Jabbar
-
అమెరికాలో వరుస దాడులు
వాషింగ్టన్: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత తొలి 24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం అమెరికాలో మూడు భీకర దాడులు జరిగాయి. 16 మంది మరణించారు. పదులు సంఖ్యలో జనం క్షతగాత్రులుగా మారారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం న్యూ ఆర్లియన్స్లో జరిగిన దాడిలో 15 మంది మృతి చెందారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రేరణతో ఓ దుండగుడు జనంపైకి వాహనంపై దూసుకెళ్లాడు. తర్వాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని హతమార్చారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ సమీపంలో టెస్లా కారు పేలిపోయింది. ఒకరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. తర్వాత బుధవారం రాత్రి న్యూయార్క్ నైట్క్లబ్లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం వాటిల్లలేదు. అయితే, ఈ మూడు ఘటనలకూ పరస్పరం సంబంధం ఉందని, ఇవన్నీ ముమ్మాటికీ ఉగ్రవాద దాడులేనని ప్రజలు అను మానం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు రెండు ఘటనలను ఉగ్రదాడి కోణంలో విచారణ సాగిస్తుండడం గమనార్హం. జబ్బార్ ట్రక్కులో ఐసిస్ జెండా న్యూ ఆర్లియన్స్లోని బార్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి శంషుద్దీన్ జబ్బార్ అనే వ్యక్తి వాహనంతో దూసుకొచ్చాడు. ఫోర్డ్ ఎఫ్–150 అద్దె ట్రక్కుతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత రైఫిల్తో జనంపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో జబ్బార్ హతమయ్యాడు. ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించినట్లు ఎఫ్బీఐ అధికారులు చెబుతున్నారు. లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ వద్ద టెస్లా కారును పేల్చేసిన వ్యక్తి, జబ్బార్కు సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారిద్దరూ గతంలో ఒకే మిలటరీ స్థావరంలో పనిచేశారు. న్యూ ఆర్లియన్స్ దాడిని ఉగ్రవాద దాడిగానే దర్యాప్తు అధికారులు పరిగ ణిస్తున్నారు. ఎక్కువ మందిని చంపాలన్న ఉద్దేశంతోనే జబ్బార్ దాడి చేశాడని అంటున్నారు. ఐసిస్ తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో ఎఫ్బీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాలు ఒకే యాప్ నుంచి.. న్యూ ఆర్లియన్స్ దాడికి ఉపయోగించిన ట్రక్కును, లాస్ వెగాస్ దాడిలో ఉపయోగించిన టెస్లా కారును ‘టూరో యాప్’ నుంచే అద్దెకు తీసుకున్నారు. వాహనంలో బ్యాటరీ వల్ల ఈ పేలుడు జరగలేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ధ్రువీకరించారు. కారులో పేలుడు పదార్థాలను అమర్చడం వల్లే అది పేలిందని అన్నారు. కారులో లోపం ఏమీ లేదని స్పష్టంచేశారు. టెస్లా కారు పేలుడు వ్యవహారాన్ని సైతం అధికారులు ఉగ్రవాద దాడి కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. కొలరాడోలోని కొలరాడో స్ప్రింగ్స్లో ఈ వాహనాన్ని దుండగుడు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, సదరు దుండగుడి పేరును ఇంకా బయటపెట్టలేదు. కానీ స్థానిక మీడియా కథనం ప్రకారం... మాథ్యూ లివెల్స్బర్గర్ అనే ఈ దుండగుడు కొలరాడో స్ప్రింగ్స్ కారును అద్దెకు తీసుకున్నాడు. కారులో తొలుత నెవడాకు చేరుకున్నాడు. అందులో బాణాసంచా, మోర్టార్స్, గ్యాస్ క్యాన్లు అమర్చాడు. అనంతరం లాస్ వెగాస్లో ట్రంప్ హోటల్ ఎదుట పేల్చేశాడు.నైట్క్లబ్లో 30 రౌండ్ల కాల్పులు మూడో ఘటన విషయానికొస్తే న్యూ యార్క్లో క్వీన్స్ ప్రాంతంలోని నైట్క్లబ్ వద్ద కాల్పులు జరిగాయి. కనీసం 12 మంది గాయపడ్డారు. క్లబ్ బయట వేచి ఉన్న జనంపైకి దాదాపు నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కనీసం 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి దుండుగులు పరారయ్యారు. -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
నాగర్కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో ముంపునకు గురై భూమి, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జబ్బార్ అన్నారు. శనివారం నాగర్కర్నూల్లోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ నం.123ని ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించడం వల్ల హైకోర్టు ఈ జీఓను కొట్టివేసిందన్నారు. 2013చట్టం ప్రకారమే రైతులకు పరిహారం చెల్లించాలని సూచించిందన్నారు. అయినా మరోసారి జీఓ నం.190, సమన్వయ కమిటీ పేరుతో భూనిర్వాసితులను ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. నార్లాపూర్, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, ఏదుల రిజర్వాయర్ పరిధిలో 39గ్రామాలు మునిగిపోతే ఇప్పటికీ ఆదుకోలేదన్నారు. తక్షణమే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు భూ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
పాన్గల్ : రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జబ్బార్ ఆరోపించారు. శుక్రవారం పాన్గల్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాగా ప్రకటించి ఎనిమిది నెలలైనా రైతులకు పరిహారం అందలేదన్నారు. దీంతో ఖరీఫ్ సీజన్ పెట్టుబడులకోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇటు మూడోవిడత రుణమాఫీ, అటు పరిహారం అందక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. భీమా కాల్వల లైనింగ్, పంట కాల్వలను పూర్తి చేశాకే నీటిని విడుదల చేయాలన్నారు. దళిత, గిరిజనులకు భూపంపిణీ, మైనారిటీలకు రిజర్వేషన్ అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఇలా ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 17 తర్వాత పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు వెంకటయ్య, ఫయాజ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస చట్టం అమలు చేయాలి
ఆలూరు (గట్టు ) : పునరావాస చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. ఆదివారం గట్టు మండలంలోని ఆలూరు గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005లో ఈ గ్రామం ర్యాలంపాడుపాడు రిజర్వాయర్లో ముంపునకు గురైందన్నారు. దీంతో మూడువేల ఎకరాలను రైతులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. పరిహారం చాలా తక్కువగా ఇచ్చినట్లు ఆరోపించారు. చెరువులో ముంపునకు గురైన 32 ఎకరాలకు పరిహారమే ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రంలో పూర్తిస్థాయిలో ప్లాట్లు కేటాయించలేదని, కనీస సౌకర్యాలు కల్పించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు అధికారులు ఒత్తిడి తెస్తున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం చేయాలన్నారు. ఈనెల 26న పోరాట నిర్వాసిత కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఉప్పేరు నర్సింహ, రాజు, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మహబూబ్నగర్(దేవరకద్ర): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... దేవరకద్ర మండలం చౌదరిపల్లి గ్రామం వద్ద ఓ ట్యాంకర్ అదుపు తప్పి వంతెనను ఢీకొట్టింది. దీంతో ఆ రోడ్డులో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలంలో ట్రాఫిక్ను మల్లిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జబ్బర్ను ఒక బైక్ పై ముగ్గురు వేగంగా వెళుతూ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, కానిస్టేబుల్, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.