Iphlu
-
ఇఫ్లూ అడ్మిషన్లలో అయోమయం
► పారదర్శకత లేని ప్రవేశాలు ► నిబంధనలు పాటించని యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో 2016–17వ సంవత్సరానికి ప్రవేశాల్లో జరుగుతున్న అవకతవకలు యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించినప్పుడు సీటు సంపాదించిన విద్యార్థితో పాటు 1:8 లెక్కన జనరల్ కేటగిరీలో వెయిటింగ్ లిస్ట్ ప్రకటించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలైతే రాసిన అందరు విద్యార్థుల పేర్లను సీటు సంపాదించిన విద్యార్థి జాబితాతో పాటు వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలి. కానీ ఇఫ్లూలో ఇంతవరకు ఏ విభాగంలోనూ వెయిటింగ్ లిస్టే పెట్టిన పాపాన పోలేదు. ఇది యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కడమేనని విద్యార్థులు వాపోతున్నారు. దీనికి తోడు ఇఫ్లూలోని మరో తంతు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను కూడా జనరల్ కేటగిరీలో కాకుండా రిజర్వుడు జాబితాలో పెడుతున్నారు. ఉదాహరణకు ఎంఏ స్పానిష్ కోసం దరఖాస్తు చేసిన వాడపల్లి వెంకటేశ్వరరావు (హాల్ టికెట్ నంబర్ 2060888) అనే ఎస్సీ విద్యార్థి 53 మార్కులతో జనరల్ వారికన్నా ముందున్నాడు. అయినప్పటికీ ఈ విద్యార్థికి ఓపెన్ కేటగిరీలో కాకుండా, ఎస్సీ కేటగిరీలోనే సీటు ఇచ్చారు. దీనివల్ల మరో ఎస్సీ విద్యార్థి సీటు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా వెయిటింగ్ లిస్ట్ సైతం ప్రకటించకపోవడం మరింత అయోమయానికి దారి తీస్తోంది. -
ఇఫ్లూలో ఇద్దరు విద్యార్థుల అరెస్టు
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వర్సిటీ నుంచి బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) యాజమాన్యం గురువారం ఇద్దరు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకుగానూ ఈ ఇద్దరు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహించారు. గతంలో క్యాంపస్లోనే ఈ పరీక్షల నిర్వహణ జరిగేది. కానీ ఈసారి నగరంలోని కొన్ని ప్రైవేటు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహించారు. పరీక్ష హాలుకి అరగంట ముందు వస్తే చాలని ప్రకటించిన యాజమాన్యం తీరా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకున్నా పరీక్షకి అనుమతించలేదు. దీంతో 70 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఆన్లైన్ పరీక్షా కేంద్రానికి సమయానికే వచ్చినా పరీక్ష రాయలేకపోయామని నాచారంలోని పరీక్ష కేంద్రం నుం చి తిరిగి వెళ్లిపోయిన నాగేంద్ర, రవికుమార్ అనే విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకపోవడంపై ఇఫ్లూ ప్రొక్టర్ కోనా ప్రకాశ్రెడ్డిని విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నించడమే నేరంగా భావించిన ఇఫ్లూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కేరళ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేశారు. అయితే ఈ విద్యార్థులను వర్సిటీలోనికి మాత్రం అనుమతించలేదు. సెక్యూరి టీసిబ్బంది వారిని వర్సిటీ గేటువద్దే అడ్డుకున్నారు.