందనేది వేరే చెప్పనక్కర్లేదు. భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో కరువువస్తే వరి దిగుబడి 40 శాతం వరకు పడిపోతూ ఉంటుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పలేని స్థితి నెలకొంది. అందువల్ల భారత్కు ఇటువంటి వంగడాలు ఎంతో ఉపయోగకరమని ‘ఇరి’ ప్రతినిధి సోఫీ క్లేటన్ పేర్కొన్నారు. -సాక్షి స్పెషల్ డెస్క్